Huzurabad Bypoll:ఆగమాగం కావద్దు... ఆ ఒక్కటీ ఆలోచించి ఓటేయండి: మంత్రి హరీష్

First Published Sep 27, 2021, 4:22 PM IST

 హుజురాబాద్ పట్టణంలోని వెంకట సాయి గార్డెన్ ఫంక్షన్ హాలులో జరిగిన విత్తన ఉత్పత్తి రైతుల సమావేశానికి మంత్రి హరీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బిజెపిపై, మాజీ మంత్రి ఈటలపై ఆయన ఫైర్ అయ్యారు. 

కరీంనగర్: రైతు బాంధువులకు ఓటు వేస్తారా... రైతుల ఉసురు తీసే పార్టీకి ఓటు వేస్తారా? అని హుజురాబాద్ రైతులను ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తాను హుజూరాబాద్ లో అభివృద్ది పనులు చేస్తే తప్పని అంటున్న ఈటల రాజేందర్ అంటున్నారని... ఆయనలా బొట్టు బిల్లలు, కుట్టు మిషన్లు పంచితే ఒప్పా అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, రాష్ట్ర మంత్రిగా హుజూరాబాద్ లో పని చేయడం తప్పా? అని ఈటల ప్రశ్నించారు. 

హుజురాబాద్ పట్టణంలోని వెంకట సాయి గార్డెన్ ఫంక్షన్ హాలులో జరిగిన విత్తన ఉత్పత్తి రైతుల సమావేశానికి మంత్రి హరీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... మట్టిని, వ్యవసాయాన్నే నమ్ముకున్న మీరంతా ఎన్నికలు వచ్చాయని ఆగం ఆగం కావద్దని అన్నారు. మట్టిని నమ్ముకున్న వారిని పైకి తీసుకువచ్చిన  పార్టీ ఏది... రైతును ఆదుకున్న పార్టీ ఏది అన్నది ఆలోచించాలని మంత్రి సూచించారు. 
 

''రైతాంగాన్ని సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది.  హుజూరబాద్ లో కాంగ్రెస్ లేదు.. డిపాజిట్ రాదు. దాని కోసం మాట్లాడటం దండగ. టీఆర్ఎస్ - బీజేపీ పార్టీలు మాత్రమే ఉన్నాయి. ఏ తోవలో పోవాలో  ఆలోచించుకోవాలి. న్యాయం, ధర్మానికి -  అన్యాయం, అధర్మానికి మధ్య పోటీ నడుస్తోంది. 2014 లో గులాబీ జెండా ఎగరక ముందు రైతు పరిస్థితి ఎలా ఉంది.... ఆ తర్వాత రైతు పరిస్థితి ఎలా ఉందో గుర్తుకు తెచ్చుకుందాం. ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో ఆలోచిద్దాం'' అని హరీష్ అన్నారు. 
 

''పెలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు...కాలిపోయే మోటార్లు ఆనాటి పరిస్థితి. కరెంటు కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకోని వేచిచూడాల్సిన పరిస్థితి. విత్తనాల కోసం, ఎరువుల కోసం పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగడం, లైన్లో నిలబడే పరిస్థితి. రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కాలువల్లో నీళ్లు వస్తాయా లేదా, నారు పోయాలా వద్దా అని ఎదురు చూసే పరిస్థితి. కానీ ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ బావుల వద్ద, ఇంటి కాడ ఇస్తోంది తెరాస ప్రభుత్వం. కాళేశ్వరం నీటితో కాలువల్లో నిండుగా నీరు పారుతోంది. ఆనాడు నీళ్ల కోసం ధర్నాలు...మోటర్లు పెడితే ఎమ్మార్వోలు కేసులు పెట్టే పరిస్థితి. ఇప్పుడు నీళ్లకు ఇబ్బంది లేదు..కరెంటుకు ఇప్పుడు ఇబ్బంది లేదు. ఆనాడు నీటి తీరువా, భూమి శిస్తు కట్టడం, పాస్ బుక్ కావాలంటే డబ్బులు చెల్లించాల్లిన పరిస్థితి''వుండేదంటూ మండిపడ్డారు.
 

