
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా చిరంజీవి సినిమాలే కనిపిస్తుంటాయి. మాస్ డైలాగ్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్కు సరికొత్త నిర్వచనం చెప్పిన ఆల్టైమ్ క్లాసిక్ సినిమాల్లో ‘గ్యాంగ్ లీడర్’ ముందు వరుసలో ఉంటుంది. ఈసినిమా రిలీజ్ అయ్యి 35 ఏళ్లు పూర్తి అయ్యింది. 1991 మే 9న విడుదలైన గ్యాంగ్ లీడర్.. మెగాస్టార్ చిరంజీవిని తిరుగులేని "నంబర్ వన్" సింహాసనంపై కూర్చోబెట్టింది. దర్శకుడు విజయ బాపినీడు సృజనాత్మకత, పరుచూరి సోదరుల మాస్ డైలాగ్స్, బప్పీలహరి సంగీతం కలగలిసి ఈ చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్గా నిలబెట్టాయి. చిరంజీవి, విజయశాంతి, రావు గోపాల్ రావు, ఆనందరాజ్, శరత్ కుమార్, మురళీ మోహన్, నిర్మలమ్మ లాంటి స్టార్ తారాగణం నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలవడానికి గల కారణాలేంటో చూద్దాం.
రఘుపతి (మురళీ మోహన్), రాఘవ (శరత్ కుమార్), రాజారామ్ (చిరంజీవి) ముగ్గురు అన్నదమ్ములు. రఘుపతి బాధ్యతాయుతమైన అన్నగా కుటుంబాన్ని పోషిస్తుంటే, రాఘవ ఐఏఎస్ (IAS) కు సిద్ధమవుతుంటాడు. రాజారామ్ బాధ్యతారాహిత్యంగా నలుగురు స్నేహితుల గ్యాంగ్తో జాలీగా తిరుగుతుంటాడు. తమ్ముడి ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం డబ్బు కావాల్సి వస్తే, రాజారామ్ జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడడు. అయితే, నగరంలో అరాచకాలు సాగించే ఏకాంబరం (రావు గోపాల్ రావు), కనకాంబరం (ఆనందరాజ్) చేతిలో రఘుపతి దారుణంగా హత్యకు గురవుతాడు. ప్రమాదవశాత్తు జరిగిందనుకున్న అన్న మరణం వెనుక ఉన్న కుట్రను రాజారామ్ ఎలా బయటపెట్టాడు? తన కుటుంబానికి దూరమైన పరిస్థితి నుండి, తన గ్యాంగ్, ప్రియురాలు కన్యాకుమారి (విజయశాంతి) సహాయంతో విలన్ల అంతం ఎలా చూశాడు? తమతోనే ఎంతో సరదాగా ఉంటూ.. హీరోకి లైన్ వేసే కన్యాకుమారి బ్యాక్గ్రౌండ్లో ఉన్న విషాదం ఏంటి? అది ఎప్పుడు రివీల్ అవుతుంది? అనేదే మిగతా కథ.
రాజారామ్ పాత్రలో చిరంజీవి నటన, ఆటిట్యూడ్, డ్యాన్సులు, ఫైట్లు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఆయన మేనరిజం, "చెయ్యి చూశావా ఎంత రఫ్గా ఉందో.. రఫ్ ఆడించేస్తాను" అనే డైలాగ్ తెలుగు చిత్రసీమలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక హీరోయిన్ విజయశాంతి విషయానికి వస్తే.. కన్యాకుమారిగా ఆమె చిరంజీవితో సరిసమానమైన టైమింగ్తో పోటీపడి నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. డ్యాన్స్, డైలాగ్స్ విషయంలో చిరంజీవికి ఎక్కడా తగ్గలేదు విజయశాంతి. ఇక మురళీమోహన్, శరత్ కుమార్, సుమలత, సుధ, నిర్మలమ్మ, రావుగోపాల్ రావు లాంటి నటులు తమ పాత్రల పరిధిమేర అలరించారు.
'గ్యాంగ్ లీడర్' సినిమాకు చిరంజీవి మాస్ యాక్షన్ ఎంత హైలైట్ అయిందో, బప్పీలహరి అందించిన సంగీతం కూడా అంతే ప్లస్ అయింది. ఈ మూవీలో చిరంజీవి డైలాగ్స్కు, యాక్షన్ సన్నివేశాలకు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను బప్పీలహరి అందించారు. దాంతో పాటు పాటలు కూడా సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా "వానా వాన వెల్లువాయే" పాట ఇప్పటికీ ఎవర్గ్రీన్ చార్ట్బస్టర్. లోక్ సింగ్ సినిమాటోగ్రఫీ, విజయ బాపినీడు గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే సినిమాను సూపర్ ఫాస్ట్ పేస్లో నడిపించాయి.
