బ్యూటీపార్లర్ కని వెళ్లి వధువు జంప్.. మండపంలోని వరుడికి బిగ్ షాక్...ఎక్కడంటే...

First Published Jun 1, 2023, 9:46 AM IST

పెళ్లికి ముస్తాబై వస్తానని వెళ్లిన వధువు కనిపించకుండా పోయిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. దీంతో వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. 
 

మధ్యప్రదేశ్ : నేటి తరంలో కూడా తల్లిదండ్రుల నిర్ణయానికి తలొంచి బలవంతంగా  పెళ్లిళ్లు చేసుకుంటున్నవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. మొదట పెళ్లికి ఒప్పుకొని.. చివరికి  వచ్చేసరికి.. ఆ పెళ్లి ఇష్టం లేక.. తీరా పెళ్లి సమయానికి పారిపోతున్న వధూవరుల సంఖ్య  పెరిగిపోతుంది. ఇదివరకటి  కాలంలా.. పరువు పోతుందనో.. పెళ్లి పీటల వరకు వచ్చిన తర్వాత ఆగిపోతే మళ్ళీ పెళ్లి కాదనో భయపడడం లేదు. అయితే, ఇదే ధైర్యం పెళ్లికి  అంగీకారం తెలిపే ముందుగానీ..పెళ్లి చూపుల సమయంలో కానీ చేయలేకపోతున్నారు. దీంతో ఇరువర్గాలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. అలాంటి ఓ  షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది.

పెళ్లికి కొన్ని గంటలు ఉండగా ఓ వధువు బ్యూటీ పార్లర్ కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. గంటలు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో బంధువులు ఆమెను తీసుకురావడానికి వెళ్లారు. అక్కడ వారికి వధువు కనిపించకపోగా.. షాకింగ్ విషయం తెలిసింది. ఇంతకీ ఏం జరిగిందంటే… రాజస్థాన్లోని భారీ ప్రాంతానికి చెందిన శిల్పి అనే యువతికి మధ్యప్రదేశ్ లోని కొత్వాలి పరిధి మోరెనా ప్రాంతానికి చెందిన యోగేష్ వర్మ అనే యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు.

ఇరు కుటుంబాలు మాట్లాడుకుని అన్ని విషయాల్లో అంగీకారానికి వచ్చిన తర్వాత ఈ పెళ్లిని కుదిరించారు. మే 29వ తారీఖున యోగేష్, శిల్పి వివాహం జరగాలని ముహూర్తం ఫిక్స్ చేశారు. సమయం ఎక్కువగా లేకపోవడంతో పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. ఇరు కుటుంబాలు కళ్యాణం జరగాల్సిన మే 29న పెళ్లి మండపానికి చేరుకున్నారు.  మండపమంతా బంధువులు, స్నేహితులతో  కళకళలాడుతోంది. వరుడు కూడా పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్నాడు.

వివాహ తంతు మొదలయ్యింది. వధువును తీసుకురమ్మని చెప్పారు. కానీ,  బ్యూటీ పార్లర్ కని వెళ్ళిన వధువు జాడలేదు. ముహూర్తానికి కొద్ది గంటల ముందు బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది శిల్పి.పెళ్లికి మేకప్ వేయించుకుని వస్తానని వెళ్లిన శిల్పి ఎంతకీ తిరిగి రాలేదు. వచ్చేస్తుందిలే అని కాసేపటి వరకు ఓపికగా ఎదురు చూశారు. కానీ నిమిషాలు గంటలుగా మారి గడిచిపోతున్నాయి కానీ శిల్పి జాడలేదు.

దీంతో వధువు తరపు బంధువులు  బ్యూటీ పార్లర్ కు వెళ్లారు. అయితే అక్కడ వధువు లేదు. అసలు ఆమె అక్కడికి రాలేదని అక్కడివారు చెప్పారు. దీంతో షాక్ అయిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా కూడా ఆమె ఆచూకీ లభించలేదు. వధువు కనిపించడం లేదని.. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందన్న విషయం తెలిసిన వరుడు, అతని కుటుంబ సభ్యులు..పెళ్లికి వచ్చిన వారందరూ ఒకసారిగా షాక్ అయ్యారు.

ఈ విషయం తెలియడంతో పెళ్లికి వచ్చిన వారంతా వెళ్ళిపోయారు.  దీన్ని అవమానంగా భావించిన వరుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు యువతి 150 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా తీసుకెళ్లిందని ఫిర్యాదులు పేర్కొన్నారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్లి ఉంటుందనేది  మిస్టరీగా మారింది..  పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పెళ్లి పందిరిలో కనిపించాల్సిన వధువు కనిపించకుండా పోవడంతో ఈ ఘటన మధ్యప్రదేశ్లో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. 
 

click me!