''రైతులు చినిగి చొక్కాలతో తిరిగే పరిస్థితి ఆనాడు. ఇప్పుడు వ్యవసాయం చేసే రైతు పట్టు పంచెలు కట్టాల్సిన పరిస్థితి తేవాలని, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని సీఎం కేసీఆర్  పలు పథకాలు తెచ్చారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా  ఇచ్చారు. కుల మతాలకు అతీతంగా ప్రతీ ఎకరానికి ఏడాదికి పదివేల రూపాయల సాయం అందించారు. రైతులకు అసలు సంఘమే లేదు. అలాంటిది సీఎం కేసీఆర్ రైతు వేదికల నిర్మాణం చేపట్టారు. రైతులను సంఘటితం చేసి రైతు వ్యవస్థను బలోపేతం చేసేందుకు రైతు బందు సమితులు, వేదికలు చేపట్టారు'' అని తెలిపారు.
 

''రాష్ట్రానికి సీఎంగా ఉన్న కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారు. కరవు మంత్రిగా, రవాణా మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్నా...వ్యవసాయాన్ని విడవని రైతు మన సీఎం కేసీఆర్. ఆయన రైతు గనుక రైతు కష్టాలు తెలుసు. అందుకే నీటి తీరువా, కాలేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికల వంటివి ఆలోచన చేశారు. పోయిన టర్మ్ లో రూ.16 వేల కోట్లు రైతు రుణ మాఫీ చేశాం. ఈసారి కరోనా వల్ల ఆలస్యం అయింది. వారంలోపే 50 వేల రుణాలను మిత్తీతో సహా రుణాలు చెల్లిస్తాం. 50 వేల నుంచి లక్షలోపు వారికి మార్చి లోపు మిత్తితో సహా వారి రుణాలు మాఫీ చేస్తాం'' అని హరీష్ స్పష్టం చేశారు.
 

''మేం రైతు కోసం ఏమేమి చేసామో చెప్పాను. బీజేపీ వాళ్లు ఏం అంటున్నారో ఆలోచించండి. వాళ్లు ఉన్న మార్కెట్లను రద్దు చేస్తారంట. బాయిల కాడ మీటర్లు పెడతారంట, ఎరువుల ధర, డిజీల్ ధర పెంచారు. దొడ్డు వడ్లు కొనం అంటే బీజేపీకి ఓటు వేయాలా? పోయిన వానా కాలంలో  ఒక ఎకరం దున్నాలంటే మూడువేలు... ఇప్పుడు పెంచిన డిజిల్ కారణంగా ఎకరానికి ఆరు వేలు అవుతోంది. వరి కోత మిషన్ కు మరో రూ.500 రూపాయలు పెరుగుతుంది. రైతుకు ఆసరా కోసం కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే డిజిల్ ధర పెంచి రూ.2500 రూపాయలు రైతు నుంచి బీజేపీ గుంజుకుంటుంది. బీజేపీకి ఓటు వేస్తే డిజిల్ ధర రూ.100 రూపాయలు పెంచినా మాకు ఓటు వేశారు... అని చెప్పి డిజిల్ ధరను రూ.150 రూపాయలు చేస్తారు'' అని మంత్రి అన్నారు. 

''రైతు బాంధవుడు కేసీఆర్, రైతుల ఉసురు పోసుకుంటోంది బీజేపీ. ఇనుప కంచెలతో రైతులు ఢిల్లీ రాకుండా బీజేపీ అడ్డుకుంటుంది. దీని మీద రాజేందర్ ఎందుకు మట్లాడటం లేదు. ఏడేళ్లు మంత్రిగా ఉండి హుజూరాబాద్ లో ఒక్క ఇళ్లు కట్టలేదు.. ఎందుకు అని అడుగుతున్నా. నాలుగు వేల ఇళ్లు సీఎంగారు ఇచ్చారు... నీ సోపతోళ్లం మేం ఇళ్లు కట్టారు. పేదల మీద ప్రేమ ఏపాటిది అని రాజేందర్ ను అడిగుతున్నా. ఇళ్లు కట్టి పంపితే పది వేల మంది హుజురాబాద్ లో ఆత్మగౌరవంతో బతికే వారు కదా. మహిళల మీటింగ్ కు మహిళా భవనాలు ఎందుకు ఒక్కటి కట్టించలేందేంటి అని రాజేందర్ ను అడిగా...దాని మీద మాట్లాడడు. డిజీల్, గ్యాస్ ధర వేయి రూపాయలు పెంచింది. దానికి ఎలా ఓటు వేయాలి రాజేందర్ అని అడిగా... సిలిండర్ ధర పెంచి సబ్సిడీ తగ్గించారని అడిగా.. దాని మీద మాట్లాడలేదు. పెట్రోల్ 105 రూ. డిజిల్ 100 రూ చేశారు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని అని అడిగా ఇందులో తప్పు ఉందా..?'' అని హరీష్ ప్రశ్నించారు. 

