సొంతపుత్రుడితో డైట్ దీక్ష....దత్తపుత్రుడితో రాంగ్ మార్చ్...: చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్యే సెటైర్లు

By Arun Kumar PFirst Published Nov 2, 2019, 11:24 PM IST
Highlights

విశాఖపట్నంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్ ఓ రాంగ్ మార్చ్ అంటూ వైసిపి ఎమ్మెల్యే ధర్మశ్రీ షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ యాక్షన్ కొనసాగుతోందని ఆరోపించారు.

అమరావతి: రాష్ట్రంలో ఇసుక విషయంలో ఎటువంటి లొసుగులు లేవని వైఎస్‌ఆర్‌‌సిపి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు.  లాంగ్ మార్చ్‌ తో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల మద్య ముసుగు తొలగిపోయిందన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌ లోనే పవన్‌ కళ్యాణ్‌ లాంగ్ మార్చ్‌ నిర్వహిస్తున్నారని... తెరవెనుక జరుగుతున్న ఒప్పందాలు దీనితో బయటపడుతున్నాయని ఆరోపించారు. 

సిఎం జగన్‌ పై బురదచల్లేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకు లోకేష్ రాజకీయాలకు పనికిరాడని నిర్ణయించుకున్న చంద్రబాబు ఇప్పుడు దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్ ను తెర మీదికి తీసుకు వచ్చాడన్నారు.    లాంగ్ మార్చ్ కోసం పవన్‌ కళ్యాణ్ కు చంద్రబాబు ఎంత ముట్టచెప్పారో స్పష్టం చేయాలని కోరారు.

గత ఎన్నికల్లో చంద్రబాబు నుంచి వంద కోట్ల రూపాయలు తీసుకుని గాజువాక, భీమవరంలో ఖర్చుపెట్టిన విషయం నిజం కాదా...?    కృష్ణానది పక్కన వున్న విజయవాడ, గోదావరి పక్కన వున్న రాజమండ్రి, వంశధార పక్కన వున్న శ్రీకాకుళంలో పవన్‌ లాంగ్ మార్చ్ పెట్టగలరా...?ఇది లాంగ్ మార్చ్ కాదు... రాంగ్ మార్చ్ అని ఎద్దేవా చేశారు.

read more  విశాఖ లాంగ్ మార్చ్ ని విజయవంతం చేయండి: పవన్ కళ్యాణ్ పిలుపు

కృష్ణా, గోదావరితో పాటు అన్ని నదుల్లో వరద కొనసాగుతున్న విషయం ప్రజలకు తెలుసన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇసుకను తవ్వి తీయడం సాధ్యం కాదని...    దీనికి పక్కదోవ పట్టిస్తూ ఇసుక వివాదం అంటూ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ లు రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన ఆత్మహత్యలను కూడా ఇసుక కోసం అంటూ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

సొంత బావ హరికృష్ణ శవం సాక్షిగా శవరాజకీయాలు చేసిన చరిత్ర చంద్రబాబుదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ కోసం చంద్రబాబు చెప్పినట్లు పవన్ కళ్యాణ్‌  పనిచేస్తున్నారని... ఇప్పటి వరకు దత్తపుత్రుడుగా వున్న పవన్‌ కళ్యాణ్‌ ఈ లాంగ్ మార్చ్ డ్రామాతో పచ్చపుత్రుడుగా మారిపోయాడని ఎద్దేవా  చేశారు.

రాష్ట్రంలో వర్షాల వల్ల వ్యవసాయంకు మేలు జరుగుతోందని...రైతులు, వ్యవసాయ కూలీలు సంతోషంగా వున్నారన్నారు. పదేళ్లలో పడని వర్షాలు ఇప్పుడు కురుస్తున్నాయని... దవళేశ్వరం వద్ద గోదావరి బ్రహ్మాండంగా పారుతోందని తెలిపారు. ఇంత వరద వుందని తెలిసి కూడా లాంగ్ మార్చి పెట్టారంటే     చంద్రబాబు నుంచి పవన్ ఎంత అందుకున్నాడో స్పష్టం చేయాలన్నారు. 

read more లాంగ్ మార్చ్ కు అన్ని అనుమతులు రెడీ...కావాలనే దుష్ప్రచారం..: నాదెండ్ల

 అయిదేళ్లలో చంద్రబాబు హయాంలో ఇసుక దోపిడీ జరిగినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు లాంగ్ మార్చ్ చేయలేదు? రాష్ట్రంలో వర్షాలు పడటం,  నదులు ప్రవాహంతో వుండటం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. రైతులకు సాగునీటి కష్టాలు తీరడం ఇష్టం లేదని...రైతులు, వ్యవసాయ కూలీలు కష్టంలో వుంటేనే వారికి ఆనందనమన్నారు.  

ఏదో ఒకరకంగా వైఎస్‌ జగన్‌ పై బురద చల్లేందుకు పవన్‌ కళ్యాణ్‌ ను చంద్రబాబు ఉసిగొల్పుతున్నారన్నారు.  గత అయిదేళ్లలో చంద్రబాబు ఇంటి పక్కన కొట్లాది రూపాయల ఇసుక దోపిడీ జరిగిన ప్రదేశాన్ని ఎప్పుడైనా పవన్‌ చూశారా...? అందుకు చంద్రబాబు నుంచి పవన్ కు అందిన ప్యాకేజీ ఎంత?     చంద్రబాబు ఇసుక దందాపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వందకోట్లు జరిమానా విధించింది.  దీనిపై ఎప్పుడైనా పవన్‌ కళ్యాణ్ మాట్లాడారా.. ప్రశ్నించారా...? అని ప్రశ్నించారు.

 శవ రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు చేయడం మాకు చేతకాదని తెలిపారు. జల కష్టాలను రాజకీయ పండుగలా చేసుకునేందుక చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారన్నారు. నిజ జీవితంలో లాంగ్ మార్చ్ అనే పదం పవన్‌ కళ్యాణ్ కు సరిపోదని విమర్శించారు. సరైన కారణం లేకుండా లాంగ్ మార్చ్ అంటూ నాటకాలు ఆడవద్దని...పవన్‌ కళ్యాణ్ వి అన్నీ షార్ట్ మార్చ్ లేనని ఎద్దేవా చేశారు.

 డైట్‌ కంట్రోల్‌ కోసం సొంత పుత్రుడు లోకేష్‌తో చంద్రబాబు నిరాహారదీక్ష డ్రామా ఆడించారన్నారు. ఇప్పుడు విశాఖలో దత్తపుత్రుడు పవన్ తో లాంగ్ మార్చ్ చేయిస్తున్నారు. 
 2019 ఎన్నికల్లో ఇసుక దందా సొమ్మును చంద్రబాబు నుంచి తీసుకుని గాజువాక, బీమవరంలో పవన్‌ ఖర్చు పెట్టారని... మళ్ళీ చంద్రబాబు ఎజెండాతోనే పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ బయటకు వస్తున్నారని దర్మశ్రీ ఆరోపించారు.  
 

click me!