బిసి రిజర్వేషన్లపై జగన్ కోర్టుకెందుకు వెళ్లలేదంటే: ఎమ్మెల్యే సత్యప్రసాద్

By Arun Kumar PFirst Published Mar 20, 2020, 11:38 PM IST
Highlights

పీపీఏల రద్దు మొదలు మొన్నటికి మొన్న రాజధాని భూముల్లో ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం వరకు వైసిపి ప్రభత్వం వరుసగా న్యాయస్థానాలతో మొట్టికాయలు వేయించుకుంటూనే ఉందని టిడిపి  ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. 

గుంటూరు: విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ విభాగాలను కర్నూలుకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వానికి మరో చెంపదెబ్బ అని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. కర్నూలుకు తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.13ను న్యాయస్థానం రద్దు చేయడం ద్వారా జగన్ నిర్ణయాలు ఎంత అనాలోచితమో, ఎంత ఏకపక్షమో స్పష్టమైంది. గతంలో న్యాయస్థానం చెప్పినా ఏకపక్షంగా వ్యవహరింస్తోందన్నారు. 

పీపీఏల రద్దు మొదలు మొన్నటికి మొన్న రాజధాని భూముల్లో ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం వరకు ప్రభత్వం వరుసగా మొట్టికాయలు వేయించుకుంటూనే ఉందని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 50కి పైగా వ్యతిరేక తీర్పులు ఇచ్చి న్యాయస్థానం మొట్టికాయలు వేసిందన్నారు. అంటే ప్రతి వారం క్రమం తప్పకుండా హైకోర్టు చివాట్లు పెట్టడం జరిగిందన్నారు.

కరోనాపై జగన్ వ్యాఖ్యల ఎఫెక్ట్... ఏపికి విదేశాల నుండి డాక్టర్ల బృందాలు: వర్ల ఎద్దేవా

రాజ్యాంగ సంస్థలు విమర్శించడం జగన్ తుగ్లక్ పరిపాలనకు అద్దం పడుతోందన్నారు. ఆయన 10 నెలల పాలనలో కేవలం రంగులు మార్చడం తప్ప చేసింది శూన్యమని... రాజ్యాంగానికి విరుద్దంగా ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ జెండాలు, జాతి పిత విగ్రహాలు, శ్మశానాలను సైతం వదలకుండా రూ.1500 కోట్లతో తమ పార్టీ రంగులు వేసుకున్నారని మండిపడ్డారు

10 రోజుల్లో  రంగులన్ని తొలగించాలని ఆదేశిస్తే ఆ తీర్పుకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని గుర్తుచేశారు. రంగులు వేయడానికి ప్రజాధనం, ఆ రంగులు తియ్యడానికి ప్రజా ధనం, అదే రంగుల మీద కోర్టులో వాదించడానికి కూడా ప్రజా ధనం వృదా చేస్తున్నారని ఆరోపించారు. రంగుల మార్పు విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లిన జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లుకు కోత పడితే ఎందుకు వెళ్లలేకపోయారు? అని ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి చేతకాని తనంతో దాదాపు 16,700 మంది బీసీలు రాజకీయ అధికారానికి దూరమయ్యారని మండిపడ్డారు. బీసీలకు రాజ్యాధికారం దక్కితే ఎక్కడ తనను ప్రశ్నిస్తారోనన్న భయంతోనే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ మీద సుప్రీంకోర్టుకు వెళ్లలేదని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలంటే జగన్ కి ఎంత కక్ష ఉందో తెలియడానికి ఈ ఉదాహరణ చాలన్నారు. 

ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు నిరంకుశత్వ వైఖరిని ప్రదర్శిస్తే కుదరదని... ప్రజామోదం లేని నిర్ణయాలకు చీవాట్లు తప్పవని హైకోర్టు తాజా తీర్పు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన అహాన్ని, మొండిపట్టును వీడి వాస్తవాలను, ప్రజా సంక్షేమం విషయంలో ఉదాసీనత వీడి ప్రజల అవసరాల్ని గుర్తించాలన్నారు. అలా కాకపోతే ప్రజలతో కూడా చీవాట్లు తప్పవన్నారు. 

click me!