అడిగినంత కట్నం ఇవ్వడంలేదని పెళ్లి పీటల మీదినుంచి పారిపోయిన ప్రేమికుడు...

First Published May 27, 2023, 8:43 AM IST

చివరి నిమిషంలో కట్నం డిమాండ్ చేసి.. అడిగినంత ఇవ్వడంలేదని పెళ్లి పీటల మీదినుంచి పారిపోయాడో ప్రేమికుడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. 

సంగారెడ్డి : తెలంగాణలోని సంగారెడ్డిలో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ప్రేమించి.. యువతికి వచ్చిన పెళ్లి సంబంధాలు చెడగొట్టి మరీ.. పెద్దల్ని ఒప్పించి... తన ప్రేమను సాధించుకున్నాడు ఓ యువకుడు. అతని పట్టుదల చూసి ఇరువురి తల్లిదండ్రులు కూడా వారి ప్రేమకు అంగీకరించారు.  కానీ, తీరా పెళ్లి పీటల మీదికి వచ్చేసరికి ఆ ప్రేమికుడు ప్లస్ పెళ్లి కొడుకుకి..  ప్రేమ కంటే డబ్బు ఎక్కువగా కనిపించింది. 

తను అడిగినంత కట్నం ఇవ్వలేదని.. పెళ్లి పీటల మీద నుంచి పారిపోయాడు. ఈ ఘటన  సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మండలంలో చోటుచేసుకుంది.దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఇద్దరు యువతీ యువకులు  ప్రేమించుకున్నారు. యువతిది సంగారెడ్డి జిల్లా మనూరు మండలం. కాగా,…యువకుడిది కొండాపూర్ మండలం. అయితే, వీరి ప్రేమకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. 

యువతి కుటుంబ సభ్యులు అతనికి తమ కూతురిని ఇవ్వడానికి అంగీకరించలేదు. అంతేకాదు యువతి పెళ్లిని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలానికి చెందిన ఓ యువకుడితో నిశ్చయించారు. జనవరిలో వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయం యువకుడికి తెలిసింది. ఎలాగో ఆ యువకుడు ఫోన్ నెంబర్ సంపాదించిన అతను.. తాను.. యువతి ప్రేమించుకున్నామని..  నువ్వెలా పెళ్లి చేసుకుంటావని.. ఆ అమ్మాయిని వదిలేయమంటూ బెదిరించాడు. 

దీంతో ఆ యువకుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు ప్రేమికులిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. యువకుడి కుటుంబ సభ్యులు కూడా దీనికి ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కొండాపురం మండలంలోని ఒక గుడిలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. 

అన్ని అడ్డంకులు తొలగి తమ ప్రేమ..పెళ్లితో ముడిపడి.. జీవితకాలం ఒకటిగా కొనసాగుతామని.. ఆ వధువు సంతోషంలో మునిగితేలుతోంది. ఈ సమయంలో వరుడు ప్లేస్ ప్రేమికుడైన ఆ యువకుడు  ఊహించని షాక్ ఇచ్చాడు. తనకు కట్నం కావాలని డిమాండ్ చేశాడు. 

దీంతో షాక్ అయిన యువతి తల్లిదండ్రులు.. సరే ఇస్తామని ఒప్పుకున్నారు. అయితే తనకు రూ.15లక్షల  కట్నం కావాలని వరుడు డిమాండ్ చేశాడు.  అంత మొత్తం అంటే తమ దగ్గర లేదని.. రూ.6లక్షలు  ఇస్తామని యువతి కుటుంబీకులు చెప్పారు. దీనికి వరుడు ససేమిరా అన్నాడు. 

తాను అడిగిన 15 లక్షల కట్నం ఇచ్చేవరకు పెళ్లి చేసుకోనంటూ భీష్మించుకు కూర్చున్నాడు.  దీంతో ఇది కుటుంబ సభ్యులు అతడిని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు.  అందరూ ఈ పరిపాయత్నాల్లో ఉండగానే..  ఎవరికి కనిపించకుండా.. అందరి కళ్లుగప్పి పెళ్లి పీటల మీద నుంచి పారిపోయాడు. 

ఇది గమనించిన పెళ్లి పందిరిలోని అందరూ పెళ్లికొడుకు కోసం వెతకడం మొదలుపెట్టారు. ఫోన్ స్విచాఫ్ చేసేసాడు. దీంతో ఎం వెతికిన పెళ్ళికొడుకు దొరకలేదు. ఫోన్ కూడా కలవలేదు. చేసేదేం లేక వధువు కుటుంబ సభ్యులు పోలీసులను  ఆశ్రయించారు.

click me!