
దర్శకరత్న దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరావు కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ అక్కినేని కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమా మేఘసందేశం. అక్కినేని 200 సినిమాగా తెరకెక్కిన మేఘసందేశం దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నిజానికి ఏఎన్నార్ కు వీరాభిమాని దాసరి నారాయణరావు. ఆయనతో చేసే ప్రతీ సినిమా అద్భుతంగా ఉండాలని కోరుకునేవారు. ఆ క్రమంలోనే వీరిద్దిర కాంబోలో ఆణిముత్యాల్లాంటి సినిమాలు బయటకు వచ్చాయి.
ఏడంతస్తుల మేడ, బహుదూరపు బాటసారి, శ్రీవారిముచ్చట్లు, ప్రేమాభిషేకం, బంగారు కుటుంబం లాంటి సినిమాలు వచ్చాయి. ఇక ఇందులో ప్రేమాభిషేకం క్రియేట్ చేసిన రికార్డులు గురించి అందరికి తెలిసిందే. ఆ సినిమా తరువాత వీరి కలయికలో వచ్చిన అద్భుత చిత్రం మేఘసందేశం. 1982 లో రిలీజ్ అయిన కళాత్మక చిత్రం మేఘసందేశం . ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ, జగ్గయ్య లాంటి ప్రముఖలు ముఖ్య పాత్రల్లో నటించారు.
రవీంద్రబాబు( ఎన్నార్) ప్రముఖ కవి. ప్రకృతిని చూస్తే.. పరవశించిపోయి కవితలు రాస్తుంటాడు. కళల పట్ల ఆరాధనా భావం కలవాడు. ఈయన పార్వతి(జయసుధ) అనే సాధారణ యువతిని వివాహం చేసుకుంటాడు. పార్వతి సోదరుడైన జగన్నాథం( జగ్గయ్య)కి తన చెల్లెలంటే ప్రాణం. రవీంద్రబాబు పార్వతిని తన భార్యగా అభిమానించినా.. వారి మనసులు మాత్రం కలవవు. ఏదో అసంతృప్తితో ఉంటాడు. వీరికి ఒక పాప. రవీంద్రబాబుకు ఊళ్ళో మంచి పేరు ఉంటుంది. ఆయన మాటకు అందరు విలువిచ్చేవారు. ఎవరైనా తప్పు చేస్తే.. ఊరుకునేవారు కాదు.
అప్పుడే వీరి గ్రామానికి కళావంతుల కుటుంబం వచ్చి స్థిరపడుతుంది. ఏటి ఒడ్డున ఉన్నవారు డ్యాన్స్ తో అందరిని ఆకర్శిస్తారు. వారిలో పద్మ( జయప్రద) డ్యాన్స్ కు అందరు ఫిదా అవుతారు. ఊరంతా మగవారు అక్కడికి వెళ్తున్నారని తెలిసి.. రవీంద్రబాబు వారిని మందలించి.. పంపిస్తాడు. కానీ పద్మ నృత్య కౌశలం, ఆమె పలికించే భావాలు, ఆహార్యం చూసి రవీంద్రబాబు కూడా ఆమె కళకి ప్రేమలో పడిపోతాడు. ఆయనలోని కవికి మంచి ప్రేరణ దొరికినట్టు భావిస్తాడు.
దాంతో అతను పద్మను ఆరాధించడం మొదలుపెడతాడు. తన భర్త వేశ్యావృత్తికి చెందిన పద్మతో పరిచయం తెలుసుకున్న పార్వతి బాధపడుతుంది. అన్న జగన్నాథంకి విషయం చెపుతుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పద్మతో తన చెల్లెలు కుటుంబం జోలికి రావద్దని హెచ్చరిస్తాడు. దాంతో పద్మ ఆ ఊరు వదిలి వెళ్తిపోతుంది. రవీంద్రబాబు తీవ్రంగా బాధపడతాడు... పద్మ ఆలోచనల్లోనే కాలం గడుపుతూ ఆమెను వెతుకుతూ.. బయట తిరుగుతుంటాడు. కుటుంబాన్ని వదిలేస్తాడు.
