
టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా, పృథ్వీరాజ్ సుకుమార్ గెస్ట్ రోల్ చేసిన మూవీ `పళ్లిచట్టంబి`. దీనికి డిజో జోస్ ఆంటోని దర్శకత్వం వహించారు. వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మెఘ శ్యామ్ అసోసియేట్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. మలయాళంలో బుధవారం(ఏప్రిల్ 15)న విడుదలైన ఈ మూవీకి అక్కడ పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా నేడు శుక్రవారం(ఏప్రిల్ 17న) తెలుగులో విడుదల చేశారు. మరి ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
1957 కేరళా బ్యాక్ డ్రాప్లో సాగే చిత్రమిది. అక్కడ కనియార్ ప్రాంతంపై నంబియార్ కన్నుపడుతుంది. అది తన పూర్వీకుల నుంచి వచ్చిన భూమి. కానీ స్థానిక కమ్యూనిస్టులు, క్రిస్టియన్స్ అక్కడ పాగా వేస్తారు. అయితే కనియార్లో క్రిస్టియన్లకి, కమ్యూనిస్టులకు పడదు. తమ చర్చ్ ని కమ్యూనిస్టులు ఆక్రమించే ప్రమాదం ఉంది. దీంతో తమ చర్చ్ ని కాపాడటానికి ఒక క్రిస్టోఫర్ అవసరం ఉంటుంది. అందుకు ఒక పళ్లిచట్టంబి కావాలి. వేరే ఊరు అయిన క్రిష్ణ పిళ్లై(టొవినో థామస్) అక్కడికి క్రిస్టోఫర్గా వస్తాడు. చర్చ్ కి రక్షణగా ఉంటాడు. కమ్యూనిస్టులను ఎదుర్కొంటాడు. ఆ సమయంలో అక్కడ కమ్యూనిస్టుల్లో ఊపును తీసుకొచ్చి వారిని కమ్యూనిస్టులుగా మార్చే నాటకాన్ని ప్రదర్శిస్తుంటారు. అందులో రెబెక్కా(కయాదు లోహర్) అంటే అందరికి క్రేజ్. ఆమె నాటకం వేస్తే జనం కళ్లు తిప్పుకోకుండా చూస్తుంటారు. ఆమెని ఓ అఘాయిత్యం నుంచి క్రిస్టోఫర్ కాపాడతాడు. దీంతో ఆయన్ని చూసి ఫిదా అవుతుంది. ఇష్టపడుతుంది. అలాగే అక్కడ ప్రదర్శించిన నాటకం చూసి క్రిస్టోఫర్ ఫిదా అవుతాడు. ఆ నాటకం చూస్తుంటే, తన బాల్యం గుర్తొస్తుంది. తన అక్కకి, పేరెంట్స్ కి, తన ఊరుకి జరిగిన అన్యాయం గుర్తొస్తుంది. వాస్తవాలేంటో తెలుసుకుంటాడు. అయితే కమ్యూనిస్ట్ లు ప్రదర్శించిన నాటకాన్ని చూడ్డానికి వెళ్లినందుకు క్రిస్టోఫర్ని చర్చ్ నుంచి వెలేస్తారు. అక్కడ అవమానిస్తారు. దీంతో తిరిగి తన ఊరువెళ్తాడు. వెళ్లే క్రమంలో రెబెక్కాని కలిసి ప్రేమగీతాలు పాడుకుంటారు. అయితే అక్కడికి అనుకోకుండా ఓ సునామీ వస్తుంది. అదే రామన్(శత్రు). మోస్ట్ డేంజర్ పోలీస్ అధికారి. ఆయన వచ్చాడంటే అక్కడ అల్లకల్లోలమే. కనియార్పై నంబియార్(పృథ్వీరాజ్ సుకుమారన్) కన్నుపడుతుంది. అక్కడ గుట్టని తవ్వే ప్రాజెక్ట్ ని కేరళా కమ్యూనిస్ట్ ప్రభుత్వం రిజెక్ట్ చేస్తుంది. దీంతో ప్రభుత్వాన్నే కూల్చే ప్రయత్నం చేస్తుంటాడు. కనియార్లోని ఊర్లకు ఊర్లు లేకుండా చేసే కుట్ర జరుగుతుంది. దాన్ని అక్కడి ప్రజలు ఎలా ఎదుర్కొన్నారు? క్రిస్టోఫర్ ఆ ప్రాంతం కోసం ఎలా తిరగబడ్డాడు? అక్కడి ప్రజల్లో ఆయన తెచ్చిన మార్పేంటి? ఇంతకి నంబియార్ అసలు కుట్ర ఏంటి? క్రిస్టోఫర్ గతం ఏంటి? అనేది మిగిలిన కథ.
