ఒకవేళ వాహనదారుడికి తప్పుగా ఫైన్ జారీ అయితే, దాన్ని సవాల్ చేయడానికి ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. వాహనదారులు నిర్దేశిత పోర్టల్ ద్వారా తగిన ఆధారాలతో ఆన్లైన్లో తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఈ ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత అధికారి లిఖితపూర్వక ఉత్తర్వులను పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఆ సమాచారం వాహనదారుడికి ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందుతుంది. ట్రాఫిక్ ఫైన్ల పై వచ్చే అభ్యంతరాలను పరిష్కరించడానికి పోలీస్, రవాణా శాఖలకు చెందిన అధికారులను ప్రభుత్వం నియమించింది.
ఫైన్ జారీ అయిన 45 రోజుల్లోపు దాన్ని చెల్లించాలి. ఒకవేళ అభ్యంతరం తిరస్కరణకు గురైతే, ఆ ఆర్డర్ వచ్చిన 30 రోజుల్లోపు ఫైన్ మొత్తం చెల్లించాలి లేదా 50% డిపాజిట్ చేసి కోర్టును ఆశ్రయించవచ్చు. ఫైన్ క్లియర్ చేయకపోతే, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఎలాంటి అప్లికేషన్లను రవాణా శాఖ ప్రాసెస్ చేయదు. రాబోయే 6 నెలల్లో ప్రస్తుత ఫైన్ల జారీ విధానం పూర్తిగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన సారథి, వాహన్ ఈ-ఫైన్ సిస్టమ్లోకి మారనుంది.
ఈ కొత్త నిబంధనలు వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల మరింత అప్రమత్తంగా ఉండేందుకు సహాయపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. వాహనదారులు ఎలాంటి జరిమానాలు, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే వెంటనే తమ వివరాలను వాహన్ పోర్టల్లో నమోదు చేసుకోవడం మంచిది.