రాజూ మంత్రి కేసీఆరే: ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ నేతల గెంతులు

First Published Oct 15, 2019, 5:16 PM IST

తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఆర్టీసీ కార్మికులపై ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేశారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నది అసలు సమ్మే కాదని... ప్రజలను ఇబ్బంది పెట్టిన కార్మికులను క్షమించేది లేదని ఆయన స్పష్టం చేశారు

తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఆర్టీసీ కార్మికులపై ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేశారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నది అసలు సమ్మే కాదని... ప్రజలను ఇబ్బంది పెట్టిన కార్మికులను క్షమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. గడువు తేదీలోగా విధుల్లో చేరనివారి ఉద్యోగాలు పోయినట్లేనని ప్రకటించి దాదాపు 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల్లో గుబులు రేపారు.
undefined
డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన ఈ సమ్మె చివరికి ప్రతిష్టాత్మకంగా మారి కార్మికుల ఆత్మహత్యలకు దారి తీస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడినప్పటికీ అటు ప్రభుత్వం కానీ.. ఇటు ఆర్టీసీ జేఏసీ కానీ తగ్గడం లేదు. ఇంతవరకు వచ్చాకా తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్నాయి. కేసీఆర్‌ వైఖరిని విపక్షాలు, ప్రజాసంఘాలు, మేథావులు ఖండిస్తుంటే.. ఆయన మంత్రివర్గ సహచరుల్లోని కొందరు ఏ మాత్రం ఖండించకపోగా కార్మికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రికి ఏదోలా నచ్చజెప్పి సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి అగ్గికి ఆజ్యం పోస్తున్నారు.
undefined
ఆర్టీసీ కార్మికులు.. యూనియన్ నేతలు.. ప్రతిపక్షాల ట్రాప్‌లో పడ్డారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదొక రాజకీయ కుట్రగా అభివర్ణించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆర్టీసీ కోసం కేసీఆర్ ఎంతో చేశారని ఎవ్వరూ ఊహించని విధంగా 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి అంటూ ఆకాశానికెత్తేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతల కుట్రలను ఆర్టీసీ కార్మికులు అర్ధం చేసుకోవాలని ఎర్రబెల్లి సూచించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పలేదని.. కార్మికులు మనసు మార్చుకుని ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకోవాలన్నారు.
undefined
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైతం కేసీఆర్ సేవలను పొగిడేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని... సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చారని పువ్వాడ తెలిపారు. 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు సమ్మెకు మద్ధతు ఎందుకు ఇస్తున్నాయో తెలపాలని పువ్వాడ ప్రశ్నించారు.
undefined
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం చేస్తానన్న టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు సైతం చివరి నిమిషంలో మాటమార్చేశారు. సమ్మె గురించి ముఖ్యమంత్రితో చర్చించేందుకు ప్రయత్నిస్తోంటే ఆయన అందుబాటులోకి రావడం లేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని కేకే తేల్చేశారు. తాను చర్చలు జరుపుతానని అనలేదని.. అయినా సరే మంచి జరుగుతుందనుకుంటే మధ్యవర్తిత్వం వహిస్తానని కేశవరావు వెల్లడించారు.
undefined
ఆర్టీసీ సమ్మెపై శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో విలీనం చేశారా అని పల్లా ప్రశ్నించారు. తెలంగాణ కార్మిక సంఘాలను, కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ పార్టీల నాయకులపై రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ గురించి కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలుసునని.. ఆయన సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని పల్లా తెలిపారు.
undefined
click me!