
Air Pollution Chokes Thailand: థాయ్ లాండ్ లో వాయు కాలష్యంతో లక్షలాది మంది ప్రజలు ఆస్పత్రిపాలయ్యారు. అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించింది. థాయ్ లాండ్ మీడియా నివేదికల ప్రకారం.. బ్యాంకాక్ లో గత వారం రోజుల్లో 2 లక్షల మంది ఆస్పత్రుల్లో చేరారు. వాయుకాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఈ చేరికలు పెరిగాయని ఆస్పత్రుల వర్గాలు పేర్కొంటున్నాయి. పర్యాటకానికి ప్రసిద్ది చెందిన ఈ ప్రాంతంలో పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే పొగ, పొలాల్లో కాలిపోయిన పంట వ్యర్థాల కారణంగా వాయు కాలుష్యం పెరిగింది. ఈ క్రమంలోనే గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
బ్యాంకాక్ లో మూడు నెలల్లో 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో గత వారం రోజుల్లో 2 లక్షల మంది ఆసుపత్రిలో చేరారు. మరోవైపు ప్రజలు ఎన్-95 మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో పిల్లలు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.
పిల్లల విషయంలో జాగ్రత్తలు..
థాయ్ లాండ్ లో కాలుష్యం గణనీయంగా పెరుగుతున్నదని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. బ్యాంకాక్ అధికారులు జనవరి నుంచి ఇంటి నుంచే పనిచేయాలని ప్రజలకు సూచించారు. అంటే ఈ పరిస్థితులు వాయుకాలుష్యం ముప్పు ఇక్కడ ఎంతగా పెరిగిపోతోందనేదానికి నిదర్శనంగా నిలుస్తోంది. వాహనాల నుంచి వెలువడే పొగను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఏఎఫ్ పీ నివేదించింది.
వాయు కాలుష్యం నేపథ్యంలో పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలోనే నర్సరీలు, పాఠశాలల్లో 'నో డస్ట్ రూమ్స్' ఏర్పాటు చేశారు. వాటిలో ఎయిర్ ప్యూరిఫయర్లను ఉంచారు. ప్రస్తుతానికి స్కూళ్లు మూతపడలేదు కానీ కాలుష్య తీవ్రత తగ్గకుంటే కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రానున్న కాలంలో ప్రజలను ఇళ్లలోనే ఉంచేందుకు కఠిన ఆంక్షలు విధించాల్సి రావచ్చునని థాయ్ లాండ్ మీడియా నివేదించింది.
ఆందోళనకరంగా గాలికాలుష్య కణాలు..
ధూళి కణాలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, బ్యాంకాక్ గాలిలో పీఎం 2.5 కణాల పరిమాణం (కాలుష్యానికి కారణమయ్యే చాలా సూక్ష్మ కణాలు) చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ కణాలు రక్తంలోకి ప్రవేశిస్తాయి.. దీని కారణంగా వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నాయి. గాలిలో ఉండే పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) మానవ ఊపిరితిత్తులకు విషం లాంటిదనీ, తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుందని చెబుతున్నారు. అవి అకాల మరణానికి కూడా కారణమవుతాయని తెలుపుతున్నారు.