ఆసియాలో కోవిడ్ మళ్లీ విజృంభణ..హాంకాంగ్, చైనా, సింగపూర్‌లో విపరీతంగా పెరుగుతున్న కేసులు

Bhavana ThotaUpdated : May 17 2025, 10:33 AM IST

ఆసియాలో కోవిడ్ కేసులు మరోసారి విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి హాంకాంగ్, చైనా, సింగపూర్, థాయిలాండ్‌లో కొత్తగా కేసులు నమోదవుతున్నాయి.

ప్రపంచంలోని కొన్ని ఆసియా దేశాల్లో మళ్లీ కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. హాంకాంగ్, చైనా, సింగపూర్, థాయిలాండ్‌లలో ఇటీవల కొన్ని వారాలుగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు ఆరోగ్య శాఖలు వెల్లడించాయి. వీటి వలన అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది.హాంకాంగ్‌లో ఇటీవల కొన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అవసరమయ్యే తీవ్ర లక్షణాలున్న రోగుల సంఖ్య పెరుగుతుండగా, చైనాలో కూడా ఆరోగ్య కేంద్రాల వద్ద తిరిగి రద్దీ మొదలైంది. సింగపూర్‌లో ప్రత్యేకంగా ఎక్స్‌ప్యాట్లు నివసించే ప్రాంతాల్లో కొంతమంది వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు. థాయిలాండ్‌లో ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో కొవిడ్ వ్యాప్తి మళ్లీ ప్రారంభమవుతోంది.

అయితే, ఈ అన్ని మార్పులు జరిగినా భారత్‌లో పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, భారత్‌లో కొత్తగా నమోదవుతున్న కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది కొంతవరకు వ్యాక్సినేషన్, గతంలో ఏర్పడిన హర్డ్ ఇమ్యూనిటీ వంటివి ప్రభావితం కావచ్చని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం భారత్‌లో అప్రమత్తంగా ఉండే పరిస్థితి లేదన్న మాట కాదు. విదేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమానయాన రంగంలో ఎలాంటి మార్పులు అవసరమవుతాయా అన్నదానిపై ప్రభుత్వం సమీక్ష చేస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్, ఉష్ణోగ్రతలు, సింప్టమ్స్ ఆధారంగా తనిఖీలు మొదలయ్యే అవకాశముంది.ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉన్నా, ఇప్పటివరకు భారత్‌లో అంతగా ప్రభావం కనిపించకపోవడమే. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరం. మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్ వాడకాన్ని పూర్తిగా మర్చిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో కోవిడ్ మళ్లీ శిరోముని ఎత్తినా, భారతదేశం దానిపై బలమైన నియంత్రణలో ఉంది. అయితే భవిష్యత్‌లో పరిస్థితులు ఎలా మారతాయన్నదానిపై పూర్తి అవగాహనతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Read more Articles on
click me!