అమెరికా విధించిన తాజా ఆంక్షలపై రష్యా తీవ్ర స్థాయిలో మండిపడింది
మాస్కో: అమెరికా విధించిన తాజా ఆంక్షలపై రష్యా తీవ్ర స్థాయిలో మండిపడింది. అమెరికా నిప్పుతో చెలగాటమాడుతోందనీ.. అంతకు మించిన ప్రమాదం, మూర్ఖత్వం మరోటి ఉండదని రష్యా విదేశాంగ సహాయమంత్రి సర్జీ రియాబ్కోవ్ హెచ్చరించారు.
రష్యా రక్షణ, నిఘా రంగంతో పాటు మరో 33 మంది వ్యక్తులు, సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చుతూ అమెరికా నిర్ణయం తీసుకున్న కొద్ది గంటలకే ఆయన ఈ విషయంపై ఘాటుగా స్పందించారు.
అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దేశాలపై సీఏఏటీఎస్ఏని ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తోంది.ఈ చట్టం కింద అమెరికా నిషేధించిన దేశాలు, సంస్థలతో మిత్రదేశాలు వాణిజ్యం కొనసాగిస్తే వాటిపైనా అమెరికా ఆంక్షలు విధిస్తుంది. అమెరికా విధించిన ఆంక్షలపై రియాబ్కోవ్ స్పందించారు.
తమపై చిందులేసినంత మాత్రాన ఏమీ ప్రయోజనం లేదని అమెరికా గుర్తించాలన్నారు. ఆంక్షలు విధించే వాషింగ్టన్ పాలకులు ఒకసారి చరిత్ర అధ్యయనం చేయాలని సూచించారు.. అమెరికా-రష్యా సంబంధాల్లో అనాలోచితంగా అలజడిరేపిన వారు... ఒక్కసారి ప్రపంచ స్థిరత్వాన్ని కూడా గుర్తుచేసుకుంటే మంచిదని హితవు పలికారు.
నిప్పుతో చెలగాటమాడడం మూర్ఖత్వం. అది ఊహించని ప్రమాదానికి దారితీస్తుందని రియాబ్కోవ్ తీవ్రంగా హెచ్చరించారు. అంతుకుముందు విధించిన ఆంక్షల వల్ల ప్రయోజనం దక్కలేదని గుర్తుంచుకోవాలన్నారు.