
ICC Team of The Tournament : ఒకటి రెండు కాదు ఏకంగా మూడు టీ20 వరల్డ్ కప్స్ గెలిచి ఇండియన్ క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది. వెంటవెంటనే రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ సాధించిన ఘనత టీమిండియాదే. ఆతిథ్య జట్టు టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడం కూడా రికార్డే. ఇలా టీ20 క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత యువజట్టు అదరగొట్టింది. గత ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్పై ఏకంగా 96 పరుగుల భారీ తేడాతో గెలిచి విజయతీరాలకు చేరుకుంది.
ఈ టోర్నీలో ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు చూశాం. ఒక్కో ఆటగాడిది ఒక్కో స్టైల్ ఆటతీరు... కానీ అందరి ఆశ ఒకటే తమ జట్టును గెలిపించుకోవాలి. ఇలా టోర్నీలో అదరగొట్టిన బెస్ట్ ప్లేయర్లతో కూడిన 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'ను ఐసిసి ప్రకటించింది. అయితే ఇందులో నలుగురు ఇండియన్ ప్లేయర్స్ కు చోటు దక్కింది.. అయితే భారత్ కు టీ20 వరల్డ్ కప్ అందించిన సూర్యకుమార్ కు కెప్టెన్ గా కాదు సాధారణ ప్లేయర్ గా కూడా చోటు దక్కలేదు.
క్రికెట్ దిగ్గజాలైన ఇయాన్ బిషప్, ఇయాన్ మోర్గాన్, నటాలీ జర్మానోస్తో పాటు ఐసీసీ ప్రతినిధి గౌరవ్ సక్సేనా, జర్నలిస్ట్ రెక్స్ క్లెమెంటైన్లతో కూడిన సెలక్షన్ ప్యానెల్ ఈ మేటి ఆటగాళ్లను ఎంపిక చేసిందని ఐసీసీ వెబ్సైట్ తెలిపింది. మరి ఐసిసి టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లోని ఆటగాళ్లెవరో ఇక్కడ చూద్దాం.
7 మ్యాచ్లు, 383 పరుగులు, 76.60 సగటు, 160.25 స్ట్రైక్ రేట్.
ఈ టోర్నీలో పాకిస్థాన్ ప్రదర్శన దారుణంగా ఉన్నా ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్ మాత్రం ఉత్తమ ఆటతీరుతో అదరగొట్టాడు. పాకిస్థాన్ సూపర్-8 దశలోనే నిష్క్రమించినప్పటికీ అతను ఏడు మ్యాచ్ల్లో 383 పరుగులు చేశాడు. ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. అంతేకాదు ఒకే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో రెండు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్గా ఈ 29 ఏళ్ల ఓపెనర్ రికార్డు సృష్టించాడు. సూపర్-8 చివరి మ్యాచ్లో శ్రీలంకపై చేసిన సెంచరీ అతని ఇన్నింగ్స్కే హైలైట్. ఆ మ్యాచ్లో పాకిస్థాన్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది.
5 మ్యాచ్లు, 321 పరుగులు, 80.25 సగటు, 199.37 స్ట్రైక్ రేట్.
వరల్డ్ కప్ 2026 లో భారత్ అద్భుతమైన ముగింపు ఇవ్వడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. అందుకే 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా ఎంపికయ్యాడు... ఇప్పుడు టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో చోటు దక్కించుకున్నాడు.
ఐసిసి మెగా టోర్నీ ఆరంభంలో స్టార్లతో నిండిన భారత జట్టులో సంజూ చోటు దక్కించుకోలేకపోయాడు… కానీ చివరి దశలో మాత్రం అనూహ్యంగా జట్టులోకి వచ్చి చెలరేగిపోయాడు. సూపర్-8 లో వెస్టిండీస్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో అజేయంగా 97 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆ తర్వాత సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 89 పరుగులు, ఫైనల్లో న్యూజిలాండ్పై మరోసారి 89 పరుగులు చేశాడు. ఇలా ఫైనల్, సెమీఫైనల్ రెండింటిలోనూ హాఫ్ సెంచరీలు చేసిన మూడో బ్యాటర్గా, టీ20 వరల్డ్ కప్లో వరుసగా మూడు 80 ప్లస్ స్కోర్లు చేసిన రెండో ఆటగాడిగా సంజూ శాంసన్ నిలిచాడు.
