
యువరాణి అయితే ఏంటీ స్వేచ్ఛ లేకపోతే.. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న మాట. అన్నది ఎవరో కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా చెప్పుకునే దుబాయ్ రాజు కుమార్తె యువరాణి లతీఫా. ‘ఈ విల్లా ఓ జైలులా మారిపోయింది. నేను బందీగా పడి ఉన్నాను’ అంటున్న ఓ వీడియో క్లిప్ ఇప్పుడు మరోసారి సంచలనం రేపుతుంది.
బాత్రూంలో ఓ మూలకు నక్కి ఏడుస్తున్న తీరు చూస్తుంటే ఎవరికైనా గుండె కరుగుతుంది. ఎడారి దేశంలో యువరాణి అయినా ఆమె పరిస్థితి వణుకుపుట్టిస్తుంది. ఇక దేశంలోని మహిళలకు ఉన్న కట్టుబాట్ల గురించి మరోసారి చర్చకు దారి తీసింది. యువరాణిగా పుట్టినందుు తనకు స్వేచ్ఛ లేదని, రాచకుటుంబ ఆంక్షల చట్రం నుంచి బయటపడేందుకు గతంలో లతీఫా గట్టిగానే ప్రయత్నించింది.
దుబాయ్ ప్రధాని, రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మకతూమ్ కుమార్తె అయిన లతీఫా అమెరికాలో ఆశ్రయం పొందాలనే ఆలోచనతో తమ అధికారుల కళ్లు గప్పి పడవలో పారిపోయేందుకు రెండేళ్ల క్రితం ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నం బెడిసి కొట్టి ఆమె మళ్లీ రాచమహల్ కు చేరుకున్నారు.
పారిపోయే ప్రయత్నాలో భాగంగా ఫిన్ల్యాండ్ లోని తన స్నేహితురాలు తినా జౌహానియన్, ఫ్రాన్స్కు చెందిన కెప్టెన్ హెర్వ్ జాబెర్ట్, మరో ముగ్గురు సిబ్బందితో కలిసి మరపడవలో ఆమె బయల్దేరారు. అయితే వెంటనే అప్రమత్తమైన ఆమె భద్రతా సిబ్బంది లతీఫాను భారత్లోని గోవా తీర ప్రాంతంలో కనిపెట్టారు. అక్కడికి చేరుకున్న యూఏఈ అధికారులు అక్కడి నుంచి ఆమెను తిరిగి దుబాయ్ తీసుకువెళ్లారు.
ఈ క్రమంలో తన తండ్రి వేధింపులు భరించలేక పారిపోతున్నానని లతీఫా గతంలో రికార్డు చేసిన వీడియోను బ్రిటన్కు చెందిన మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేటివ్ న్యూస్ ప్రోగ్రాం పనోరమలో భాగంగా బీబీసీ మంగళవారం మరో క్లిప్ ను విడుదల చేసింది.
ఆ క్లిప్ లో ‘‘ఇక్కడ నేనొక ఖైదీని. జైలులాంటి విల్లాలో నేను ఉండలేను. ఇంటిముందు ఓ ఐదుగురు పోలీసులు, ఇంట్లో ఇద్దరు పోలీస్ అధికారులున్నారు. నా భద్రత, నా జీవితం గురించి ప్రతీరోజూ నేను ఆందోళన పడుతూనే ఉన్నారు. రోజురోజుకీ నా పరిస్థితి మరింత దిగజారి పోతుంది. ఈ జైలులో బతకలేను. నాకు స్వేచ్ఛ కావాలి’’ అని లతీఫా బాధతో అంటున్న మాటలు ఉన్నాయి. అయితే దీన్ని ఎప్పుడు రికార్డ్ చేశారన్న విషయం మీద మాత్రం స్పష్టత లేదు.
అయితే గోవా నుండి లతీఫాను వెనక్కి తీసుకువెళ్లిన తరువాత.. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మాజీ హైకమిషనర్, ఐర్లాండ్ మాజీ అధ్యక్షురాలు మేరీ రాబిన్ సన్ దుబాయ్ రాజు ఇంట్లో ఆమెను కలిశారు.
ఆ టైంలో వీరిద్దరూ కలిసి కూర్చుని భోజనం చేస్తున్న ఫొటోలను యూఏఈ అధికారులు విడుదల చేయడం ద్వారా లతీఫా క్షేమంగానే ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పటికీ తాను బందీగానే ఉన్నానంటూ లతీఫా ఆవేదన వ్యక్తం చేసిన క్లిప్ బైటికి రావడం గమనార్హం.