T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !

Published : Dec 21, 2025, 04:34 PM IST

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ నుండి అత్యధికంగా నలుగురు ప్లేయర్లు ఎంపికయ్యారు. ఆర్సీబీ, లక్నో, రాజస్థాన్ జట్ల నుండి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు.

PREV
16
ఆర్సీబీ, రాజస్థాన్ అవుట్.. టీమిండియాలో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం!

టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సన్నాహాలు పూర్తి చేసింది. డిసెంబర్ 20న అధికారికంగా టీమిండియా జట్టును కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు.

అయితే ఈసారి జట్టు ఎంపికలో ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రాతినిధ్యంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఐపీఎల్‌లోని మొత్తం 10 జట్లలో కేవలం 7 జట్ల ఆటగాళ్లు మాత్రమే ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోగలిగారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సహా మూడు ప్రముఖ ఫ్రాంచైజీల నుండి ఒక్క ఆటగాడు కూడా ఎంపిక కాకపోవడం గమనార్హం.

ఈసారి ఎంపికలో ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఐపీఎల్ 2026 వేలానికి ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో, భారత జట్టు కూర్పులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్, జితేష్ శర్మలకు ఉద్వాసన పలికి, వారి స్థానాల్లో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లకు అవకాశం కల్పించారు.

26
భారత జట్టు ముంబై ఇండియన్స్ జోరు

టీ20 ప్రపంచ కప్ 2026 జట్టులో అత్యధిక మంది ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ (MI) నుంచే ఎంపికయ్యారు. ఈ జట్టు నుండి మొత్తం నలుగురు ఆటగాళ్లు టీమిండియా జెర్సీ ధరించనున్నారు. ఇందులో ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే భారత్ బరిలోకి దిగనుంది.

రెండో ప్లేయర్ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ప్రపంచ కప్‌లో ఫినిషర్ పాత్రను పోషించడానికి హార్దిక్ సిద్ధంగా ఉన్నాడు. మూడవ ఆటగాడిగా యువ సంచలనం తిలక్ వర్మ ఎంపికయ్యాడు. తిలక్ ప్రస్తుతం టీమిండియా మిడిల్ ఆర్డర్‌లో అత్యంత నమ్మదగ్గ బ్యాటర్‌గా ఎదిగాడు. ఇక నాలుగవ పేరు పేస్ దళపతి జస్ప్రీత్ బుమ్రా. బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించే బాధ్యత బుమ్రాపై ఉంది. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై ఆటగాళ్లు కీలక పాత్ర పోషించనున్నారు.

36
కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై జట్ల వాటా ఏంటి?

ముంబై తర్వాత అత్యధిక ఆటగాళ్లను అందించిన జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నిలిచింది. ఈ జట్టు నుండి ముగ్గురు ఆటగాళ్లు ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించారు. స్పిన్ మ్యాజిక్ చూపించే వరుణ్ చక్రవర్తి, పేస్ బౌలర్ హర్షిత్ రాణా, ఫినిషర్ రింకూ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. వీరి ముగ్గురూ కేకేఆర్ తరపున నిలకడగా రాణించి జాతీయ జట్టులో స్థానం సంపాదించారు.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నుండి ఇద్దరు ఆటగాళ్లకు అవకాశం దక్కింది. ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నుండి ఎంపికయ్యాడు. దేశవాళీ, ఐపీఎల్ మ్యాచ్‌లలో వీరిద్దరూ అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో సెలెక్టర్లు వీరి వైపు మొగ్గు చూపారు.

అలాగే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నుండి కూడా ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో చేరారు. ఓపెనింగ్ బాధ్యతలు పంచుకోగల వికెట్ కీపర్ సంజూ శాంసన్, ఆల్ రౌండర్ శివం దూబే చెన్నై జట్టు నుండి ఎంపికయ్యారు. సంజూ శాంసన్ దూకుడుగా ఆడటంలో దిట్ట కాగా, శివం దూబే బ్యాట్, బాల్‌తో జట్టులో కీలక పాత్ర పోషించనున్నాడు.

46
ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ జట్ల నుంచి ఎంత మంది ప్లేయర్లు టీమిండియాలో ఉన్నారు?

ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు నుండి స్పిన్ విభాగంలో ఇద్దరు కీలక ఆటగాళ్లు ఎంపికయ్యారు. అక్షర్ పటేల్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్‌గా జట్టులో ఉన్నాడు. వీరిద్దరి అనుభవం ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో భారత్‌కు ఎంతగానో ఉపయోగపడనుంది.

పంజాబ్ కింగ్స్ (PBKS) నుండి కేవలం అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే ఎంపికయ్యాడు. ఎడమచేతి వాటం పేసర్ అయిన అర్ష్‌దీప్, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. గుజరాత్ టైటాన్స్ (GT) నుండి స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒక్కడే జట్టులో చోటు దక్కించుకున్నాడు.

56
ఆర్సీబీ, రాజస్థాన్, లక్నో ప్లేయర్లకు దక్కని చోటు

టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ప్రకటించిన భారత జట్టులో మూడు ప్రముఖ ఐపీఎల్ జట్ల నుండి ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల నుండి ఏ ఒక్క ఆటగాడిని కూడా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.

విశేషమేమిటంటే, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు గతంలో రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించినా, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కోటాలో చూపించడం గమనార్హం. ఈ మూడు జట్ల నుండి ప్రాతినిధ్యం లేకపోవడంపై ఆయా జట్ల అభిమానులు సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

66
టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.

Read more Photos on
click me!

Recommended Stories