వారివల్ల జగన్ అస్తిత్వానికే ముప్పు... అందుకే రాజధాని మార్పు: జవహర్

By Arun Kumar PFirst Published Dec 22, 2019, 12:42 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయంపై మాజీ మంత్రి, టిడిపి నాయకులు కేఎస్ జవహర్ ఫైర్ అయ్యారు. ఆయన అస్తిత్వానికి ముప్పు వస్తుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ సంచలనం వ్యాఖ్యలు చేశారు. 

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్  ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంకుచిత ఆలోచనల నడుమ దళిత జాతి చరిత్ర గమనం తప్పుతోందని మాజీ మంత్రి, టిడిపి నాయకులు జవహర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసమే సీఎం దళితులను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. 

ముఖ్యమంత్రి జగన్ ప్రతీ సందర్భంలోనూ దళిత జాతికి చెందిన భూమిపుత్రులను భౌతికంగానో, అభౌతికంగానో గాయపరుస్తూనే ఉన్నారన్నారు. ప్రస్తుతం రాజధాని విషయంలోనూ అదే చేస్తున్నాడని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితుల అభివృద్దిని కూడా దృష్టిలో వుంచుకుని అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారని... ఇది దళితుల రాజధాని అని అన్నారు.

సీఆర్డీఏ పరిధిలోని 4 నియోజకవర్గాలలో దళితులు అత్యధిక సంఖ్యలో ఉన్నారని జవహర్ పేర్కొన్నారు. కొలకలూరు భుజంగరావు అనే దళపతి వాసిరెడ్డి సంస్థానాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని కాపలాకాసి దళితులకు చరిత్రలో ఒక సుస్థిర స్థానం కల్పించారు. కానీ దళితులపై అక్కసుతో ఆ చరిత్రను జగన్మోహన్‌రెడ్డి కాలరాస్తున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు.

read more  జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేశినేని నాని... సెటైరికల్ గా

 ప్రజారాజధానిపై ముఖ్యమంత్రికి అంత అక్కసు ఎందుకు..? అని ప్రశ్నించారు. నూటికి 75 శాతం మంది దళిత, బీసీ, మైనార్టీలు ఉన్న అమరావతి ప్రాంతంలో రాజధాని ఉండటం ముఖ్యమంత్రికి ఇష్టం లేదా..? ఆయన వ్యవహారశైలి చూస్తూ అలాగే కనిపిస్తోందని జవహర్ ఆరోపించారు. 

దళితులు అభివృద్ధి సాధిస్తే భవిష్యత్ లో తమ అస్తిత్వానికి నష్టం వాటిల్లుతుందనే సంకుచితమైన అభద్రతాభావంలో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. కనుకనే సంపద సృష్టికర్తలైన వీరికి కనీస అవకాశాలు కూడా దక్కకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. దళితుల చరిత్రను కాలరాయడానికి ప్రయత్నిస్తున్న సీఎంకు ప్రజలే బుద్దిచెబుతారని హెచ్చరించారు.

video: మేము సైతం...అమరావతి రైతుల ధర్నాకు విట్ విద్యార్థుల మద్దతు  

రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే దళితుల అభివృద్ధిని, పురోగతిని అడ్డుకున్నట్లే అవుతుందన్నారు. కావున రాజధాని అమరావతి అభివృద్ధితో దళితుల అభివృద్ధి సైతం ముడిపడి ఉందన్న విషయన్ని ముఖ్యమంత్రి జగన్ గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి    సూచించారు. 

click me!