IPL 2026 RCB : ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. ఇదే సమయంలో ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చింది. స్టార్ పేసర్ హేజిల్వుడ్ దూరం కానుండగా, చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఒక గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియా స్టార్ జోష్ హేజిల్వుడ్ టోర్నమెంట్ తొలి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. అయితే, అదే సమయంలో బెంగళూరు అభిమానులకు ఒక తీపి కబురు కూడా అందింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇది వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని ఎం. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది.
25
హేజిల్వుడ్ ఫిట్నెస్ అప్డేట్ ఇదే
ఆస్ట్రేలియా గన్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా మెడికల్ టీమ్ నుండి అతనికి ఇంకా అధికారిక క్లియరెన్స్ లభించలేదు. ప్రస్తుతం హేజిల్వుడ్ పునరావాస ప్రక్రియలో ఉన్నాడు. మార్చి 28న ఎం. చిన్నస్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరగనున్న సీజన్ తొలి మ్యాచ్ సమయానికి అతను కోలుకునే అవకాశం లేదని తెలుస్తోంది. హేజిల్వుడ్ మాత్రమే కాకుండా, మరో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ కూడా ప్రారంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చని ఆర్సీబీ అధికారి ఒకరు వెల్లడించారు. టోర్నమెంట్ సెకండ్ హాఫ్ లో మాత్రమే హేజిల్వుడ్ జట్టుతో చేరే అవకాశం ఉంది.
35
ఆర్సీబీ బౌలింగ్ భారం ఎవరిపై?
గత వేలంలో ఆర్సీబీ రూ. 12.5 కోట్లు వెచ్చించి హేజిల్వుడ్ను దక్కించుకుంది. 2025 సీజన్లో అతను 12 మ్యాచ్ల్లో 22 వికెట్లు తీసి జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అతను లేని లోటును భర్తీ చేసే బాధ్యత భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్పై పడనుంది. భువనేశ్వర్తో పాటు జాకబ్ డఫీ, నువాన్ తుషార వంటి బౌలర్లు ఆర్సీబీ పేస్ అటాక్ను నడిపించాల్సి ఉంటుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న బెంగళూరుకు బౌలింగ్ విభాగం కీలకం కానుంది.
గత ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలిచిన సందర్భంలో జరిగిన వేడుకల సమయంలో తొక్కిసలాట జరగడంతో, చిన్నస్వామి స్టేడియం భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన నిపుణుల కమిటీ రిపోర్టుల ఆధారంగా కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జి. పరమేశ్వర నేతృత్వంలో సోమవారం కీలక సమావేశం జరిగింది. స్టేడియంలో మెరుగైన భద్రతా చర్యలు, క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, అదనపు ఎంట్రీ గేట్లు, ఏఐ ఆధారిత నిఘా ఏర్పాటు చేయడంతో, మ్యాచ్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో బెంగళూరు అభిమానుల ఉత్కంఠకు తెరపడింది.
55
ఐపీఎల్ మ్యాచ్ల షెడ్యూల్ ఇదే
ప్రభుత్వ అనుమతి ప్రకారం, ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్ ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మధ్య మార్చి 28న చిన్నస్వామి స్టేడియంలోనే జరుగుతుంది. ఆర్సీబీ తన హోమ్ గ్రౌండ్లో ఐదు లీగ్ మ్యాచ్లు ఆడనుంది. మిగిలిన రెండు హోమ్ మ్యాచ్లు రాయ్పూర్లో జరుగుతాయి. అలాగే ఒక ప్లేఆఫ్ మ్యాచ్, ఫైనల్ కూడా బెంగళూరులో జరిగే అవకాశం ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియం సామర్థ్యాన్ని 30,000 నుండి 35,000 మధ్య మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వం సూచించింది.