Huzurabad Bypoll: టీఆర్ఎస్ కు మెజారిటీ ఇస్తే... కోటి రూపాయలిస్తా: బిజిగిరి షరీఫ్ కు హరీష్ బంపరాఫర్

First Published Oct 27, 2021, 4:22 PM IST

హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి చివరిరోజయిన ఇవాళ మంత్రి హరీష్ రావు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బిజిగిరి షరీఫ్ ప్రజలకు ఆయన బంపరాఫర్ ఇచ్చారు. 

కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గంలో ఇవాళ(బధవారం) సాయంత్రం నుండి మైకులు మూగబోనున్నాయి. ఇంటింటి ప్రచారం, నాయకుల హడావుడి, అభ్యర్థుల ప్రచారం అంతా మరికొద్ది గంటల్లో నిలిచిపోనుంది. అక్టోబర్ 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48గంటలు ముందుగానే ప్రచారానికి బ్రేక్ పడనుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ వీలైనంత ఎక్కువమంది ప్రజలవద్దకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీఆర్ఎస్ సీనియర్లు ఇవాళ హుజురాబాద్ లో ముమ్మర ప్రచారం నిర్వహించారు. 

మంత్రి హరీష్ జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు తోటి మంత్రులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా harish rao మాట్లాడుతూ... ఐదు నెలల నుండి huzurabad లో ప్రచారం జరుగుతోందని... ఈరోజు ప్రచారానికి చివరి రోజని అన్నారు. రాత్రి ఏడు గంటల నుండి మైకుల చప్పుడు ఉండదన్నారు. అయితే ఇప్పటికే gellu srinivas yadav లో ఎమ్మెల్యే కళ వచ్చిందని... సిఎం కేసీఆర్ ఆశీస్సులతో ఉద్యమకారుడైన గెల్లు 25 వేల మెజారిటీతో గెలవబోతున్నాడని మంత్రి ధీమా వ్యక్తం చేసారు. 
 

''బిజిగిరి షరీఫ్ లో ఎక్కువ మెజారిటీ గెల్లు శ్రీనివాస్ కు ఇవ్వాలి... అలా చేస్తే కోటి రూపాయలు అభివృద్ధి పనులకు ఇస్తా. గెల్లు గెలుపు ఖాయమైంది... కానీ మెజారిటీ ఎక్కువ రావాలి. ఇల్లందకుంట రామాలయానికి రూ.10 కోట్లు, బిజిగిరి షరీఫ్ కు రూ. కోటి రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేస్తాం'' అని మంత్రి హరీష్ హామీ ఇచ్చారు. 
 

''ఈరోజు ప్రచారం చివరి రోజు... ఇంతవరకు అందరి మాటలు విన్నారు. ఎవరు ప్రజలకు సహాయం చేస్తారు... ఎవరి వల్ల పనులు జరుగుతాయి అన్నది అలోచించి ఓటు వేయాలి. అందరు చెప్పింది వినాలి... కానీ న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలి. తిన్న రేవు తలవాలి అన్నారు పెద్దలు. ఆలా చేస్తేనే నీయత్, బర్కత్ ఉంటది'' అని హరీష్ సూచించారు.

''2016 రూపాయల పింఛన్ ఇచ్చింది కారు గుర్తు పార్టీ TRS, CM KCR కాదా? ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో వృద్దులు, వికలాంగులకు ఇస్తున్నది కేవలం రూ. 600 పింఛన్ మాత్రమే. మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు రూ.200 ఉన్న పింఛన్ రూ.1000 చేసాం. రెండోసారి రూ.2016 చేసాం. కల్యాణ లక్ష్మి ఇచ్చినప్పుడు మొదట ఎస్సీలను మాత్రమే అమలు చేసాం. అప్పుడు రూ.50 వేలు మాత్రమే ఇచ్చినం. కొంచెం చేయి తిరిగిన తర్వాత అందరికి అమలు చేసారు. ప్రస్తుతం రూ. లక్ష 116 రూపాయలు ఇస్తున్నాం'' అని harish rao తెలిపారు.

