IND vs NAM : అభిషేక్ శర్మకు ఏమైంది? సిరాజ్ ఎందుకు ఆడలేదు?

Published : Feb 12, 2026, 11:42 PM IST

IND vs NAM : టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ రెండో విజయాన్ని అందుకుంది. సూపర్ 8 దిశగా ముందుకు సాగుతోంది. అయితే, నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, మహమ్మద్ సిరాజ్ ఎందుకు ఆడలేదు? ఈ ఇద్దరు స్టార్లకు ఏమైంది?

PREV
16
టీ20 వరల్డ్ కప్ 2026: నమీబియాతో మ్యాచ్.. ఆ ఇద్దరు స్టార్లు ఎందుకు లేరు?

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో జరిగిన 18వ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే తుది జట్టులో స్టార్ ప్లేయర్లు అభిషేక్ శర్మ, మహమ్మద్ సిరాజ్ లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో స్పష్టత ఇచ్చారు.

26
అభిషేక్ శర్మ దూరమవ్వడానికి కారణం ఇదే

యూఎస్‌ఏతో జరిగిన గత మ్యాచ్‌లో వైరల్ ఫీవర్‌తో బాధపడుతూనే ఆడిన ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఢిల్లీ చేరుకున్న తర్వాత అతనికి తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయినప్పటికీ, అతను ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. టాస్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, "అభిషేక్ ఇంకా కోలుకుంటున్నాడు. అతను మరో ఒకటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది" అని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు కూడా అతను అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది.

36
సిరాజ్ స్థానంలో బుమ్రా ఎంట్రీ

మరోవైపు, గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేసిన మహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీనికి ప్రధాన కారణం స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడమే. అనారోగ్యం కారణంగా యూఎస్‌ఏ మ్యాచ్‌కు దూరమైన బుమ్రా కోలుకోవడంతో, టీమ్ మేనేజ్మెంట్ సిరాజ్ స్థానంలో బుమ్రాను ఎంపిక చేసింది. ఈ మార్పు వ్యూహాత్మకమైందని, సిరాజ్ ప్రదర్శనలో లోపం ఏమీ లేదని కెప్టెన్ స్పష్టం చేశారు.

46
నమీబియాను దంచికొట్టిన భారత్

ఈ మ్యాచ్‌లో నమీబియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో రెండు మార్పులు జరిగాయి. అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శామ్సన్, సిరాజ్ స్థానంలో బుమ్రా జట్టులోకి వచ్చారు. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లో 61 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 28 బంతుల్లో 52 పరుగులతో సునామీ రేపాడు.

56
బౌలర్ల విజృంభణ.. నమీబియా చిత్తు

210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియాను భారత బౌలర్లు కట్టడి చేశారు. పవర్‌ప్లేలో నమీబియా 57 పరుగులు చేసినప్పటికీ, ఆ తర్వాత భారత స్పిన్నర్లు పట్టు బిగించారు. వరుణ్ చక్రవర్తి కేవలం రెండు ఓవర్లలో 7 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలో రెండు వికెట్లు తీశారు. దీంతో నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది.

66
టీమిండియా సరికొత్త రికార్డు

ఈ విజయంతో భారత్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా 10వ విజయాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది. 93 పరుగుల తేడాతో గెలిచిన భారత్, రన్ రేట్ పరంగా కూడా మెరుగైన స్థితికి చేరుకుంది. ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. బ్యాటింగ్‌లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, బౌలర్ల  కలిసికట్టుగా రాణించడంతో  భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుని సూపర్-8 దిశగా అడుగులు వేసింది.

Read more Photos on
click me!

Recommended Stories