వైసీపీ స్ట్రాటజీని ముందే ఊహించిన పవన్!.. చిరంజీవి ట్రాప్‌లో పడ్డారా?

First Published Aug 9, 2023, 1:58 PM IST

మెగాసార్ట్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. చిరంజీవిపై వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. మరోవైపు జనసైనికులు, మెగా అభిమానులు కూడా వైసీపీ విమర్శలను తిప్పికొడుతున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతుంది. 

అయితే చాలా కాలంగా  రాజకీయపరమైన కామెంట్స్‌కు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు.. వైసీపీ ట్రాప్‌లో పడ్డారా? అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొద్ది రోజుల ముందుకు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అధికార వైసీపీ బ్రో సినిమాతో వివాదం సృష్టించి, ఆ ఉచ్చులోకి జనసేన శ్రేణులను లాగే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీకి డైవర్షన్ పొలిటిక్స్ మాములేనని మండిపడ్డారు.

అయితే వాల్తేరు వీరయ్య చిత్రం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు  చేసిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి? అనే కామెంట్ చేశారు. అభివృద్ది గురించి ఆలోచించాలనే సలహా కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు చిరంజీవి రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే వైసీపీ స్ట్రాటజీని పవన్ ముందుగానే ఊహించారని.. అయితే సినిమాల గురించి మాట్లాడే సమయంలో చిరంజీవి వైసీపీ ట్రాప్‌లో పడిపోయారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

మొత్తంగా ఏం జరిగిందంటే.. ఇటీవల సాయి తేజ్ హీరోగా, పవన్ కల్యాణ్ ముఖ్య పాత్రలో నటించిన బ్రో చిత్రంపై వివాదం  చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్యాంబాబు పాత్ర ద్వారా తనను అవమానించారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి  రాంబాబు మండిపడ్డారు. ఆ చిత్రం డిజాస్టర్ అంటూ కూడా సర్టిఫికేట్ ఇచ్చేశారు. అంతేకాకుండా ఆ చిత్రం నిర్మాత ద్వారా పవన్‌కు టీడీపీ ప్యాకేజ్ అందించిందని ఆరోపణలు చేయడమే కాకుండా.. సినిమా కలెక్షన్లు కూడా చెప్పేశారు. పవన్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. 

అయితే ఈ వివాదంపై పరోక్షంగా స్పందించిన పవన్.. ‘‘జనసైనికులు డిబేట్ స్థాయిని పెంచాలి. వాళ్ల (వైసీపీ) స్థాయికి దిగజారొద్దు.. వాళ్లు ఎన్ని కథలు చెప్పినా.. పాయింట్‌ మీదకు తీసుకురావాలి. వాళ్లు చెప్పే మాటలకు డైవర్ట్ కావొద్దు. సినిమా అనేది పార్టీని నడపడానికి ఇంధనం. ఆ ఇంధనాన్ని ప్రజలను అభివృద్ది చేయడానికి వాడుతున్నాను.  బ్రో సినిమాలో నటించాను, డబ్ చేశాను, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన తర్వాత వదిలేశాను. వైసీపీ నాయకులు మాత్రం ఇంకా వదల్లేదు. జనసేన నేతలు ఆ ఉచ్చులో పడొద్దు’’ అని సూచించారు.

Pawan Kalyan

‘‘సినిమాను రాజకీయాల్లోకి తీసుకురావొద్దు. అభిమానులు చేస్తే పర్లేదు గానీ నాయకులు అలా మాట్లాడకూడదు. వాళ్లు బ్రో సినిమా గురించి ఆరోపణలు చేస్తే, మీరు అసలైన సమస్యలపై వాళ్లను నిలదీయండి’’ అని జనసేన నాయకులకు పవన్  పిలుపునిచ్చారు. 

అయితే అంబటి రాంబాబు వ్యాఖ్యలపై చిరంజీవి పరోక్షంగా స్పందించారు. వాల్తేరు వీరయ్య చిత్రం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు  చేసిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఎంతసేపు చిత్ర పరిశ్రమ గురించి కాదని.. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు గురించి, పేదవారికి కడుపు నిండే పథకాలు, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి పెద్ద పెద్ద వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?’’ అని వైసీపీ ప్రభుత్వానికి చిరంజీవి సుత్తిమెత్తగా చురకలు అంటించారు. దీంతో చిరంజీవి.. పవన్‌కు సపోర్టుగా నిలిచినట్టు అయింది. 
 

దీంతో ఇంతకాలం  చిరంజీవి సాఫ్ట్ కార్నర్ చూపించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఆయనపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. మరోవైపు జనసేన నేతలు కూడా చిరంజీవికి మద్దతుగా నిలుస్తున్నారు. వైసీపీ నేతల విమర్శలను తిప్పికొడుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రోడ్లను బాగు చేయాలని, గతంలో చెప్పినట్టుగా ప్రత్యేక హోదా సాధించాలని వైసీపీపై కౌంటర్ అటాక్‌కు దిగుతున్నారు. ఇక, టీడీపీలోని పలువురు కాపు నేతలు చిరంజీవికి మద్దతుగా నిలుస్తూ.. వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో చిరు వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. ఈ క్రమంలోనే వైసీపీ స్ట్రాటజీని పవన్ ముందే ఊహించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

click me!