''రైల్వేలు 2 లక్షల ఉద్యోగాలు తగ్గినయి, బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగాలు ఊడగొడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెడుతున్నరు ఎందుకు ఓటు వేయాలి అని అడిగా... నేను  హుజూరాబాద్ కు వచ్చి  ఏం చేశా... మహిళలు మహిళా భవనాలు కట్టుకుంటాం అంటే సాయం చేశా. రోడ్ వేయమంటే వేయించా...మోరీ అడిగితే మోరీ కట్టించా... ఇంత కంటే ఏం చేశా. పార్టీ కార్యకర్తగా, రాష్ట్ర మంత్రిగా పని చేశా... ఇంతకన్నా  ఏం చేశా... హరీశ్ రావు వచ్చి ఏదేదో చేస్తా అని విమర్శిస్తున్నాడు. నువ్వు బొట్టుబిల్లలు పంచుతవు. గడియారాలు పంచుతవు... గ్రైండర్లు ఇవ్వచ్చు..కుంకుమ భరిణులు ఇవ్వచ్చు... కుట్టుమిషన్లు ఇవ్వచ్చు..బొట్టు బిల్లలు ఇవ్వచ్చు.. మేక పిల్లలు, మందు బాటిల్లు, సిమెంట్ బస్తాలు, ఐరన్ పైపులు గుళ్లకు ఇవ్వచ్చు. దావతులు ఇవ్వచ్చు. మేం  అభివృద్ధి పనులు చేస్తే తప్పు.....నువ్వు పంచేవి రైటా?'' అని ఈటలను నిలదీశారు.

''రూపాయి బొట్టు బిల్లతో బతుకుతమా.... లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మితో బతుకుతమా.. దేశం మీద ఎక్కడన్నా బీజేపీ ప్రభుత్వం లక్ష రూపాయలు పేదంటి ఆడపిల్లకు ఇస్తుందా. నువు మాట్లాడితే...హుజూరాబాద్ కు రెండు వేల ప్యాకేజీ తెస్తున్నా అని చెప్పు. అది మాట్లాడరు. పెంచిన సిలిండర్ ధర తగ్గిస్తా...పెంచిన డిజిల్, పెట్రోల్ ధర తగ్గిస్తా అని చెప్పు.. రైతులకు రుణ మాఫీ  చేస్తా అని చెప్పు అది మాట్లాడరంట..  వట్టి మాయమాటలు చెబుతున్నారు.  ఊళ్లల్లకు వచ్చి చాలా మాటలు చెబుతున్నారు. నేను అడిగేది ఒక్కటే మేం చేసిందేంటో చెప్పాం. రైతు  రుణమాఫీ 50 వేల లోపు చేశాం. మిగిలిన రుణ మాఫీ మార్చిలోపు మాఫీ చేస్తాం  అని చెప్పాం. ఆ మాట రాజేందర్ ను చెప్పమనండి.. అవి చెప్పరు'' అంటూ మండిపడ్డారు. 

''మీకు ఇంకో మాట ఇస్తున్నా. ఏడేళ్లుగా రాజేందర్ ఒక్క ఇళ్లు కట్టించలేదు. ఈ ఒక్క సారి గెల్లు శ్రీనును గెలిపించండి... ఐదు వేల ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.ఆరు సార్లు మీరు రాజేందర్ ను గెలిపించారు. 17 ఏళ్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేశారు. కాని మీకు జరగాల్సిన న్యాయం జరిగలేదు. ఒక్కసారి రెండున్నరేళ్ల కోసం కారు గుర్తుకు వేసి ఉద్యమ కారుడు గెల్లును గెలిపించండి.  నెల 15 రోజులు గెల్లు జైలులో ఉన్నాడు. గొర్రెల కాపరుల కుటుంబలో పుట్టిన రెండు గుంటలున్న వ్యక్తి. కష్టం చేసే గుణం ఉన్నోడు. మీకు అందుబాటులో ఉండి పని చేస్తాడు. ఇంత పెద్ద మీటింగ్ అయింది. ఒక్క రూపాయి ఖర్చు గెల్లుకు కాలేదు. ప్రేమ కొద్ది అనేక మంది గెల్లు గెలుపుకు సహకరిస్తున్నారు. గెల్లు శ్రీనుకు ఏం ఖర్చు ఉంది'' అన్నారు.