ఇది 1957 కేరళాలో చోటు చేసుకున్న యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. సినిమా కథా నేపథ్యంలో కేరళా రాష్ట్రం, అక్కడి ప్రాంతానిది కావడంతో తెలుగు ఆడియెన్స్ పెద్దగా కనెక్ట్ కాదని చెప్పొచ్చు. ప్రారంభంలో కమ్యూనిస్టులు, క్రిస్టియన్లకి మధ్య వచ్చే సన్నివేశాలు, గొడవలు పెద్దగా ఆకట్టుకోవు, కథని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైమ్ తీసుకున్నట్టుగా ఉంటుంది. ప్రారంభంలో సీన్లు సరదాగా సాగిపోతాయి. రెండు వర్గాల గొడవలు, యాక్షన్ సీన్లు కొంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అయితే కయాదు లోహర్ ఎంట్రీ తర్వాత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఆమెని చూసి హీరో ఫిదా అవ్వడం, తనని కాపాడటంలో ఆమె పడిపోవడం, ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. కమ్యూనిస్టుల నాటకానికి వెళ్లాడని చెప్పి హీరోని చర్చ్ నుంచి వెళ్లిపోవాలని చెప్పడంతో కథ సీరియస్గా మారుతుంది. ఎమోషనల్ సైడ్ వెళ్తుంది. నాటకం కూడా హీరోలోని గతాన్ని గుర్తు చేస్తూ కదిలిస్తుంది. ఆ తర్వాత పోలీస్ అధికారి రామన్ ఎంట్రీతో అల్లకల్లోలంగా మారుతుంది. కనియార్ ప్రాంతం ప్రజలను చంపేసే కుట్రకి తెరలేపుతుండటం, దాని వెనకాల నంబియార్ ఉన్నాడని, ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఏం చేయలేని స్థితిలో ఉండటంతో ఎమోషనల్గా ఉత్కంఠకి గురి చేస్తుంది. హీటెక్కించే మూమెంట్తో ఇంటర్వెల్ పడుతుంది. సెకండాఫ్ లో మరింత ఎమోషనల్గా ఉంటుంది. మతాలు, పార్టీలకు అతీతంగా జనమంతా ఒక్కటై, తమ భూమిని కాపాడుకునేందుకు, పోలీసులపై తిరుగుబాటు చేసేందుకు సమాయత్తం కావడం వంటి సీన్లు ఎంగేజ్ చేస్తాయి. హీరో అందరిని ఏకం చేసే సీన్లు గూస్ బమ్స్ తెప్పిస్తాయి. ఆయా సీన్లు కేజీఎఫ్, కాంతార చిత్రాలను తలపిస్తుంది. యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. అందులో బీజీఎం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుంది. సెకండాఫ్ సినిమాకి పెద్ద ఆయువు పట్టుగా చెప్పొచ్చు. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ సీన్లు వాహ్ అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా అంతే వాహ్ ఫ్యాక్టర్తో ముగుస్తుంది. అయితే మూవీ ఫస్టాఫ్ తెలుగు ఆడియెన్స్ కి పెద్దగా కనెక్ట్ కాదు, కొంత స్లోగా సాగడం కూడా మైనస్గా చెప్పొచ్చు. సెకండాఫ్ యూనివర్సల్ కంటెంట్గా ఉంటుంది. పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రని ఇప్పటి వరకు రివీల్ చేయకపోవడం కొంత మైనస్గా చెప్పొచ్చు.
కృష్ణ పిళ్లై అలియాస్ క్రిస్టోఫర్గా టొవినో థామస్ అదరగొట్టాడు. ఆయన నటన కట్టిపడేస్తుంది. ఎక్కడా హీరో అనేలా కాకుండా అందరిలో ఒకరిలా కనిపిస్తూ హీరోయిజం పలికించిన తీరు బాగుంది. చాలా నేచురల్గా ఉంది. యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు. అదే సమయంలో ఎమోషనల్ సీన్లలోనూ కన్నీళ్లు పెట్టించారు. రెబెక్కా పాత్రలో కయాదు లోహర్ కాసేపు మెరిసింది. ఉన్నంతసేపు అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఆమె పాత్ర ముగింపు బాధ కలిగిస్తుంది. పోలీస్ అధికారిగా శత్రు ఎంట్రీ అదిరిపోయింది. కాకపోతే ఆ తర్వాత ఆ స్థాయిలో ఆయన పాత్రని డిజైన్ చేయలేదు. ఇక నంబియార్గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీ పూనకాలు తెప్పిస్తుందని చెప్పొచ్చు. కనిపించింది కాసేపే అయినా అదరగొట్టారు. ఇక మిగిలిన పాత్రలు ఉన్నంతలో మెప్పించాయి.
సినిమాకి టిజో టోమి కెమెరామెన్గా వర్క్ చేశారు. విజువల్స్ చాలా బ్యూటీఫుల్గా, కనువిందుగా ఉన్నాయి. కేరళా నేచురల్ అందాలను బాగా చూపించారు. శ్రీజిత్ సరంగ్ ఎడిటింగ్ ఫర్వాలేదు. ఫస్టాఫ్లో కొంత వర్క్ చేయాల్సింది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ సినిమాకి పెద్ద అసెట్గా నిలిచింది. బీజీఎం ఇరగదీశాడు. అదే సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుంది. నిర్మాణ విలువలకు కొదవలేదు. చాలా రిచ్గా, భారీ స్థాయిలో తెరకెక్కించారు. తెలుగు నిర్మాతలు తమ ప్యాషన్ని నిరూపించుకున్నారు. దర్శకుడు డిజో జోస్ ఆంటోని ఎంచుకున్న కథ మన తెలుగు వారికి పెద్దగా కనెక్ట్ కాలేకపోయినా, కేరళా వారికి బాగా నచ్చుతుంది. అయితే సెకండాఫ్ని యూనివర్సల్గా మార్చిన తీరు బాగుంది. భూమి కోసం పోరాటం ఎక్కడైనా ఒకే ఎమోషన్. అదే ఆకట్టుకుంటుంది. దాన్ని అంతే బాగా రూపొందించారు. సెకండాఫ్ని బాగా డీల్ చేశాడు. అయితే ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. మన వారికి పెద్దగా కొత్తగా అనిపించదు. ఎమోషనల్గా ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది.
భూమి కోసం పోరాటం ఎక్కడైనా ఒక్కటే. యాక్షన్, ఎమోషనల్గా ఆకట్టుకునే మూవీ పళ్లిచట్టంబి.
రేటింగ్: 2.75