ఏపి పోలీసులకు గుడ్ న్యూస్... జగన్ ప్రభుత్వ కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Dec 4, 2019, 4:51 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీసుల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం వైఎస్ జగన్ కు పోలీస్ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ధన్యవాదాలు తెలిపింది.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు ప్రభుత్వ మరో తీపి కబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పోలీసు సంక్షేమ నిధి నుంచి నిర్వహిస్తున్న గ్రూపు ఇన్సూరెన్స్‌ విలువను భారీగా పెంచారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత పోలీసుల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ ను పెంచడంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై వరకూ సుమారు రూ.13 లక్షల ఇన్సూరెన్స్‌గా చెల్లిస్తుండగా ఈసారి దాన్ని రూ.20లక్షలకు పెంచారు. అలాగే ఎస్సై నుంచి ఇన్‌స్పెక్టర్‌వరకూ రూ.35 లక్షలను చెల్లించనున్నారు. డీఎస్పీ ఆపై స్థాయి అధికారులకు రూ. 45 లక్షలను గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కింద చెల్లించనున్నారు. 

క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ప్రభుత్వం, పోలీసు శాఖల తరఫున యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ. 4.74 కోట్లను చెల్లించారు. ఈ గ్రూపు ఇన్సూరెన్స్‌తో పాటు ప్రమాదవశాత్తు పోలీసులకు ఏదైనా జరిగితే దాని కింద చెల్లించే బీమాను గణనీయంగా పెంచారు. 

read more ఆడపిల్లల మాన ప్రాణాలంటే పవన్ కు ఇంత చులకనా...: మంత్రి పుష్ప శ్రీవాణి ఫైర్

ఎవరైనా పోలీసు సిబ్బంది అసహజ మరణం పొందితే రూ. 30 లక్షలు, తీవ్రవాదులు లేదా ఉగ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోతే రూ. 40 లక్షల రూపాయలను అందిస్తూ కొన్నిరోజుల క్రితమే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకు వచ్చారు. ఇందులో  64719 మంది పోలీసు సిబ్బంది కుటుంబాలకు బీమా భద్రత లభిస్తుంది. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఈ పాలసీలు అమలుకానున్నాయి. 

ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ సహా యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌కు పోలీసు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ధన్యవాదాలు తెలిపింది.  పోలీసుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పోలీసు ఆఫీసర్స్‌ ఆనందం వ్యక్తం చేశారు. 

read more  వైకాపా కార్యకర్తలకు సెల్ ఫోన్లు... రూ.83 కోట్ల ఆదా కాదు రూ.233కోట్లూ వృధాయే: నారా లోకేశ్

వారాంతపు సెలవుతో 64 వేలమంది పోలీసు కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందని, అలాగే పోలీసుల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌తోపాటు, యాక్సిడెంటల్‌ పాలసీ విలువకూడా పెంచి మరింత భరోసా నిచ్చిందని పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.

click me!