
ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గత సీజన్ వైఫల్యాలను మర్చిపోయి, సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. గత ఏడాది పాయింట్ల పట్టికలో అడుగున నిలిచిన చెన్నై, ఈసారి తన అదృష్టాన్ని మార్చుకోవాలని పట్టుదలతో ఉంది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ 43.4 కోట్ల రూపాయల భారీ పర్స్ విలువతో బరిలోకి దిగింది. జట్టులో ఉన్న తొమ్మిది ఖాళీలను భర్తీ చేసేందుకు ఫ్రాంచైజీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాత ఆటగాళ్లను వదిలేసి, యువ రక్తాన్ని జట్టులోకి ఆహ్వానించింది. ముఖ్యంగా దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ వంటి అనుభవజ్ఞులతో పాటు స్టార్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్లను కూడా జట్టు నుంచి తప్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
వేలం ద్వారా అఖీల్ హుస్సేన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, మాథ్యూ షార్ట్, రాహుల్ చాహర్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను సీఎస్కే సొంతం చేసుకుంది. ఇప్పుడు జట్టులో అనుభవజ్ఞులైన ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్ వంటి వారితో పాటు మెరుపులు మెరిపించే యువ ఆటగాళ్ల కలయిక కనిపిస్తోంది. ఈ సమతుల్యత జట్టుకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి మరి.
2026 సీజన్లో చెన్నైకి అతిపెద్ద బలం వారి బ్యాటింగ్ విభాగం. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా కొనసాగుతున్నారు. గత సీజన్లో గాయం కారణంగా ఆయన కొన్ని మ్యాచ్లకు దూరం కావడం జట్టుపై ప్రభావం చూపింది. కానీ ఈసారి సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి హిట్టర్ల చేరికతో బ్యాటింగ్ లైనప్ బలంగా మారింది. వెటరన్ ఫినిషర్ ఎంఎస్ ధోనీ ఉండనే ఉన్నాడు.
ఈసారి చెన్నై కొత్త ఓపెనింగ్ జోడీని ప్రయోగించనుంది. యువ సంచలనం ఆయుష్ మ్హాత్రేతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. వీరి తర్వాత రుతురాజ్ గైక్వాడ్, డెవాల్డ్ బ్రెవిస్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, శివమ్ దూబే, ధోనీ రానున్నారు. ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఏ బౌలింగ్ విభాగన్నైనా చెల్లాచెదురు చేసే సామర్థ్యం కలిగి ఉంది.
జట్టులో ప్రతిభ ఉన్నప్పటికీ, కీలక సమయాల్లో అనుభవం లేకపోవడం చెన్నైకి పెద్ద మైనస్. యువ ఆటగాళ్లు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారనేది ప్రశ్నార్థకం. బౌలింగ్ విభాగంలో ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించే స్టార్ బౌలర్ల కొరత కనిపిస్తోంది. ఖలీల్ అహ్మద్ భారత పేసర్లకు నాయకత్వం వహిస్తుండగా, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్, అన్షుల్ కంబోజ్ అతనికి సహకరించనున్నారు. విదేశీ కోటాలో నాథన్ ఎల్లిస్, మాట్ హెన్రీ వంటి వారు ఉన్నా, కీలక మ్యాచ్లలో వారి ప్రదర్శన ఎలా ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి.
2023లో చివరిసారి టైటిల్ గెలిచిన చెన్నై, మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటుకునేందుకు ఇది మంచి అవకాశం. 2025లో చాలా మంది యువ ఆటగాళ్లు లీగ్లో రాణించారు. అదే తరహాలో చెన్నైలోని కుర్రాళ్లు చెలరేగితే, ఆరో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడటం ధోనీ సేనకు కష్టమేమీ కాదు. యువ ఆటగాళ్లు క్లిక్ అయితే సీఎస్కే మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటుకుంటుంది.
జట్టులో అనుభవం లేని ఆటగాళ్లపై భారీగా పెట్టుబడి పెట్టడం ఒక రిస్క్ అని చెప్పాలి. ముఖ్యంగా ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మల కోసం ఫ్రాంచైజీ 14.2 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. వీరిద్దరూ భవిష్యత్ స్టార్లుగా పేరు తెచ్చుకున్నా, ఐపీఎల్ వంటి హై-ప్రెజర్ టోర్నీలో విఫలమైతే జట్టు ఆశలు దెబ్బతింటాయి. సీజన్ ఆరంభంలోనే వరుస ఓటములు ఎదురైతే, యువ ఆటగాళ్లు మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది.
మహేంద్ర సింగ్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, జేమీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్, అన్షుల్ కంబోజ్, అఖీల్ హుస్సేన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్, జాక్ ఫోల్క్స్.