
యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు ప్రదర్శన పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో వరుసగా రెండో టెస్టులోనూ పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం గాబ్బాలో జరిగిన డే నైట్ టెస్ట్లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ గెలుపుతో ఆసీస్ సిరీస్లో 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో కేవలం రెండు రోజుల్లోనే చిత్తుగా ఓడిపోయిన ఇంగ్లాండ్.. గబ్బాలోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. ఈ ఓటములతో ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఇంగ్లాండ్ జట్టు ఓటమికి ప్రధాన కారణం సరైన సన్నద్ధత లేకపోవడమేనని మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాషెస్ విజేత, మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖేల్ వాన్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. "సన్నద్ధత సరైన మార్గంలో జరగలేదు. పింక్ బాల్ (డే-నైట్ టెస్ట్ బాల్) తో తొలిసారి ఆడుతున్న కారణంగా ఆటగాళ్ళు పూర్తిగా షెల్షాక్ లో కనిపించారు" అని విమర్శించారు.
ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ సైతం బౌలర్లు తుప్పు పట్టి ఉన్నారనీ, వారి సన్నద్ధతలో లోపాలు స్పష్టంగా బయటపడ్డాయని పేర్కొన్నారు. డే నైట్ టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా 44 పరుగుల ఆధిక్యం సాధించినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంగ్లాండ్ సిరీస్కు ముందు కేవలం ఒకే ఒక వార్మప్ మ్యాచ్ ఆడింది. పెర్త్లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి తర్వాత, తొలి ఎంపిక ఆటగాళ్లను కాన్బెర్రాలో జరిగిన పింక్ బాల్ టూర్ మ్యాచ్లో ఆడించడానికి బదులుగా, వారు గబ్బాలో అదనపు నెట్ సెషన్లకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
ఈ నిర్ణయాన్ని కొందరు విశ్లేషకులు అమాయక, వింతగా అభివర్ణించారు. అయితే, మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. రాత్రి పూట నెట్ ప్రాక్టీస్తో సహా ఎక్కువ నెట్ ప్రాక్టీస్ చేయడం సమంజసమని, అలాగే కాన్బెర్రాతో పోలిస్తే బ్రిస్బేన్లో వేడి, తేమలో గణనీయమైన తేడా ఉందని 'ది టైమ్స్' లో రాశారు.
2010-2011 తర్వాత ఆస్ట్రేలియాలో తొలి యాషెస్ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఇంగ్లాండ్ జట్టు, నవంబర్ రెండో వారంలో మాత్రమే పూర్తి స్థాయిలో పెర్త్లో సమావేశమైంది. కొంతమంది ఆటగాళ్లు న్యూజిలాండ్లో 3-0తో ఓడిన వైట్ బాల్ సిరీస్ నుండి వచ్చారు. దీనికి విరుద్ధంగా, ఆస్ట్రేలియా జట్టు సభ్యులు దాదాపుగా అందరూ సన్నాహకంలో భాగంగా దేశీయ షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్లలో నిలకడగా ఆడుతూ ఫామ్ ను అందుకున్నారని పేర్కొన్నారు.
ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్లు ఆడకపోవడాన్ని ఇంగ్లాండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్ అహంకార చర్యగా అభివర్ణించారు. "చారిత్రకంగా, ఇక్కడకు వచ్చినప్పుడు వాతావరణానికి అలవాటు పడాలి" అని బోథమ్ పేర్కొన్నారు. అయితే, గబ్బాలో జరిగిన మ్యాచ్లో పరాజయం పాలైన తర్వాత, అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ ఈ విమర్శలను తోసిపుచ్చారు. “లేదు, నా వరకు అస్సలు కాదు” అని బీబీసీతో చెప్పారు.
"ప్రస్తుత రోజుల్లో క్రికెట్ ను చాలా కుదించారు. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కి వచ్చినప్పుడు ఇదే జరుగుతుంది, మేము ఇతర దేశాలకు వెళ్లినప్పుడు కూడా ఇదే చేస్తాం. ఇది అంతే, పెద్ద తేడా ఏమీ లేదు. మేము కోరుకున్న నాణ్యమైన క్రికెట్ ఆడకపోయినా, దానికి మా సన్నద్ధత కారణం కాదు" అని ట్రెస్కోథిక్ వివరణ ఇచ్చారు.
గబ్బాలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ అన్ని విభాగాల్లోనూ నిరాశపరిచింది. ఆస్ట్రేలియా 511 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో జో రూట్, జాక్ క్రాలీ మినహా, రెండవ ఇన్నింగ్స్లో కెప్టెన్ బెన్ స్టోక్స్, విల్ జాక్స్ మినహా మిగిలిన బ్యాట్స్మెన్లు తొందరపాటు షాట్లతో వికెట్లను కోల్పోయారు.
బౌలింగ్లోనూ పిచ్పై షార్ట్ పిచ్ బంతులు ఎక్కువగా విసిరి, కొత్త పింక్ బాల్ను వృథా చేశారు. ఫీల్డింగ్లోనూ ఐదు క్యాచ్లను జారవిడిచారు, ఇది ఆస్ట్రేలియా క్యాచ్లు పట్టిన తీరుకు పూర్తి విరుద్ధంగా ఉంది. రెండో ఇన్నింగ్స్లో స్టోక్స్ ను ఇంగ్లిస్ రనౌట్ చేయడం మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది.
ఇంగ్లాండ్ త్వరగా ఓటమిని అంగీకరిస్తుందని చాలా మంది భావించినా, స్టోక్స్, ఆల్రౌండర్ విల్ జాక్స్ పోరాటం చేశారు. ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ను ధీటుగా ఎదుర్కొని, డిఫెన్సివ్ పద్ధతిని అనుసరించారు. ఇద్దరూ మొదటి గంటలో కేవలం 28 పరుగులు మాత్రమే చేసి, నెమ్మదిగా స్కోరు పెంచారు.
అయితే, రెండవ సెషన్ డ్రింక్స్ బ్రేక్కు ముందు, జాక్స్ (36) మైఖేల్ నేసర్ బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే స్టోక్స్ (52) కూడా నేసర్ బౌలింగ్లోనే వికెట్ కీపర్ అలెక్స్ కారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నేసర్ కెరీర్-బెస్ట్ గణాంకాలు (5/42) నమోదు చేయగా, స్మిత్ 210 క్యాచ్లతో రాహుల్ ద్రావిడ్ రికార్డును సమం చేశాడు.
చివరికి, ఆస్ట్రేలియా 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించి, కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్క్వేర్ లెగ్ మీదుగా భారీ సిక్స్తో విజయాన్ని నమోదు చేశారు. ఐదు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో ఉంది. మిగిలిన టెస్టులు అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీలలో జరగనున్నాయి.