
లండన్ : బ్రిటన్ రాజు ఛార్లెస్-3 దంపతులకు చేదు అనుభవం ఎదురయింది. ఉత్తర ఇంగ్లాండ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చార్లెస్ దంపతులపై ఓ వ్యక్తి గుడ్లతో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసే రాజు ఛార్లెస్-3.. ఈ సారి మాత్రం తదేకంగా చూస్తూ ఉండిపోయారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇంగ్లాండ్ లోని యార్క్ నగరంలో జరిగిన ఓ సంప్రదాయ వేడుకలో రాజు ఛార్లెస్-3, సతీమణి కెమిల్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన పౌరులతో కరచాలనం చేస్తూ, వారిని పలకరిస్తూ ముందుకు సాగారు. అదే సమయంలో జనసమూహంలో ఉన్న ఓ వ్యక్తి రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఛార్లెస్ పై గుడ్లు విసిరాడు. ఊహించని పరిణామంతో దంపతులిద్దరూ కొద్దిసేపు అక్కడే నిలబడిపోయారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్ ను పాలించిన క్వీన్ ఎలిజబెత్ 2 ఈ ఏడాది సెప్టెంబర్లో మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్రిటన్ నూతన రాజుగా ఛార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు. రాజు హోదాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నచార్లెస్కు ఇంగ్లాండ్లో ఇలా ఊహించని అనుభవం ఎదురైంది.