ఈ కార్డులో తిరుపతి వెంకటేశ్వర స్వామి రెండు రూపాల్లో దర్శనమిస్తారు. కార్డు వెనుక భాగంలో తిరుపతి వెంకన్న భారీ చిత్రం ఉండగా, పైన సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నట్లుగా రూపొందించారు. కార్డు అంచుల వెంబడి ఏనుగులు, గుర్రాలు, నెమళ్లు వంటి జంతువుల బొమ్మలతో పాటు, 40 ఏనుగు ముఖాలను అద్భుతంగా చెక్కారు. ద్వారపాలకులు, చామరలు వీస్తున్న సేవకులు, శంఖం, డప్పులు వాయిస్తున్న దేవతామూర్తుల చిత్రాలు ఈ పత్రికకు మరింత శోభను తెచ్చాయి. రాముని దర్బార్, శివ కల్యాణం, తిరుపతి ఆలయ ద్వారాలు, రాధాకృష్ణులు, శేషనాగుపై పవళించిన విష్ణుమూర్తి వంటి పౌరాణిక ఘట్టాలను కూడా ఇందులో చూడవచ్చు.
వధువరుల వివరాలు.. తండ్రి ఏం చెప్పరంటే?
ఈ దేవతామూర్తుల నడుమ వధువు శ్రుతి జోహ్రి, వరుడు హర్ష్ సోని పేర్లను చెక్కారు. వారి పేర్ల చుట్టూ ఏనుగులు పూల వర్షం కురిపిస్తున్నట్లుగా డిజైన్ చేశారు. కార్డు లోపల వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పేర్లను చెక్కారు.
శివ్ జోహ్రి మాట్లాడుతూ, "నా కూతురి పెళ్లికి బంధువులను మాత్రమే కాదు, సకల దేవతలను కూడా ఆహ్వానించాలన్నదే నా కోరిక. ఆరు నెలల పాటు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నా బిడ్డకు తరతరాలు గుర్తుండిపోయేలా, భవిష్యత్ తరాలు చూసి గర్వపడేలా ఏదైనా ఇవ్వాలనుకున్నాను. అందుకే స్వయంగా ఏడాది పాటు కష్టపడి దీనిని తయారు చేశాను" అని భావోద్వేగంతో తెలిపారు. ఈ వెండి శుభలేఖను వరుడి కుటుంబానికి లాంఛనంగా అందజేయనున్నారు.