9 మ్యాచ్లు, 317 పరుగులు, 35.22 సగటు, 193.29 స్ట్రైక్ రేట్.
ఇషాన్ కిషన్ తన దూకుడైన బ్యాటింగ్తో ఓపెనర్గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా ప్రభావం చూపాడు. ఈ వరల్డ్ కప్ లో అతడు మూడు హాఫ్ సెంచరీలు కొట్టాడు. జింబాబ్వేపై 38, ఇంగ్లండ్పై 39 పరుగులతో వేగంగా ఆడి జట్టుకు ఉపయోగపడ్డాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై వచ్చింది. ఆ మ్యాచ్లో భారత్ తొలి వికెట్ త్వరగా కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 77 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్ను నడిపించాడు. గత రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న కిషన్ ఫైనల్లో 54 పరుగులు చేసి, రెండు ముఖ్యమైన క్యాచ్లు పట్టి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.
9 మ్యాచ్లు, 217 పరుగులు, 160.74 స్ట్రైక్ రేట్, 9 వికెట్లు.
గత కొన్నేళ్లుగా బ్యాట్ లేదా బంతితో మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యంతో హార్దిక్ పాండ్యా భారత జట్టు విజయాల్లో కీలకంగా మారాడు. టీ20 వరల్డ్ కప్లోనూ అదే ఫామ్ను కొనసాగించి, 217 పరుగులు చేసి 9 వికెట్లు పడగొట్టాడు. పాండ్యా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. అందులో జింబాబ్వేపై 23 బంతుల్లో 50 పరుగులు చేసి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్లో భారత్ 256/4 స్కోర్ చేసింది. ఇది 2026 టీ20 వరల్డ్ కప్లో అత్యధిక టీమ్ టోటల్. బౌలింగ్లో పాకిస్థాన్పై మూడు ఓవర్లలో 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడం అతని అత్యుత్తమ ప్రదర్శన.
8 మ్యాచ్లు, 286 పరుగులు, 47.66 సగటు, 165.31 స్ట్రైక్ రేట్.
ఐడెన్ మార్క్రమ్ తన జట్టును అద్భుతంగా నడిపించాడు. అతని కెప్టెన్సీలో సౌతాఫ్రికా టోర్నీలో తొలి ఏడు మ్యాచ్ల్లోనూ గెలిచింది. బాధ్యత తీసుకోవడంలో ఎప్పుడూ ముందుండే అతను ఓపెనర్గా బరిలోకి దిగి మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. ముఖ్యంగా అహ్మదాబాద్లో అదరగొట్టాడు. న్యూజిలాండ్తో జరిగిన కీలక గ్రూప్ మ్యాచ్లో 86 నాటౌట్, సూపర్ ఎయిట్లో వెస్టిండీస్పై అజేయంగా 82 పరుగులు చేశాడు. భారత్తో జరిగిన మ్యాచ్లో బంతితోనూ రాణించి, తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ వికెట్ తీసి తన జట్టుకు బ్రేక్త్రూ ఇచ్చాడు. 2024 ప్రదర్శనను మెరుగుపరుచుకోలేక సౌతాఫ్రికా సెమీఫైనల్లోనే వెనుదిరిగినా, మార్క్రమ్ తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు.
8 మ్యాచ్లు, 226 పరుగులు, 176.56 స్ట్రైక్ రేట్, 9 వికెట్లు.
ఈ టోర్నీ విల్ జాక్స్కు బ్రేక్త్రూ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కిందికి వచ్చి, ఫినిషర్ పాత్రను అద్భుతంగా పోషించాడు. ఇటలీపై అజేయంగా 53 పరుగులు చేయడం అతని బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఆఫ్ స్పీన్నర్గా శ్రీలంకతో జరిగిన సూపర్ ఎయిట్ మ్యాచ్లో మూడు వికెట్లు తీసి జట్టును 51 పరుగుల తేడాతో గెలిపించాడు. జాక్స్ ఈ టోర్నీలో నాలుగు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకున్నాడు.
7 మ్యాచ్లు, 10 వికెట్లు, 141 పరుగులు.
