TS Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి 2026 పరీక్షల ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాతో కలిసి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించగా, మొత్తం ఉత్తీర్ణత శాతంలో రాష్ట్రం గణనీయమైన ఫలితాలను నమోదు చేసింది. ఫలితాల కోసం విద్యార్థులు వెబ్సైట్లతో పాటు వాట్సప్ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చు.
25
ఫలితాల గణాంకాలు: బాలికల జోరు
ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో బాలికలు 74.4 శాతంతో ముందంజలో ఉండగా, బాలురు 57.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 3,23,807 మంది(66.20 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 3,58,490 మంది (70 శాతం) విద్యార్థులు విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. అయితే, సుమారు 4 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం గమనార్హం. జిల్లాల వారీగా చూస్తే.. మేడ్చల్ ఫస్టియర్ ఫలితాల్లో.. భూపాలపల్లి సెకండియర్ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ సందర్భంగా కె. కేశవరావు మాట్లాడుతూ, పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు మనస్తాపంతో ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉంటాయని భరోసా ఇచ్చారు.
35
ఫలితాలను చూసుకోవడం ఎలా?
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ల ద్వారా పొందవచ్చు. tgbie.cgg.gov.in, results.cgg.gov.in నుంచి.. అలాగే వాట్సప్ ద్వారా సులభంగా విద్యార్థులు 80969 58096 నంబర్కు 'Hi' అని మెసేజ్ పంపి, ఆపై 'BIE Exam Result' అని టైప్ చేస్తే మీ ఫలితాలు నేరుగా మీ మొబైల్కు వస్తాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఈ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను బోర్డు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఫలితాలను వెల్లడించింది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉన్నత చదువుల బాటలు పడగా, ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం త్వరలోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించారు.
ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్థుల కోసం బోర్డు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ సదుపాయాన్ని కల్పించింది. ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్కు రూ. 100, రీవెరిఫికేషన్ (స్కాన్డ్ కాపీతో కలిపి) కోసం రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.
55
సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్
ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా బోర్డు ప్రకటించింది. మే 24 నుండి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పరీక్ష ఫీజును ఏప్రిల్ 24లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ కోరుకునే విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరుకావచ్చు.