''57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నాం..కొద్ది రోజుల్లోనే 57 ఏళ్లు నిండిన వారికి 2016 రూపాయలు పెన్షన్ ఇస్తాం. 65 ఏళ్ల నుండి 57 కు కుదించాం. కరోనా దెబ్బ వల్ల ఆలస్యం అయింది. 18 నెలల నుండి ఆర్థికంగా మన రాష్ట్రానికి నష్టం జరిగింది. కరోనా వచ్చినా పది కిలోల బియ్యం, పప్పులు పేద ప్రజలకు ఇచ్చాం.  రెండున్నరేళ్లు తెరాస ప్రభుత్వమే ఉంటుంది. ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేస్తాం'' అని హరీష్ స్పష్టం చేశారు. 

''ఉచిత కరెంటు రైతులకు వస్తుందంటే అందుకు సీఎం గారు 40 వేల కోట్ల రూపాయలు విద్యుత్ డిపార్ట్మెంట్ తెలంగాణ వచ్చిన నాటి నుంచి కట్టాం.రైతు బంధు కోసం మూడేళ్లుగా 43 వేల 36 కోట్లు రైతులకు చెల్లించాం. రైతు బీమా, ఉచిత కరెంటు  అన్ని కలిపితే... లక్ష కోట్లు రైతుల మీద ఖర్చు చేసాం. మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం కాకుండానే రైతుల మీద ఇంత ఖర్చు చేశాం. దేశంలో ఏక్కడైనా ఇంత రైతుపై ఖర్చు చేశారు. పోయిన సారి 17 వేల కోట్లు రైతు రుణ మా ఫీ చేసాం. ఇప్పుడు 23 వేల కోట్లు కానుంది. 50 వేల లోపు అప్పులు మాపీ అయిన వారు కొత్త రుణాలు తీసుకోవచ్చు. లక్ష రూపాయల రుణం ఉన్న వాళ్లు వడ్డీ పడుతుందని అనుకుంటున్నారేమో....బ్యాంకులకు ఆదేశాలిచ్చాం. ఎంత వడ్డీ అవుతందో అది ప్రభుత్వమే కడుతుందని సీఎం కేసీఆర్ శాసన సభ ద్వారా ఆదేశాలిచ్చారు. రైతు నుంచి వడ్డీ వసూల చేయకుండా ఎంత రుణం కావాలో అంత ఇవ్వండని చెప్పా'' అని పేర్కోన్నారు. 
 

''కారుతోనే భవిష్యత్తు..కారు గెలుస్తేనే హుజూరాబాద్ ప్రజల అభివృద్ధి ఇమిడి ఉంది. రైతుల భవిష్యత్తు కారు గెలుపుతోనే. మీరు అడిగిన ప్రతీ పని పెండింగ్ ఉన్నా వాటిని పరిష్కరిస్తున్నం. మేం  అంతా ఇక్కడే ఉంటాం..  ఏమి అవసరమైనా మేం వస్తాం. ఢిల్లీ నుండి కేంద్ర మంత్రులు వస్తున్నారు. మాట్లాడుతున్నారు. వాళ్లు మనకు దొరుకుతారా. ఇక్కడ ఎంపీగా గెలిచిన బండిసంజయ్ పది రూపాయల పని చేశారా. సీడ్ గ్రోవర్స్ అసోషియేషన్ కు ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తాం. విత్తనోత్పత్తి ఇక్కడే ఎక్కువ జరుగుతోంది. రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు  చేసే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా. మీకు స్థలమే కాకుండా భవన నిర్మాణానికి ఆర్థిక సాయం ప్రభుత్వం తరపున చేస్తాం'' అని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. 
 

click me!