హైదరాబాదులో నాలుగు ఫ్యామిలీలకు ఒకే బాత్రూమ్: 15 మందికి కరోనా పాజిటివ్

By telugu teamFirst Published May 16, 2020, 4:18 PM IST
Highlights

హైదరాబాదులోని మంగళహాట్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే బాత్రూమ్ వాడడం వల్ల నాలుగు కుటుంబాలకు చెందిన 15 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒకరి నుంచి చాలా మందికి కరోనా వైరస్ విస్తరిస్తన్న జాడలు బయటపడుతున్నాయి. తెలంగాణ జిల్లాల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ గ్రేటర్ హైదరాబాదులో మాత్రం కేసులు పెరుగుతున్నాయి. 

హైదరాబాదులోని మంగల్ హాట్ లో పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగిళ్లకు ఒకే బాత్రూమ్ ఉండడంతో 15 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మంగళ్ హాట్ లోని కామటిపురా బస్తీలో మే 11వ తేదీన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అతను నివసించే భవనంలోని మరో నాలుగు కుటుంబాలవారికి కూడా కూడా కరోనా వైరస్ సోకిటన్లు తేలింది. 

వారందరికీ పరీక్షలు చేయగా 15 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. నాలుగు కుటుంబాలు కూడా ఒకే బాత్రూమ్ వాడడం వల్ల వాళ్లందరికీ కరోనా వైరస్ సోకినట్లు అధికారులు భావిస్తున్నారు. హైదరబాదులో ఈ నెల 330 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య వేయి దాటింది.

హైదరాబాదులోని నాలుగు జోన్లకు కరోనా వైరస్ పరిమితమైంది. ఎల్బీ నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయి. గురువారంనాడు కొత్తగా 47 కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కేసుల సంఖ్య 1,414కు చేరుకుంది. కరోనా వైరస్ తో తెలంగాణలో ఇప్పటి 34 మంది మరణించారు.

click me!