Published : Apr 16, 2026, 01:01 PM ISTUpdated : Apr 16, 2026, 01:11 PM IST
ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ మంగ్లీ అరెస్ట్ అవుతారా..? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. ప్రజలనుండి డబ్బులు వసూలుచేసిన స్కాం వ్యవహారంలో దూకుడు పెంచిన CID విచారణ వేగవంతం చేసింది.
Mangli Arrest : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సింగర్ సత్యవతి అలియాస్ మంగ్లీ వ్యవహారం సంచలనంగా మారింది. తెలంగాణ జానపద పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని సినిమా పాటలు పాడే స్థాయికి చేరుకుంది మంగ్లీ. ఇలా సెలబ్రిటీగా మారిన ఆమె తన పేరును అడ్డం పెట్టుకుని భారీ స్కాంకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి... ఆమెపై హైదరాబాద్ లో కేసు కూడా నమోదయ్యింది. ఈ క్రమంలోనే ఏ క్షణంలో అయినా మంగ్లీ అరెస్ట్ అవుతారంటూ ప్రచారం జరుగుతోంది.
25
మంగ్లీ కేసులో సిఐడి దూకుడు..
మంగ్లీపై వచ్చిన ఆర్థిక మోసాల ఆరోపణలు వంద కోట్లకు సంబంధించినవి కావడంతో ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ కేసు విచారణను CID కి అప్పగించింది. దీంతో ఆరోపణలు వస్తున్నట్లు స్వయంగా ఈ స్కాంలో మంగ్లీ పాల్గొన్నారా..? తెరవెనక ఉండి నడిపించారా..? అనేది తేల్చే పనిలో పడింది సిఐడి. అంతేకాదు ప్రధాన నిందితుడు మధు పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నారు.
ఈ కేసులో సిఐడి దూకుడుగా ముందుకు వెళుతోంది. ప్రజలను మోసం చేసినట్లు ఏ చిన్న క్లూ దొరికినా మంగ్లీని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆమెను అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు సేకరిస్తేనే ఈ కేసు విచారణ ఓ కొలిక్కి వస్తుందని CID భావిస్తోంది... అందుకే ఆమె అరెస్ట్ ఖాయమనే ప్రచారం సాగుతోంది.
35
అసలు ఏమిటీ స్కాం..?
సిమెంట్ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాబాల్లో వాటా ఇస్తామని చెప్పి హైదరాబాద్ కు చెందిన కొందరు మోసాలకు తెరతీశారు. ఇలా హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్ తో మంగ్లీకి సంబంధాలు ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. ఈ స్కాంలో కీలకమైన రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ పరారీలో ఉన్నారు.
మధు గ్యాంగ్ ప్రజల నుండి రూ.10 కోట్ల నుండి రూ.150 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్కాంలో మంగ్లీ ప్రమేయం ఉందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల తరపున హైదరాబాద్ లాయర్ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది.
సింగర్ మంగ్లీతో పాటు ఆమె తమ్ముడు శివ పేరుచెప్పి కొందరు వ్యక్తులు బాధితులను పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించినట్లు సుబ్బారావు ఆరోపిస్తున్నారు. ఇలా అధిక లాభాలు వస్తాయని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేశారంటున్నారు. ఇప్పుడు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బాధితులను బెదిరిస్తున్నారని సుబ్బారావు పోలీసులకు తెలిపారు. అయితే ఈ స్కామ్ ఏ 10, 20 కోట్లది కాదు... ఏకంగా రూ.150 కోట్లదని ప్రచారం జరుగుతోంది.
55
మంగ్లీ రియాక్షన్..
తనపై వచ్చిన ఆర్థిక నేరాల ఆరోపణలపై మంగ్లీ కూడా స్పందించారు. పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన ఆమె కౌంటర్ ఫిర్యాదు దాాఖలుచేశారు. ఈ సమయంలో ఆమె మాట్లాడుతూ.. తాను కేవలం పాటలు పాడుకుంటూ కష్టపడి ఈ స్థాయికి వచ్చానని... ఎవరినీ మోసం చేయలేదని చెప్పుకొచ్చారు. కొందరు కావాలనే తనపై బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై పోలీసులకు ఫిర్యాదుచేసిన న్యాయవాది సుబ్బారావు రూ.10 లక్షలు డిమాండ్ చేశారని.. డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానని బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో డబ్బు కట్టలతో తన తమ్ముడు ఉన్నట్లుగా ఓ ఫోటో వైరల్ అవుతోంది.. కానీ అందులో ఉన్నది తన తమ్ముడు కాదన్నారు. ఫోటోలను మార్ఫింగ్ చేసి, తప్పుగా చిత్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ స్కాంలో తాను నిందితురాలిని కాదు బాధితురాలినే అంటోంది మంగ్లీ. తన పేరును వాడుకుని ఎవరో మోసాలు చేస్తే తనకేం సంబంధమని అంటున్నారు. నిజానికి తన పేరు చెడగొడుతున్నందుకు తానే బాధితురాలిని అని ఆమె వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. తనకు ఏ స్కాంతో సంబంధాలు లేవన్నారు మంగ్లీ.