గద్వాల ఎమ్మెల్యే కృష్ణమెహన్ రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్

First Published Dec 2, 2021, 5:07 PM IST

ఇటీవలే తండ్రి మృతిచెందడంతో బాధలో వున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. గద్వాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లి బండ్ల వెంకట్రామిరెడ్డికి సీఎం నివాళి అర్పించారు. 

గద్వాల: తండ్రి మరణంతో బాధలో వున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ నవంబర్ 11వ తేదీన బండ్ల వెంకట్రామిరెడ్డి(82) మరణించారు. దీంతో బాధలో వున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ ఇవాళ పరామర్శించారు. 
 

ప్రత్యేక బస్సులో గద్వాలకు చేరుకున్న సీఎం నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ  బండ్ల వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో పాటు తల్లి రేవతమ్మ, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
 

ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు జిల్లా మంత్రులు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని స్థాయిల ఛైర్మన్లు, జడ్పి చైర్ పర్సన్లు, ఎంపిపీలు, జెడ్పిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, సింగిల్ విండో  చైర్మన్లు,  కౌన్సిలర్స్, సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.
 

ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స పొందారు. అయితే హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్ళిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తిరిగి హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. 
 

ఎమ్మెల్యే తండ్రి మరణవార్త తెలిసినవెంటనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తాజాగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి తండ్రిని కోల్పోయిన బాధలో వున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని పరామర్శించారు. 

click me!