ఈ సినిమా మొదట చిరంజీవి కోసం కాదు.. ఆయన సోదరుడు నాగబాబు కోసం అనుకున్నది. విజయ బాపినీడు మొదట నాగబాబుతో 'బొమ్మరిల్లు' తరహా ఫ్యామిలీ డ్రామా తీయాలనుకున్నారు. అందుకోసం ఈ కథను రాసుకుని 'అరేవో సాంబ' అనే టైటిల్ కూడా అనుకున్నారట. కానీ ఈ రేంజ్ మాస్ మూవీ చిరంజీవికి అయితేనే బాగుంటుందని నాగబాబు పట్టుపట్టి మెగాస్టార్తో ఈ సినిమా చేయించారట. అయితే మెగాస్టార్కి మొదట సిద్ధం చేసిన లైన్ నచ్చకపోవడంతో పరుచూరి సోదరులు రంగంలోకి దిగి కథను పూర్తిగా మాస్ ఎంటర్టైనర్గా మలిచారు. ఈ సినిమా నాగబాబు చేసి..హిట్ అయ్యి ఉంటే ఆయన కూడా కమర్షియల్ హీరోగా బిజీ అయ్యేవారేమో. కానీ ఈ విషయంపై అధికారికంగా మెగా హీరోలు మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు.
ముందుగా అనుకున్న టైటిల్ సెట్ అవ్వదని భావించి, రచయిత సత్యమూర్తి (దేవిశ్రీ ప్రసాద్ తండ్రి) అప్పట్లో 'మెగాస్టార్' పత్రికలో 'గ్యాంగ్ లీడర్' పేరుతో రాసే సీరియల్ క్యాచీ టైటిల్ను బాపినీడు గారు ఈ సినిమాకు ఖరారు చేశారు. ఈ సినిమాలో "వానా వాన వెల్లువాయే" పాట చిత్రీకరణ సమయంలో చిరంజీవి 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, షూటింగ్ ఆపకుండా వర్షంలో డ్యాన్స్ చేసి తన ప్రొఫెషనలిజాన్ని చాటుకున్నారు.
'గ్యాంగ్ లీడర్' సినిమా రిలీజ్ అవ్వడంతోనే మాస్ ఆడియన్స్ తండోపతండాలుగా థియేటర్లకు పోటెత్తారు. 1991లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 10 కోట్ల షేర్ సాధించి, అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది. 50కి పైగా కేంద్రాల్లో 100 రోజులు, పలు ప్రధాన కేంద్రాల్లో 200 రోజులకు పైగా ప్రదర్శితమైంది. ఇక ఈ మూవీ 100 రోజుల వేడుకను చిరంజీవి పుట్టినరోజున తిరుపతి, హైదరాబాద్, ఏలూరు, విజయవాడలలో ఒకేరోజు నిర్వహించారు. మూవీ టీమ్ ప్రత్యేక హెలికాప్టర్లో ఆ నగరాలన్నీ తిరుగుతూ వేడుకల్లో పాల్గొనడం టాలీవుడ్లో సరికొత్త రికార్డు.
ఈ సినిమా సంచలన విజయం తర్వాత చిరంజీవి రూ. 1.25 కోట్ల పారితోషికం అందుకొని, అప్పట్లో అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న భారతీయ హీరోగా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. 'గ్యాంగ్ లీడర్' ఘనవిజయంతో ఈ చిత్రాన్ని హిందీలో చిరంజీవి హీరోగానే 'ఆజ్ కా గూండారాజ్' పేరుతో పునర్నిర్మించగా, అక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
'గ్యాంగ్ లీడర్' కేవలం ఒక సినిమా కాదు, తెలుగు సినీ రంగాన్ని శాసించిన ఒక మాస్ సంచలనం. ఇప్పటికీ మాస్ సినిమాలకు ఇది ఒక రోల్మోడల్. ఈ తరం యూత్ కూడా చూసి ఎంజాయ్ చేయగలిగే ఈ సినిమా యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది.