
ప్రధాని నరేంద్ర మోడీకి వైట్హౌస్లో ఘన స్వాగతం లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్లు మోడీకి ఎదురొచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆ దేశ సాయుధ దళాల నుంచి మోడీ గౌరవ వందనం స్వీకరించారు. ప్రధానికి గౌరవ సూచికంగా 19 గన్ సెల్యూట్తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సమయంలో భారత్, అమెరికా జాతీయ గీతాలను ఆర్మీ బ్యాండ్ ప్లే చేసింది. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై బైడెన్, మోడీలు సంతకాలు చేశారు.
అనంతరం మోడీ మాట్లాడుతూ.. అగ్రరాజ్యంలో తనకు దక్కిన గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు , 4 మిలియన్ల మంది భారతీయ అమెరికన్లకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. 3 దశాబ్ధాల క్రితం సామాన్యుడిగా అమెరికాకు వచ్చినట్లు ప్రధాని గుర్తుచేసుకున్నారు. నాడు వైట్హౌస్ను బయటి నుంచి చూశానని.. ప్రధాని అయ్యాక పలుమార్లు అమెరికాను సందర్శించానని మోడీ తెలిపారు.
అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఇరు దేశాల రాజ్యాంగం ‘‘మేము, ప్రజలు’’ అనే పదంతో ప్రారంభమవుతుందని మోడీ తెలిపారు. కోవిడ్ అనంతరకాలంలో ప్రపంచ క్రమం కొత్త రూపాన్ని సంతరించుకుందని మోడీ చెప్పారు. ప్రపంచ శ్రేయస్సు, శాంతి, స్థిరత్వం కోసం తాము కలిసి పనిచేయడానికి సిద్ధంగా వున్నామన్నారు.
జో బైడెన్ మాట్లాడుతూ.. భారత్, అమెరికాల బంధం చాలా గొప్పదన్నారు. రెండు గొప్ప దేశాలు 21వ శతాబ్ధపు గమనాన్ని నిర్వచించగలరని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్ అమెరికాలు కలిసి పనిచేయడం చాలా అవసరమన్నారు. పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులు, హెల్త్ కేర్, ఆహార భద్రత వంటి అంశాల్లో భారత్, అమెరికాలు కలిసి పనిచేస్తున్నాయని బైడెన్ తెలిపారు. తాను ఉపాధ్యక్షుడిగా వున్నప్పటి నుంచి మోడీతో సన్నిహిత సంబంధాలు వున్నాయని, అమెరికా అధ్యక్షుడైన తర్వాతి నుంచి విశ్వాసం ఆధారంగా ఇద్దరం సంబంధాన్ని ఏర్పరచుకున్నామని బైడెన్ వెల్లడించారు.
ఇకపోతే.. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచడానికి ఉద్దేశించిన రక్షణ సహకారం నుంచి అంతరిక్ష యాత్ర వరకు భారీ ప్రకటనలు ఈరోజు చేయబడ్డాయి. బైడెన్తో ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోడీ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేయడానికి భారత ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో జతకట్టినట్లు అమెరికన్ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్ అనుబంధ ఏరోస్పేస్ విభాగం ప్రకటించింది.