అమరావతి భూములపై సీఐడి విచారణ వేగవంతం...ఆ 106మందిపై...

By Arun Kumar PFirst Published Feb 8, 2020, 8:11 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి భూముల విషయంలో విచారణను ఏపి సీఐడి వేగవంతం  చేసింది. 

అమరావతి:  ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై సీఐడి విచారణ వేగవంతమయ్యింది. ఈ  వ్యవహారంతో సంబంధాలున్నట్లు భావిస్తూ ఇప్పటికే పలువురు మాజీ మంత్రులపై కేసులు నమోదు చేసిన సీఐడి సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో పడింది. ఈ విషయంలో సహకారం అందించాల్సిందిగా ఐటీ శాఖను కోరింది. 

ఈ  విషయం గురించే ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ పి.వి సునీల్ కుమార్ ఐటీ చీఫ్ కమీషనర్ కు లేఖ రాశారు. ముఖ్యంగా అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని ఐటీ చీఫ్ కమీషనర్ ను కోరారు. 

2018 నుండి 2019 వరకు 106 మంది భూములను కొనుగోలు చేశారని... ఆ భూముల కొనుగోలు వ్యవహారంపై విచారణ జరపాలని కోరారు. రూ.2 లక్షలకు మించి జరిగిన అనుమానిత ట్రాన్షక్షన్లపై విచారణ జరపాలని ఐటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. 

ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అసైండ్ భూముల అమ్మకాలు, కొనుగోలులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సిఐడి లేఖలో సూచించింది. ఎక్సెల్ షీట్లో 106 మంది అసైండ్ భూముల కొనుగోలులో ఉన్న వ్యక్తుల పూర్తి వివరాలు, లాండ్ అడ్రస్లు, సర్వే నెంబర్లతో సహా ఐటీ చీఫ్ కమీషనర్ కు ఏపీ సిఐడి పంపించింది. దీని ఆధారంగా విచారణ జరపాలని సూచించింది. 

అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రులు నారాయణ ,పత్తిపాటి పుల్లారావు ,బెల్లంకొండ నరసింహాలపై సీఐడి కేసులు నమోదయ్యాయి. తనను మభ్యపెట్టి వ్యవసాయ భూమిని కొనుగోలు చేసారని వెంకటాయపాలెంకు చెందిన దళిత మహిళ పోతురాజు బుజ్జి పిర్యాదు చేసినట్లు తమకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. 

  ఈ పిర్యాదుపై విచారణ జరిపిన తమకు 99 సెంట్ల భూమిని ఆమె నుండి వీరు కొనుగోలు చేసినట్లు తేలిందని... దీంతో 420,506,120b ఐపీసీ సెక్షన్ల కింద 3 కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై తాము జరిపిన విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడినట్లు ఎస్పీ ప్రశాంతి పేర్కొన్నారు. 

797  తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్‌ రాజధాని ప్రాంతంలో  భూములు కొన్నట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. రూ.3 కోట్లకు చొప్పున ఎకరం భూమి తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించామన్నారు. ఇలా రూ.220 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించామని వెల్లడించారు.

 తెల్లరేషన్ కార్డు హోల్డర్స్‌తో ఇలా భూములు కొనుగోలు చేయించిన వారి వివరాలపై ఆరాతీస్తున్నట్లు తెలిపారు. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.  అమరావతిలో 129 ఎకరాలు  131 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ కొనుగోలు చేయగా పెద్దకాకానిలో 40 ఎకరాలు  43 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ కొన్నారన్నారు. 

తాడికొండలో 190 ఎకరాలు  188 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ రిజిస్టర్ చేసుకొనగా తుళ్లూరులో 242 ఎకరాలు  238 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ కొన్నారని వెల్లడించారు.  మంగళగిరిలో 133 ఎకరాలు  148 మంది, తాడేపల్లిలో 24 ఎకరాలు  49 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్ కొన్నారన్నారు. దీనిపై విచారణ వేగవంతం చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. 


 

 

click me!