అంతరిక్షయానంలో హ్యాట్రిక్...భారత సంతతి ఆడబిడ్డ సునీత అదరగొడుతోంది..! 

By Arun Kumar PFirst Published May 6, 2024, 4:38 PM IST
Highlights

సునీత విలియమ్స్... భారత సంతతి ఆడబిడ్డ మరోసారి అంతరిక్షయానానికి సిద్దమయ్యింది. ముచ్చటగా మూడోసారి ధైర్యంగా స్పేస్ లోకి వెళుతున్న సునీత విలియమ్స్ కు భారత ప్రజలు  అభినందనలు తెలుపుతున్నారు.  

దేశ విదేశాల్లో స్థిరపడిన భారతీయులు వివిధ రంగాల్లో రాణిస్తూ దేశ గౌరవాన్ని మరింత పెంచుతున్నారు.  ఐటీ,  విద్యా, వైద్యం, వ్యాపారం... రంగమేదయినా సరే భారతీయులు లేదంటే ఈ సంతతివారు టాప్ లో వుండాల్సిందే. చివరకు రాజకీయాల్లోనూ రాణిస్తూ బ్రిటన్ ప్రధాని రిషి సునక్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ వంటివారు అగ్రదేశాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. అయితే ఇదంతా ఇప్పుడు... కానీ చాలాకాలం కిందటే ఓ భారత సంతతి మహిళ అంతరిక్షయానం చేసి చరిత్ర సృష్టించింది. ఒక్కసారి కాదు రెండుసార్లు అంతరిక్ష యాత్ర చేసిన మన ఆడబిడ్డ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి నింగిలోకి ఎగిరేందుకు సిద్దమవుతోంది. ఆమె ఇంకెవరో కాదు సునీత విలియమ్స్. 

 భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ ను మరోసారి అంతరిక్షయానంకోసం ఎంపిక చేసారు. ఇప్పటికే అంతరిక్షంలోని పరిస్థితులను తట్టుకునేందుకు శిక్షణ పూర్తిచేసుకున్ని సునీత రేపు అంటే మే 7వ తేదీన స్పేస్ లోకి దూసుకెళ్లనున్నారు.  బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పెస్ షిప్ లో మరో వ్యోమగామి బుచ్ విల్కోర్ తో కలిసి సునీత అంతరిక్షయానం చేస్తున్నారు. మంగళవారం ఉదయం 8.04 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి వ్యోమగాముల యాత్ర ప్రారంభంకానుంది. 

బోయింగ్ సంస్థ ఇంతకు ముందు మానవ రహిత ప్రయోగాలు చేపట్టింది... కానీ మనుషులను అంతరిక్షంలోకి పంపించడం ఇదే మొదటిసారి. దీంతో ఈ ప్రయోగం ఎలా సాగుతుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మన ఆడబిడ్డ సునీత కూడా ఈ అంతరిక్షయాత్రలో భాగం కావడంతో భారతీయులూ ఆసక్తిగా గమనిస్తున్నారు.  

సునీత విలియమ్స్ ఇప్పటికే అంతరిక్షంలో ఎన్నో విజయాలు సాధించారు. అంతరిక్షంలో ఎక్కువసమయం గడిపిన రికార్డ్ (322
 రోజులు‌) ఆమె పేరిట వుంది. 2006 లో ఓసారి , 2012లో మరోసారి అంతరిక్షంలోకి వెళ్లిన సునీత నెలల తరబడి అక్కడే వున్నారు. ఈ సమయంలోనే    50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.

ఎవరీ సునీత విలియమ్స్ ? 

గుజరాత్ రాష్ట్రంలోని మొహసాలా జిల్లా జులాసన్ గ్రామానికి చెందిన దీపక్ పాండ్యా ఉపాధి నిమిత్తం అమెరికా వెళ్లాడు. అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్న అతడు బోనీ పాండ్యాను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతుల కూతురే సునీత విలియమ్స్. 

1965 సెప్టెంబర్ 19న ఒహియోలో సునీత జన్మించారు.  1987 లో నావల్ అకాడమీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ డిగ్రీ చేసారు. అనంతరం కొంతకాలం యూఎస్ నేవీలో పనిచేసారు. ఆ తర్వాత అమెరికా స్పేస్ ఏజన్సీ నాసాలో చేరి అరుదైన అవకాశాలు అందుకున్నారు. ఆమె అంతరిక్ష పరిశోధనలకు అందిస్తున్న సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మ భూషణ్ తో సత్కరించింది.   
 

click me!