కరోనా రోగులను వెనక్కిపంపితే... హాస్పిటల్ గుర్తింపు రద్దు: హోంమంత్రి హెచ్చరిక

By Arun Kumar PFirst Published Jul 25, 2020, 10:22 AM IST
Highlights

గుంటూరు జిల్లాలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. 

గుంటూరు జిల్లాలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలను పాటించడంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. 

కరోనా నియంత్రణపై జిల్లా అధికారులతో హోంమంత్రి గుంటూరు కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు లక్షా యాభై వేల పరీక్షలు చేస్తే పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మంత్రి పేర్కొన్నారు. 

జిల్లాలో రెండు వేల బెడ్స్‌తో ఇప్పటికే 11 హాస్పిటల్స్‌లో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మూడు వేల బెడ్స్‌తో మరో పన్నెండు ప్రైవేటు హాస్పిటల్స్‌ను సిద్ధం చేశామని తెలిపారు. 

read more   కరోనా మరణాలను తగ్గించేందుకు... జగన్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం

కరోనా లక్షణాలు ఉన్న పేషెంట్‌ను ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్ళిన సమయంలో వారిని తిరిగి వెనక్కి పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించినా, కరోనా భాదితుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించినా సంబంధిత ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేస్తామన్నారు. హాస్పిటల్ సిబ్బంది భయపడకుండా సేవలందించాలని సుచరిత కోరారు. 

కోవిడ్ బాధితులకు అసౌకర్యం కలిగిన సమయంలో కాల్ సెంటర్ 0863 2271492 నంబర్ కు ఫోన్ చేస్తే సమస్యను అధికారులు పరిష్కరిస్తారని చెప్పారు. బాధితులు ప్రభుత్వ సలహాలను పాటించి సురక్షితంగా కరోనా నుంచి బయటపడాలని హోమ్ మినిస్టర్ సూచించారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు బీమా సౌకర్యం కల్పిస్తామని హోంమంత్రి సుచరిత తెలిపారు.

click me!