ప్రజా సమస్యలను పరిష్కరించడం ఇలాగేనా...?: చంద్రబాబు ఫైర్

By Arun Kumar PFirst Published Oct 11, 2019, 5:24 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికన సంచలన కామెంట్స్ చేశారు. 

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇసుక అక్రమాలకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. మచిలీపట్నంలో ఆయన దీక్షాస్థలికి వెళ్లడానికి ముందే అదుపులోకి తీసుకుని తిరిగి ఇంటివద్ద వదిలిపెట్టారు. దీంతో ఆయన తన ఇంటివద్దే దీక్ష చేపట్టారు. ఈ పరిణామాలపై తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికన స్పందించారు. 

''విశాఖలో మా ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణలపై కేసులు పెట్టారు. అక్రమ కేసులు పెడితే ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయా? ఇకనైనా రాజకీయ వేధింపులకు స్వస్తి చెప్పి పాలనపై దృష్టి పెట్టండి. పేదల ఆకాంక్షలు నెరవేర్చండి. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాను. 

ప్రభుత్వం ఇసుక కొరత సృష్టించి పేదల పొట్టకొట్టడాన్ని నిరసిస్తూ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న36 గంటల దీక్షను అడ్డుకోవడం మరో అరాచకం. ప్రజాందోళనలు అణిచివేయడంపై పెట్టే శ్రద్ధలో పదో వంతు పేదల సమస్యల పరిష్కారంపై పెడితే ఈ దుస్థితి ఉండదు.'' అంటూ చంద్రబాబు వైఎస్సార్‌సిపి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. 

అయితే ఈ ట్విట్లను చంద్రబాబు  #JaganFailedCM(జగన్ ఫెయిల్డ్ సీఎం) యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు. దీంతో కేవలం ట్విట్టర్ లో పేర్కొన్న విషయమే కాదు ఈ యాష్ ట్యాగ్ కూడా చర్చనీయాంశంగా మారింది. 
 

click me!