అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ఆర్థిక ప్రతిపాదనతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. అమెరికాలో ఉన్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు పంపే నగదు బదిలీలపై 5 శాతం పన్ను విధించాలని ఆయన సూచించారు. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన నేపథ్యంలో, ఈ ప్రతిపాదన రిపబ్లికన్ వర్గాల నుంచి మద్దతు పొందుతోంది.
ఈ కొత్త రెమిటెన్స్ పన్ను ప్రతిపాదన ప్రస్తుతం అమెరికా ప్రతినిధుల సభలో బిల్లుగా ప్రవేశపెట్టనున్నారు. ఇది అమల్లోకి వస్తే, అమెరికాలో పనిచేస్తున్న హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డు కలిగినవారు, ఇతర ప్రవాసీయులు తాము పంపే డబ్బుపై 5 శాతం అదనపు భారం మోపాల్సి వస్తుంది.
భారతీయులపై దీని ప్రభావం చాలా పెద్దది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన మొత్తం రెమిటెన్స్లు సుమారు 118.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అందులో అమెరికా నుంచే 27 శాతం అంటే 32 బిలియన్ డాలర్లు వచ్చాయి. దీనిపై 5 శాతం పన్ను విధిస్తే దాదాపు 1.64 బిలియన్ డాలర్లు భారతీయులు మాత్రమే చెల్లించాల్సి వస్తుంది.ఒకప్పుడు గల్ఫ్ దేశాల నుంచే ఎక్కువ నగదు బదిలీ వస్తుండగా, ఇప్పుడు అమెరికా, బ్రిటన్, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటివి ప్రధానంగా మారాయి. ఈ దేశాల నుంచి వచ్చే మొత్తం రెమిటెన్స్లలో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది.
ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం, రెమిటెన్స్ రూపంలో అత్యధికంగా ఆదాయం పొందే దేశంగా భారత్ 2008 నుంచి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది ప్రపంచ మొత్తం రెమిటెన్స్లలో 14 శాతం భారత్కు వచ్చిందని అంచనా. మొత్తం రెమిటెన్స్ విలువ దాదాపు 129 బిలియన్ డాలర్లని పేర్కొన్నారు.ఈ పరిస్థితుల్లో అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం, లక్షలాది మంది భారతీయ ప్రవాసులకు ఆర్థికంగా కొత్త భారంగా మారే అవకాశముంది. ట్రంప్ ప్రతిపాదన చర్చకు వచ్చిన నేపథ్యంలో, ఇది ఎంతమేరకు మారుతుందో చూడాల్సిందే.