ఆ విషయంలో కుప్పం ప్రజల మద్దతు మాకే... తీర్మానం కూడా...: ఆదిమూలపు సురేష్

By Arun Kumar PFirst Published Feb 12, 2020, 5:09 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తోందని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

అమరావతి: ప్రైవేటు విద్యాసంస్థలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన అందించాలన్న నిర్ణయానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇంగ్లీష్  ను మరింత చేరువ చేయాలన్న తమ నిర్ణయానికి రాష్ట్ర ప్రజల మద్దతు వుందన్నారు. అసలు ఈ నిర్ణయానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే  పిల్లల తల్లిదండ్రుల మద్దతే వుందా అని కొందరు ప్రశ్నించారని... అలాంటి వారికి  సమాధానం చెప్పడానికి తాను సిద్దంగా వున్నానని అన్నారు.

''ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయానికి అందరి ఆమోదం ఉందా...? అని చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు. వారికి సమాధానంగా ప్రభుత్వ పాఠశాలల్లోని తల్లిదండ్రుల కమిటీలు తమ అంగీకారాన్ని తెలియ చేస్తూ తీర్మానం చేశాయి.  45 వేల పై చిలుకు పాఠశాలల నుంచి ఈ తీర్మానాలు వచ్చాయి. ఆంగ్ల మాధ్యమం గురించి అంతా సానుకూలంగానే ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం తో అంతా ఏకీభవిస్తూ, స్వాగతిస్తున్నామని చెప్పి తీర్మానాలు చేశారు'' అని విద్యామంత్రి తెలిపారు. 

read more  ''అమరావతే తమ రాజధాని అంటున్న విశాఖవాసులు... కారణమిదే...''

ఇలా తీర్మానం చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో చదువుకున్నవాళ్ళు, చదువులేని వాళ్ళు అందరూ  వున్నారని... వారంతా సానుకూలంగా స్పందించారన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగలన్నదే వారి ఏకాభిప్రాయంగా ఉందని తెలిపారు. తల్లిదండ్రుల కమిటీలు అందించిన ఆ తీర్మానాలను అన్ని సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టామని మంత్రి వెల్లడించారు. 

ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలోని 140 పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీలు కూడా ఇలా తీర్మానం చేశాయని అన్నారు. దీన్ని చంద్రబాబు గమనించాలని... ఇకనైనా ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించకుండా వుండాలని సూచించారు. కుట్ర పూరితంగా ఆలోచిస్తున్న వారికి ఈ తీర్మానాలు చెంపపెట్టు అని భావిస్తున్నామని విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. 

ఆంగ్ల మాధ్యమం అమలు చేసేందుకు ఉపాద్యాయులకు శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆంగ్ల మాధ్యమం అమలుకు, అమ్మ ఓడి కార్యక్రమానికి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించినట్లు తెలిపారు.

read more  ఏపి కేబినెట్ సమావేశం... కీలక నిర్ణయాలివే

ప్రాథమిక స్థాయిలో 1,2,3 తరగతులకు అలాగే 4,5 తరగతుల వారికి బ్రిడ్జ్ కోర్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాఠ్యంశాలను కూడా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందన్నారు.  విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, వర్క్ పుస్తకాలు వేర్వేరుగా ఇస్తామన్నారు.

జగనన్న విద్యా కానుక ద్వారా బ్యాగ్, యూనిఫార్మ్, బూట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ కిట్ మొత్తానికి 1500 రూపాయలు ఖర్చు అవుతుందని ఆతిమూలపు సురేష్ వెల్లడించారు. 


 

click me!