VIDEO  Huzurabad Bypoll:బండి సంజయ్... నోరు అదుపులో పెట్టుకో: మంత్రి తలసాని వార్నింగ్  

''కేసీఆర్ కిట్ ఇచ్చి సర్కారు దవాఖానలో డెలివరీ చేసి రూ.12 వేలు ఇచ్చి ఇంటిదగ్గర దింపుతున్నది కేసీఆర్ ప్రభుత్వం. జమ్మికుంటలో డాక్టర్ల మీటింగ్ పెడితే ఓ డాక్టర్లు చెప్పారు... కేసీఆర్ కిట్ పథకం పెట్టిన తర్వాత మాకు గిరాకీ తగ్గిందని. అందరు సర్కారు దవాఖానలపై వెళ్తున్నారని... గతంలో 15 డెలివరీలు చేసేవాళ్ళం.. ఇప్పుడు ఒకటి రెండు కూడా రావడం లేదని చెప్పారు. కేసీఆర్ పెట్టిన పథకం మంచి ఫలితం ఇచ్చినప్పుడు నా మనసుకు సంతోషం కలిగింది'' అని మంత్రి తెలిపారు. 
 

''70 ఏళ్ల పాలనలో రైతులకు డబ్బు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. రైతులతో నీటి తీరువా, భూమి శిస్తు కట్టించారు. కానీ రైతుబంధు ఇస్తూ రైతుకు శిస్తు కడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం... ఉచిత కరెంటు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎండాకాలం యాసంగి పంట వేయాలంటే రైతులు నీళ్లు లేక బాధపడేవాళ్లు... మొఖాన్ని మొగులుదిక్కు పెట్టి చూసేవాళ్ళు...  అనుమానం మీద నారు పోసేవాళ్ళు.. పొట్టకు వచ్చే వరకు నీళ్లు అందక పంటలు ఎండిపోయేవి. షెట్టర్లు పగులగొట్టేవాళ్ళు... కాలువలు తెగ్గొట్టేవాళ్ళు... ఎవరైనా కాలువకు మోటార్లు పెడితే ఎమ్మార్వో ఆఫీసు వాళ్ళు వచ్చి పైపులు కోసేవాళ్ళు. మోటార్లు జీపులో వేసుకుపోయేవాళ్లు.దీంతో రైతులు ధర్నాలు చేసేవాళ్ళు.. ఇప్పుడు ఆ బాధలు ఉన్నాయా? బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నాం...  నీళ్లు ఇక చాలు.. బంద్ చేయండి అనే దాకా ఇస్తున్నాం'' అని హరీష్ పేర్కొన్నారు. 

''గతంలో ఎవరైనా పెద్దలు చనిపోతే బొక్కలు తీసుకుపోయి కాళేశ్వరం నీళ్లలో కలిపి సీసాల్లో నీళ్లను తెచ్చుకునేవాళ్ళం. అలాంటిది వంద తాటిచెట్ల లోతున ఉన్న కాళేశ్వరం నీళ్లను ఎత్తి పోస్తే బిజిగిరి షరీఫ్ నడి ఊళ్ళో నుండి నీళ్లు పోతున్నాయా లేదా? ఈ ఘనత టీఆర్ఎస్ దే. కరెంట్ గతంలో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. బావుల గడ్డల మీద, పొలం గట్ల మీద రైతులు పడుకునేవాళ్ళు... కానీ నేడు 24 గంటల కరెంటు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం'' అని తెలిపారు.

