Rain Alert : వేసవికాలం ఇంకా ముగియనేలేదు అప్పుడే వానలు మొదలయ్యాయి... తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు గత రెండుమూడు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇవాళ(శనివారం) కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ ఈ వర్షాల కారణంగా ఎండలు తగ్గి వాతావరణం చల్లబడుతుందని తెలిపారు.
ఉత్తర తమిళనాడును ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ఉత్తర కర్ణాటక పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతోనే దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ, ఏపీలో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ వర్షాలు :
తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయట. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.
ఇక ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్. హన్మకొండ, మంచిర్యాల, భువనగిరి, జనగాం, సిద్దిపేట, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం :
ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో కూడా వర్షతీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నంద్యాల, కర్నూల్, అనంతపురం, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
మిగతా జిల్లాల్లో వర్షాలు కురవకున్నా వాతావరణం చల్లబడుతుందని వాతావరణ తెలిపింది. అయితే పిడుగులు, ఈదురుగాలులతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు :
నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ కు చేరుకున్నాయి... వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఇవి చురుగ్గా ముందుకు కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ముందుగా చెప్పినట్లే మే నెలాఖరుకు ఇవి కేరళ తీరాన్ని తాకుతాయని... జూన్ మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటాయని తెలిపారు. ఈ రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరిస్తే విస్తారంగా వర్షాలు కురుస్తాయి.