
తిరువీర్ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. కామెడీ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన `పాపం ప్రతాప్` అనే మూవీలో నటించాడు. ఎస్ పీ దుర్గా నరేష్ దర్శకత్వం వహించారు. తిరువీర్కి జోడీగా పాయల్ రాధాకృష్ణ నటించింది. రాశి, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, దేవి ప్రసాద్, గోపరాజు రమణ, ప్రసాద్ బెహరా వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈటీవీ విన్, కృషి ఎంటర్టైన్మెంట్ పతాకాలపై రుద్ర దేవ్ మదిరెడ్డి, రాకేష్ రెడ్డి గడ్డం నిర్మించారు. నేడు శుక్రవారం(ఏప్రిల్ 17)న ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా నవ్వులు పూయించిందా? ఆడియెన్స్ ని అలరించడంలో సక్సెస్ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
ప్రతాప్(తిరువీర్).. చిన్నప్పట్నుంచి బుజ్జమ్మ(పాయల్ రాధాకృష్ణ)ని ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి నాన్న వీరయ్య(అజయ్ ఘోష్)కి ఇష్టంలేదు. అమ్మ లక్ష్మి(రాశి) అన్నీ తానై పెళ్లి చేస్తుంది. మ్యారేజ్ గ్రాండ్గా జరుగుతుంది. ఫస్ట్ నైట్ కూడా మూడు రోజులు బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ మూడో రోజే బుజ్జమ్మ పంచాయితీ పెడుతుంది. ఆయనతో కలిసి ఉండలేనని, రాత్రిళ్లు దారుణంగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి పుట్టింటికి వెళ్లిపోతుంది. మూడో రోజే భార్య వెళ్లిపోవడంతో ఊర్లో అంతా రకరకాలుగా మాట్లాడుకుంటారు. ప్రతాప్ కి మ్యాటర్ లేదని, గే అని రకరకాలుగా చర్చ నడుస్తుంది. ఊరంతా గబ్బు గబ్బు అవుతుంది. అయితే తాను రాత్రిళ్లు ఏం చేస్తున్నాడో చెప్పదు బుజ్జమ్మ. తనపై ప్రేమ ఉంటే నీ సమస్య ఏంటో తెలుసుకుని, దాన్ని సెట్ చేసుకున్నాక తన వద్దకు రావాలని చెబుతుంది. మరి ప్రతాప్ కి ఉన్న సమస్య ఏంటి? దాన్ని ఎలా పరిష్కరించుకున్నాడు? మళ్లీ బుజ్జమ్మతో కలిసిపోయాడా? ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది మిగిలిన సినిమా.
యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. రాత్రిళ్లు ఒక వ్యక్తి చేసే విచిత్రమైన ప్రవర్తన ఆధారంగా తెరకెక్కింది. దాని వల్ల హీరో ఎలాంటి సమస్యలు ఫేస్ చేశాడు? తన భార్య ఎలాంటి ఎంతటి నరకం అనుభవించింది, ఆ సమస్య ఆయన ఫ్యామిలీని ఎంతగా ఇబ్బంది పెట్టిందనేది కామెడీ కోణంలో రూపొందించారు. అయితే కామెడీ పండలేదు కదా, చిరాకు తెప్పించింది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు గోల గోలగా, అరుపులు, కేకలు అన్నట్టుగానే సాగుతుంది. హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ సీన్లు కొన్ని ఫర్వాలేదు. అదే సమయంలో హీరోకి ఉన్న సమస్యపై ఊర్లో వారంతా మాట్లాడుకునే తీరు కొంత కామెడీగా ఉంటుంది. దీనికితోడు గోపరాజు రమణ షకీలాపై మనసు పడటం, ఆమె సినిమాలు చూసేందుకు థియేటర్ వద్ద గోల చేయడం, థియేటర్లో సీన్లు కొంత వరకు ఫన్నీగా ఉంటాయి. అవి తప్ప ఇందులో నవ్వుకోవడానికి ఏం లేదు సరికదా, పెద్ద టార్చర్గా సాగుతుంది. ఒక్క సీన్కి మించి మరో సీన్ చిరాకు తెప్పిస్తాయి. అజయ్ ఘోష్, గోపరాజు రమణ తిట్టుకునే సీన్లు ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. ఆర్టిస్ట్ ల ఓవర్ పర్ఫెర్మెన్స్, లౌడ్గా రియాక్ట్ అయిన తీరు కామెడీని పండించడంలో విఫలమయ్యాయి. తిరువీర్ యాక్టింగ్లోని ఇన్నోసెంట్ కూడా నవ్వులు పూయించలేకపోయాయి. ప్రతి సీన్ ఓవర్గా అనిపిస్తాయి. ఫస్టాఫ్ దారుణం అంటే, దాన్ని మించి సెకండాఫ్ ఉంది. సీన్లు, ఆర్టిస్ట్ లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతిదీ సినిమాకి మైనస్గానే మారాయి. ఏదైనా ఇందులో ఆకట్టుకునే అంశం ఉందంటే ఇది రియల్ లైఫ్ స్టోరీ అని లాస్ట్ లో చెప్పడం, క్లైమాక్స్ లో వచ్చే చిన్న ఎమోషనల్ సీన్, అది తప్పితే మూవీ మొత్తం ఔట్ ఆఫ్ ది కంట్రోల్లో సాగిందని చెప్పొచ్చు.
ప్రతాప్గా తిరువీర్ నటన ఆకట్టుకుంటుంది. చాలా నేచురల్గా బాగా నటించాడు. ఆయన తండ్రిగా అజయ్ ఘోష్ మెప్పించాడు, కానీ ఓవర్గా అనిపిస్తుంది. అలాగే రాశి పాత్ర సెటిల్గా ఉండి, ఆకట్టుకుంది. దేవిశ్రీప్రసాద్ ఫర్వాలేదు. ఆయన భార్యగా రూప లక్ష్మి మెప్పించింది. ప్రసాద్ బెహరా పాత్ర కూడా నవ్వించలేకపోయింది. మిగిలిన నటీనటులు మెప్పించారు, కానీ ఆయా పాత్రలు ఆడియెన్స్ కి టార్చర్గానే అనిపిస్తాయి.
దర్శకుడు ఎస్పీ దుర్గా నరేష్ ఎంచుకున్న పాయింట్ బాగానే ఉంది. కొత్తగా ఉంది. కానీ దాన్ని అంతే కామెడీగా, ఎమోషనల్గా తెరకెక్కించడంలో సక్సెస్ కాలేకపోయారు. దీంతో సినిమా మొత్తం మిస్ ఫైర్ అయ్యింది. కేఎం రాధాకృష్ణ మ్యూజిక్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బీజీఎం ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించేలా సాగింది. ఎడిటింగ్ పరంగా మూవీని ఇంకా కట్ చేయాల్సింది. రెండున్నర గంటల సినిమా థియేటర్లో చూస్తే నాలుగైదు గంటలు చూసినంతగా అనిపించింది. నిర్మాణ విలువలకు కొదవలేదు.
పాపం ఆడియెన్స్. రెండున్నర గంటలు చుక్కలు.
రేటింగ్ 1.75