
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ రష్యా ల మధ్య యుద్ధం 11వ రోజుకు చేరింది. ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలపై రష్యన్ సైన్యాలు విరుచకపడుతున్నాయి. ఇప్పటికే ఖేర్సన్, మరియుపోల్, వోల్నోవాఖ నగరాలను రష్యా బలగాలు ఆక్రమించాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ను హస్తగతం చేసుకోవాలని.. రష్యా దళాలు బాంబు దాడులను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ బలగాలు కూడా ఏ మాత్రం తగ్గేదేలే.. అన్నట్టు ప్రతిఘటిస్తున్నాయి.
దీంతో ఉక్రెయిన్ నగరాల్లో ఎటు చూసినా.. బాంబు పేలుళ్లు, మిసెల్స్ దాడులతో ఉక్రెయిన్ నగరాలు.. శ్మశానాల్లా మారాయి. దీంతో ఇక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. రష్యా దాడుల్లో ఆ దేశ ప్రజలే కాదు.. అక్కడ నివాసం ఉంటున్న ఇతర దేశాల ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే యుద్దం తక్షణమే నిలివేయాలని ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ను ప్రారంభించింది. ఉక్రెయిన్ లో గగనతల ఆంక్షలు కొనసాగుతుండటంతో పొరుగు దేశాలైన రొమేనియా, పోలాండ్, హంగేరీ, స్లోవేకియా ద్వారా భారతీయ పౌరులను, ముఖ్యంగా విద్యార్థులను విమానాల ద్వారా తరలిస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు 15,920 మంది భారతీయ విద్యార్థులను 76 విమానాల ద్వారా స్వదేశానికి తరలించింది. ఇందులో గరిష్టంగా.. రొమేనియా నుంచి 6680 మంది విద్యార్థులను, హంగేరీ నుంచి 5,300 మందిని , పోలాండ్ నుంచి 2,822 మందిని, స్లోవేకియా నుంచి 1,118 మందిని తరలించారు.
ఈ తరుణంలో ఉక్రెయిన్లోని సుమీలో చిక్కుకున్న విద్యార్థులను భారత రాయబార కార్యాలయం ఆదివారం నోటీసుతో జారీ చేసింది. బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది. సుమీలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించడానికి పోల్టావా సిటీలో ఒక బృందం ఉందని రాయబార కార్యాలయం పేర్కొంది. తరలింపు సమయం,తేదీ త్వరలో జారీ చేయబడుతుందనీ, ఎంబసీ సోషల్ మీడియా పోస్ట్లో తెలిపింది.
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో మాట్లాడుతూ, "సుమీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను పోల్టావా ద్వారా పశ్చిమ సరిహద్దు నుంచి.. సురక్షితంగా తరలించడానికి భారత రాయబార కార్యాలయం బృందం పోల్టావా సిటీలో ఉంది. త్వరలోనే తేదీ ఖరారు చేస్తాం. భారతీయ విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు.