254 పరుగుల భారీ లక్ష్యం.. ఆకట్టుకున్న ప్రిన్స్ యాదవ్
ఆర్య, కోనోలీ మెరుపుల పుణ్యమా అని పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 21 సిక్సర్లు, 14 ఫోర్లు నమోదయ్యాయి. లక్నో బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ, యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ మాత్రం ఆకట్టుకున్నాడు. అతను తన 4 ఓవర్ల కోటాలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టడం విశేషం.
భారత క్రికెట్లో ఉదయిస్తున్న ధ్రువతార ప్రియాంష్ ఆర్య
పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ప్రియాంష్ ఆర్య, అత్యంత వేగంగా ఆడే లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. ఢిల్లీలో 2001, జనవరి 18న జన్మించిన 23 ఏళ్ల ఈ యువ ఆటగాడిని 2025 ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 3.8 కోట్లకు కొనుగోలు చేసింది.
2025 డెబ్యూ సీజన్లోనే 180 స్ట్రైక్ రేట్తో 475 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఆర్య, చెన్నై సూపర్ కింగ్స్పై కేవలం 42 బంతుల్లోనే 103 పరుగులు చేసి తన పవర్ను చాటుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ, ఇండియా-ఏ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. తాజాగా ఐపీఎల్ 2026లో లక్నోపై 37 బంతుల్లోనే 93 పరుగులు చేయడమే కాకుండా, క్యూపర్ కోనోలీతో కలిసి 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన పవర్ప్లే బ్యాటర్గా గుర్తింపు పొందాడు.