
న్యూఢిల్లీ: శ్రీలంక, పాకిస్తాన్ మొదలు చాద్, జాంబియా దేశాల వరకు ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలోకి జారిపోతున్నాయి. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కునారిల్లిపోయింది. ఈ నేపథ్యంలోనే పలు విత్త సంస్థలు, చారిటీలు ఆందోళనలు వెలిబుచ్చాయి. పేద దేశాల్లో తీవ్ర రుణ సంక్షోభం ఏర్పడుతున్నదని హెచ్చరికలు జారీ చేశాయి. వీటి జాబితాలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ) కూడా మంగళవరం చేరింది.
యూఎన్డీపీ తాజాగా ఓ రిపోర్టు విడుదల చేసింది. దీని ప్రకారం 54 దేశాలు ఇప్పటి కిప్పుడు రుణం పొందాల్సిన అవసరం ఉన్నదని తెలిపింది. ఈ దేశాల్లోనే జనాభా ప్రపంచంలోని సగం పేద ప్రజలకు ఎక్కువగా ఉన్నారని వివరించింది. ఈ దేశాలకు రుణ సహాయం చేయకుంటే.. ఇవి మరింత పేదరికంలోకి కూరుకుపోతాయని పేర్కొంది. అందుకే వీటికి రుణ సదుపాయం కల్పించి పర్యావరణ మార్పులతో డీల్ చేసే అవకాశాన్ని కలిగించాలని వివరించింది.
‘అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో సీరియస్ రుణ సంక్షోభం తలెత్తుతున్నది. ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఎక్కువ కలిగిస్తున్నాయి’ అని మంగళవారం ఈ నివేదిక తెలిపింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ ఈ వారం వాషింగ్టన్లో సమావేశమైన తరుణంలో తాజా హెచ్చరికలు రావడం గమనార్హం.
రుణాలను మాఫీ చేయడం, వీలైనన్ని ఎక్కువ దేశాలకు అవకాశాలు కల్పించాలని, సంక్షోభాల కాలంలో వారు కొంత స్వేచ్ఛ పొందడానికి ప్రత్యేక ఒప్పందాల కోసం క్లాజులు చేర్చాలని యూఎన్డీపీ అడ్మినిస్ట్రేటర్ అచిమ్ స్టెయినర్ తెలిపారు. పరిస్థితులు చేజారిపోకముందే వెంటనే రంగంలోకి దిగి పరిష్కారాల కోసం అన్వేషించడం నేటి తక్షణ అవసరం అని వివరించారు.
మెరుగైన రుణ విధానాలు లేకుంటే పేదరికం పెరుగుతుంది. పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి అత్యావశ్యకమైన పెట్టుబడులు రావు.
జీ20 సారథ్యంలో జరిగిన ఫ్రేమ్వర్క్లో మార్పులు చేయాలని వివరించింది. కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థలకు సహకరించడానికి ఈ ఫ్రేమ్ వర్క్ రూపొందించారు. వీటిని చాద్, ఇథియోపియా, జాంబియాలు మాత్రమే ఇప్పటి వరకు వినియోగించుకున్నాయి. అందుకే ఈ ఫ్రేమ్ వర్క్ ద్వారా కలిగే అవకాశాలను విస్తృతం చేయాలని, 70 దేశాలు లేదా అంతకంటే ఎక్కువ పేద దేశాలు వీటి ఫలాలు వినియోగించుకునేలా మార్పులు చేయాలని యూఎన్డీపీ సూచించింది.