వెస్టిండిస్ ఫైరీ పేసర్, పవర్ఫుల్ లోయర్-ఆర్డర్ బ్యాటర్ జాసన్ హోల్డర్ ఈ టోర్నీ స్టార్లలో ఒకడు. భారత్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో అతని ఆల్రౌండ్ ప్రతిభ బయటపడింది. ఆ మ్యాచ్లో 2/38 వికెట్లు తీసి, 22 బంతుల్లో 37 నాటౌట్ పరుగులు చేశాడు. వాంఖడే స్టేడియంలో నేపాల్పై 4/27 ప్రదర్శనతో చెలరేగాడు. ఆసియా జట్టుపై టాప్ ఫైవ్లో ముగ్గురిని ఔట్ చేసి, తన జట్టుకు తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు.
8 మ్యాచ్లు, 14 వికెట్లు, 12.42 సగటు, 6.21 ఎకానమీ.
భారత బ్యాటింగ్ లైనప్ ఎంత పటిష్టంగా ఉన్నా, జస్ప్రీత్ బుమ్రానే జట్టును అందరికంటే ఓ మెట్టు పైన నిలబెట్టాడు. 2026 టీ20 వరల్డ్ కప్లో, సహచరుడు వరుణ్ చక్రవర్తితో కలిసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఫైనల్లో న్యూజిలాండ్పై 15 పరుగులకే 4 వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో, బుమ్రా తీసింది ఒక్క వికెట్టే అయినా, 18వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు.
7 మ్యాచ్లు, 12 వికెట్లు, 15.58 సగటు, 7.19 ఎకానమీ.
టోర్నీలోని అత్యుత్తమ పేసర్లలో ఒకడైన లుంగి ఎంగిడి కెనడాపై 4/31తో టోర్నీని ప్రారంభించాడు. భారత్తో జరిగిన మ్యాచ్లో వికెట్లు తీయకపోయినా, తన నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చి భారత బ్యాటింగ్ జోరుకు కళ్లెం వేశాడు. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్లపై కూడా తన అనుభవాన్ని, వేరియేషన్ను, స్లో బాల్స్ను సమర్థంగా ఉపయోగించుకున్నాడు.
8 మ్యాచ్లు, 13 వికెట్లు, 19.23 సగటు, 8.15 ఎకానమీ.
ఈ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో ఉన్న ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ ఆదిల్ రషీద్. ముఖ్యంగా శ్రీలంకలో పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుని, ఇంగ్లండ్ తొలి ఏడు మ్యాచ్ల్లో ఆరు గెలవడంలో సహాయపడ్డాడు. స్కాట్లాండ్పై 3/36 అతని అత్యుత్తమ ప్రదర్శన. సూపర్ ఎయిట్స్లో శ్రీలంక, న్యూజిలాండ్పై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. భారత్పై, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వికెట్లు తీసి 2/41తో ముగించాడు.
6 మ్యాచ్లు, 13 వికెట్లు, 14.46 సగటు, 7.88 ఎకానమీ.
ఈ టోర్నీలో జింబాబ్వే కలల ప్రయాణంలో బ్లెస్సింగ్ ముజరబానీ కీలకంగా నిలిచాడు. 2024 ఎడిషన్కు దూరమైన జింబాబ్వే, ఈసారి సూపర్ ఎయిట్స్లో పోటీపడి టీ20 వరల్డ్ కప్స్లో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. ఆస్ట్రేలియాపై 23 పరుగుల తేడాతో గెలిచి జింబాబ్వే సత్తా చాటింది. ఆ మ్యాచ్లో ముజరబానీ 4/17తో ఆసీస్ను 146 పరుగులకే ఆలౌట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు.
4 మ్యాచ్లు, 13 వికెట్లు, 7.76 సగటు, 6.80 ఎకానమీ.
యూఎస్ఏ పేసర్ షాడ్లీ గ్రూప్ స్టేజ్లో అత్యుత్తమ బౌలర్గా నిలిచాడు. 2024 ప్రదర్శనను పునరావృతం చేయలేక యూఎస్ఏ సూపర్ ఎయిట్కు అర్హత సాధించకపోయినా, షాడ్లీ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్పై నాలుగు వికెట్ల ప్రదర్శనతో టోర్నీని ప్రారంభించాడు. ఆ తర్వాత పాకిస్థాన్పైనా అదే ప్రదర్శనను పునరావృతం చేసి 4/25తో రాణించాడు.