చివరికి తన కూతురు పెళ్లీడుకు వస్తుంది. తండ్రి కావాలని కూతురు అడగడంతో.. జగన్నాథం కూతురు పెళ్లికి రమ్మని రవీంద్ర బాబును అడుగుతాడు. తను వస్తే తన కూతురికి పరువు తక్కువ అవుతుందని రానంటాడు.. చివరకు భార్య వచ్చి పిలవడంతో కూతురు పెళ్లికి వస్తాడు. తన భార్యను క్షమాపణ అడిగి... ఆమె చేతుల్లో మరణిస్తాడు హీరో.. మరో వైపు పద్మ కూడా మరణిస్తుంది.
మేఘనందేశం లాంటి సినిమా చేసి నిజంగా దాసరి సాహసం చేశాడని చెప్పవచ్చు. ఎందుకంటే.. మనది గ్లామర్ ఇండస్ట్రీ.. హీరో అందంగా ఉండాలి, ఫైట్లు చేయాలి. హీరోయిజం చూపించాలి. తమ అభిమాన నటుడిని డీగ్లమార్ గా చూడటానికి ఇష్టపడరు. అటువంటిది.. ఏఎన్నార్ లాంటి కమర్షియల్ హీరోను క్లైమాక్స్ లో చంపేయడం. హీరోతో పాటు హీరోయిన్ ను కూడా చంపేయడం చాలా పెద్ద విషయం. దాసరి ప్రతిభకు.. ఏఎన్నార్ నటనకు ఈ సినిమా పరాకాష్టగా నిలిచింది. జయసుధను సహజనటి అని ఎందుకు అంటారో ఈ సినిమా చూస్తే చాలు అర్ధమౌతుంది. ఇక జయప్రద అందం, డ్యాన్స్ ఈసినిమాకు తారా స్థాయికి తీసుకెళ్లింది.
ఈ సినిమాకు ఏఎన్నార్, జయసుధ, జయప్రద నటన తో పాటు.. పాటలు ప్రాణం పోశాయి. సంగీత ప్రియుల మనసులు పిండేశాయి. మేఘసందేశంలో ప్రతీ పాట ఒక ఆణిముత్యమే.. రమేష్ నాయుడు స్వరపరిచిన పాటలన్నీ అద్భుతం చేశాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పి. సుశీల, కె. జె. ఏసుదాసు, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గాత్రం ఇప్పటికీ శ్రోతల చెవులలో అమృతం కురిపిస్తూనే ఉన్నాయి. ఆకులో ఆకునై.. ఆకాశ దేశాన, పాడనా...వాణి కళ్యాణిగా, నిన్నటి దాకా శిలనైనా లాంటి పాటలు అద్భుతం చేశాయి. సినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ కొట్టేశాయి.
మేఘసందేశం సినిమా ఎంతలా ప్రభావం చూపించిందంటే.. ఈసినిమాకు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని విభాగాల్లో నాలుగు జాతీయ పురస్కారాలు అందుకుంది. రాష్ట్ర స్థాయిలో బంగారు నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని కూడా మేఘసందేశం సినిమా అందుకుంది. ఉత్తమ గాయుడిగా ఏసుదాసు, ఉత్తమ గాయనిగా సుశీలమ్మ, ఉత్తమ సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడు నేషనల్ అవార్డును సాధించారు.
ఇక మేఘసందేశం సినిమా 82 లో రిలీజ్ అయితే.. 83 లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.. ఇక ఈసినిమా నుంచే ఉత్తమ హీరో క్యాటగిరీలో బంగారు నంది అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మేఘసందేశం సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు, ఉత్తమ నటిగా జయసుధు, ఉత్తమ గాయుడిగా ఏసుదాసు, ఉత్తమ గాయనిగా సుశీల, ఉత్తమ సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడు, ఉత్తమ గేయ రచయితగా దేవులపల్లి, ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా స్వామినాథన్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా సెల్వరాజ్.. బంగారు నందులను అందుకున్నారు.
మేఘసందేశం సినిమా అద్భుత కావ్యంగా నిలిచిపోయింది. కవులు కళాకారుల మనసు దోచిన సినిమా.. సామాన్య ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. అవార్డు పంట పండినా..ఆడియన్స్ రివార్డులను మాత్రం పొందలేకపోయింది. కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు మేఘసందేశం.. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఆర్ట్ మూవీగామిగిలిపోయింది.
కానీ ఈసినిమాకు ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ ఈసినిమా టీవీలో వచ్చిందంటే కదలకుండా చూసే అభిమానలు ఉన్నారు. ఇక మేఘసందేశం పాటలకు కరిగిపోయే శ్రోతల సంఖ్య కూడా ఎక్కువే. ఇక ఈసినిమాను చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.