టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?

Published : Dec 14, 2025, 09:50 PM IST

Aaron George : అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై ఆరోన్ జార్జ్ 85 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేరళలో పుట్టి హైదరాబాద్‌కు ఆడుతున్న ఈ యువ సంచలనం.. టీమిండియాకు మరో సంజూ శాంసన్ దొరికేశాడు అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు.    

PREV
15
పాకిస్థాన్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన ఆరోన్ జార్జ్.. ఎవరీ కేరళ కుర్రాడు?

దుబాయ్ లో జరుగుతున్న ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్ 2025లో భారత యువ క్రికెటర్లు అదరగొడుతున్నారు. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్ ఆరోన్ జార్జ్ తన క్లాసీ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

పాకిస్థాన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ జార్జ్ ఆడిన ఇన్నింగ్స్ భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించింది. కేవలం 19 ఏళ్ల వయసులో అతను చూపిన క్రికెట్ నైపుణ్యం, షాట్ ఎంపిక క్రికెట్ విశ్లేషకులను సైతం మెప్పించింది. సెంచరీకి చేరువలో ఔటైనప్పటికీ, జార్జ్ పోరాట పటిమ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

25
క్లిష్ఠ సమయంలో ఆపద్బాంధవుడులా ఆరోన్ జార్జ్

దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 5 పరుగులకే వెనుదిరగగా, కెప్టెన్ ఆయుష్ మ్హత్రే 38 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఆరోన్ జార్జ్ బాధ్యతాయుతంగా ఆడాడు.

పాకిస్థాన్ బౌలింగ్ ఎటాక్ చాలా కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ, జార్జ్ ఏమాత్రం తడబడలేదు. 88 బంతులను ఎదుర్కొన్న అతను 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 85 పరుగులు సాధించాడు. రెండో వికెట్‌కు ఆయుష్ మ్హత్రేతో కలిసి 49 పరుగులు జోడించిన జార్జ్, ఆ తర్వాత వికెట్లు పడుతున్నా సంయమనం కోల్పోలేదు. ఐదో వికెట్‌కు అభిజ్ఞాన్ కుందుతో కలిసి మరో 60 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 113 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను గౌరవప్రదమైన స్కోరు దిశగా నడిపించాడు.

35
సంజూ శాంసన్‌తో పోలికలు.. క్లాసీ బ్యాటింగ్

ఆరోన్ జార్జ్ బ్యాటింగ్ శైలి ఇతర యువ క్రికెటర్ల కంటే భిన్నంగా ఉంది. వైభవ్ సూర్యవంశీ లేదా ఆయుష్ మ్హత్రే లాగా అతను భారీ షాట్ల కోసం తొందరపడలేదు. బంతిని బాదేయడం కాకుండా, టైమింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడ్డాడు. అతని హై బ్యాట్ లిఫ్ట్, అద్భుతమైన ఫుట్‌వర్క్, ఫీల్డర్ల మధ్య గ్యాప్స్‌ను వెతికి బౌండరీలు రాబట్టే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ క్లాసీ ఆటతీరును చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో అతన్ని టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌తో పోల్చడం మొదలుపెట్టారు. రిస్క్ లేని షాట్లతో పరుగులు రాబట్టడం జార్జ్ ప్రత్యేకత. పాక్ పేసర్ అబ్దుల్ సుభాన్ వేసిన బౌన్సర్‌ను కవర్ రీజియన్‌లో ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి జార్జ్ ఔటయ్యాడు. సెంచరీ చేజారినా, మిడిల్ ఓవర్లలో అతను ఇచ్చిన స్థిరత్వం భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచింది.

45
హైదరాబాద్ క్రికెట్‌లో కొత్త ఆశాకిరణం ఆరోన్ జార్జ్

ఆరోన్ జార్జ్ పుట్టింది కేరళలో అయినప్పటికీ, అతను క్రికెట్ ఆడుతున్నది మాత్రం హైదరాబాద్ తరపున. అండర్-19 స్థాయిలో అతను హైదరాబాద్ జట్టుకు ఎంతో నమ్మదగిన బ్యాటర్‌గా ఎదిగాడు. వీనూ మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన జార్జ్, చాలా కాలం తర్వాత జట్టుకు ఆ ట్రోఫీని అందించి చరిత్ర సృష్టించాడు.

దేశవాళీ క్రికెట్‌లోనూ జార్జ్ పరుగుల వరద పారిస్తున్నాడు. వీనూ మన్కడ్ ట్రోఫీ గత రెండు సీజన్లలో వరుసగా 341, 373 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ నిలకడైన ప్రదర్శన వల్లే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన అండర్-19 ట్రై-సిరీస్‌లో ఇండియా-బి జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుత ఆసియా కప్‌లోనూ ఇది అతని రెండో ఫిఫ్టీ ప్లస్ స్కోరు కావడం విశేషం. ఇంతకుముందు యూఏఈపై జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో 69 పరుగులతో రాణించాడు.

55
నాన్న కల.. కొడుకు గెలుపు

జార్జ్ విజయాల వెనుక అతని తండ్రి ఈసో వర్గీస్ కృషి ఎంతో ఉంది. ఈసో కూడా క్రికెటర్ కావాలని కలలు కన్నారు. లీగ్ క్రికెట్ ఆడిన ఆయన, సరైన ప్రోత్సాహం లేక కెరీర్‌ను కొనసాగించలేకపోయారు. పోలీసు శాఖలో పనిచేశారు, ఆ తర్వాత కార్పొరేట్ సెక్టార్‌లో స్థిరపడ్డారు.

అయితే, తన కొడుకు కెరీర్ కోసం ఈసో తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేశారు. జార్జ్ ప్రాక్టీస్, ఫిట్‌నెస్ మీద పూర్తి దృష్టి పెట్టారు. టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్ కూడా ఆడే ఆరోన్ జార్జ్.. తనకు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ (ABD) ఆదర్శమని చెప్పాడు. మైదానంలో ఎటువైపైనా షాట్లు కొట్టగలగడం జార్జ్ ప్రత్యేకత. 2022-23 విజయ్ మర్చంట్ ట్రోఫీలో బీహార్‌పై అతను చేసిన నాటౌట్ 303 పరుగుల ఇన్నింగ్స్ సెలెక్టర్ల దృష్టిలో పడేలా చేసింది.

భారత బౌలర్ల విజృంభణ.. పాక్ చిత్తు

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జార్జ్ 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఆఖర్లో కనిష్క్ చౌహాన్ 46 బంతుల్లో 46 పరుగులు చేసి స్కోరును 240కి చేర్చాడు. అనంతరం బౌలింగ్‌లోనూ భారత కుర్రాళ్లు చెలరేగారు.

భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ 150 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 90 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కనిష్క్ చౌహాన్ మూడు వికెట్లు తీయగా, దీపేశ్ దేవేంద్రన్ కూడా మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. కిషన్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. మొత్తానికి బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై విజయాన్ని నమోదు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories