
న్యూఢిల్లీ: సాధారణ హత్యానేరం అనగానే మరో మనిషే నేరానికి పాల్పడ్డాడని అందరూ భావిస్తారు. అంతేగానీ, ఓ కుక్కనో, ఓ పిల్లో, ఓ మేకనో, ఓ గొర్రెనో చేస్తాయనే ఆలోచన మదిలో కనీసం మెదలదు. కానీ, ఆఫ్రికా ఖండంలోని ఓ దేశంలో ఇలాంటి విచిత్ర కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. 45 ఏళ్ల ఓ మహిళను కొమ్ములతో దాడి చేసి చంపేసినట్టు ఓ గొర్రెపై హత్యానేరం మోపారు. అదే నిజమైంది. చివరకు ఆ గొర్రెకే శిక్ష కూడా పడింది. ఆ గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు కోర్టు తీర్పు కూడా ఇచ్చేసింది. ఆలోచించడానికి చాలా విచిత్రంగా అనిపిస్తున్నా.. నిజంగా ఇది దక్షిణ సుడాన్ దేశంలో జరిగింది.
దక్షిణ సుడాన్లోని రుంబెక్ ఈస్ట్లో అకుయెల్ యోల్ అనే ఏరియాలో ఇదే నెలలో 45 ఏళ్ల అదియు చాపింగ్ అనే మహిళపై ఓ గొర్రె దాడి చేసింది. తరుచూ ఆమెపై కొమ్ములతో దాడి చేసింది. ఆ గొర్రె తలతో పదే పదే పొడవడంతో ఆ మహిళ పక్కటెముకలు తీవ్రంగా గాయపడ్డారు. పక్కటెముకలు విరగడంతోపాట అంతర్గతంగా ఆమె బాడీలో చాలా దెబ్బలు తగిలాయి. తీవ్ర గాయాల కారణంగా ఆమె మరణించింది.
ఈ ఘటన తర్వాత పోలీసు కేసు నమోదైంది. ముందుగా గొర్రెల యజమానిని అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ, ఆయన నిర్దోషి అని తేల్చారు. ఫలితంగా ఆమె మరణానికి కారణం గొర్రెనే అనేది నిర్దారించారు. ఈ ఘటన జరిగిన తర్వాత గొర్రె పిల్లనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ తగువు కోర్టు దాకా వెళ్లింది. కోర్టు విచారించి తీర్పు వెలువరించింది. మహిళ మరణానికి గొర్రెల యజమాని కాదని, గొర్రె పిల్లనే అని నిర్దారించింది. ఆ తర్వాత గొర్రె పిల్లకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. గర్రెల యజమాని బాధిత కుటుంబానికి ఐదు పశువులను పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు, ఆ దేశ చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని ఏదైనా జంతువు చంపితే.. ఆ జంతువు బాధిత కుటుంబానికి చెంది తీరాలని ఉన్నట్టు కోర్టు తెలిపింది. కాబట్టి, మరణించిన ఆ మహిళ కుటుంబానికి మూడేళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆ గొర్రె పిల్లను అప్పగించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ మూడేళ్లు గొర్రె పిల్లను అడ్యూల్ కౌంటీ సైనిక శిబిరంలో ఉంచాలని ఆదేశించింది.
ఈ కేసులో నిందిత(గొర్రె పిల్ల యజమాని కుటుంబం), బాధిత కుటుంబాలు రెండు ఇరుగు పొరుగున జీవించేవే కావడం గమనార్హం.