''ఈటల రాజేందర్, బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చారు? బొందపెడుతా... కూలగొడుతా.. కాలవెడుతా.. అంతు చూస్తా.. గోరీ కడుతా అని అన్నాడే తప్ప నిరుపేదలకు ఏమైనా చేస్తా అని చెప్పాడా? టీఆర్ఎస్ వాళ్ళను తిట్టడం తప్ప రాజేందర్ చెప్పింది ఏమి లేదు. నీ స్వార్థం కోసం బీజేపీ లో చేరావు. బీజేపీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1050 చేసింది. ఓట్లు అయిపోయిన తర్వాత రూ. 200 ఒకేసారి పెంచుతారట. సబ్సిడీ మాత్రం తగ్గించారు'' అని హరీష్ మండిపడ్డారు. 

''ప్రతి గ్రామానికి మహిళా భవనానికి రూ.15 లక్షలు ఇచ్చాము. మహిళా సంఘాలకు రుణాలు చెక్కులు ఇచ్చాము. రోడ్లకు నిధులు ఇచ్చాము. మేము పనిచేశాం... మాకు ఓట్లు వేయమని అడుగుతున్నాం. ఢిల్లీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారానికి వచ్చారు. ఆయనను సిలిండర్ ధర తగ్గించాలని అడిగాం... సబ్సిడీ రూ. 250 ఇవ్వాలని అడిగాం. కానీ ఉత్త చేతులు ఊపడం, గాలి మాటలు చెప్పడం తప్ప పేదలకు ఏం చేస్తారో ఆయన చెప్పలేదు'' అని హరీష్ రావు మండిపడ్డారు. 

''బీహార్ రాష్ట్రానికి చెందిన డోలా కుమారికి స్వయంగా ప్రధాని మోడీ ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. అయితే గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుండి వెయ్యి దాటడంతో ఆమె సిలిండర్ అటక ఎక్కించింది. పొయ్యిల కట్టెలు వాడుతోంది. వచ్చే ఏడాది వరకు సిలిండర్ ధర రెండు వేలు దాటుతుంది...ఇందుకు బీజేపీకి ఓటు వేద్దామా? కనీసం ఇకనైనా సిలిండర్ ధర పెంచమని చెప్పండి అని బీజేపీ నాయకులను అడిగాం... అదికూడా వారు చెప్పడం లేదు. 30వ తారీకున ఓటు వేసే ముందు మహిళలు వంటగదిలోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి కారు గుర్తుకు ఓటు వేసి బీజేపీని బొందపెట్టండి. ఆలాగైతేనే గ్యాస్ ధర తగ్గుతుంది'' అని సూచించారు.
 

''పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారు. దీంతో ఒక ఎకరం దున్నెందుకయ్యే రూ.2500 కాస్తా నేడు రూ.6 వేలు అవుతోంది. డీజిల్ ధర పెరగడమే దీనికి కారణం. కేసీఆర్ రైతుబంధు డబ్బులను రైతుల కుడి చేతికి ఇస్తుంటే... ఎడమ చేతితో బీజేపీ తీసుకుంటోంది. మంచినూనె 200 అయింది... నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇదంతా చూసి రాజేందర్ కు ఏం చెప్పాలో తెలియడం లేదు. అందుకే టీఆర్ఎస్ ను తిడుతున్నాడు. బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోకి వచ్చేది లేదు. రాజేందర్ రాకముందు టీఆర్ఎస్ గెలిచింది... రాజేందర్ పోయిన తర్వాత కూడా గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే'' అని హరీష్ ధీమా వ్యక్తం చేసారు. 

''రైతులు ఇష్టం వచ్చిన పంటలు వేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు... ఏదైనా వేసుకోవచ్చు. దీనిపై బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తాం. ఎవరో దాడులు చేసినట్టు సృష్టించి సానుభూతి పొందే ప్రయత్నం ఈటల రాజేందర్, బీజేపీ చేస్తోంది. వాటిని నమ్మకండి. సోషల్ మీడియాలో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేయాలని చూస్తున్నారు బీజేపీ నాయకులు. వీటిని నమ్మొద్దు... హుజురాబాద్ ప్రజలు లాభపడాలి'' అన్నారు మంత్రి హరీష్. 

click me!