
త్రిగుణ్, అఖిల్ రాజ్, హేబా పటేల్, సిరి హనుమంతు ప్రధాన పాత్రలు పోషించిన హర్రర్ మూవీ `ఈషా`. ఇందులో పృథ్వీరాజ్, మైమ్ మధు కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పకులుగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని బన్నీవాసు, వంశీ నందిపాటి విడుదల చేశారు. క్రిస్మస్ కానుకగా నేడు గురువారం(డిసెంబర్ 25న) విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
వినయ్(అఖిల్ రాజ్), అపర్ణ(సిరి హనుమంతు), కళ్యాణ్(త్రిగుణ్), నయన(హేబా పటేల్) నలుగురు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు. ఎవరికి వాళ్లు జాబ్ చేస్తూ మంచి లైఫ్ని లీడ్ చేస్తుంటారు. ఇందులో వినయ్, అపర్ణ పెళ్లి చేసుకున్న జంట. కళ్యాణ్, నయన ప్రేమలో ఉంటారు. కానీ ప్రేమని వ్యక్తం చేయడానికి భయపడుతుంటాడు కళ్యాణ్. వీరు దొంగబాబాలను పోలీసులకు పట్టిస్తుంటారు. ఈ క్రమంలో ఆది దేవ్ (పృథ్వీరాజ్) అనే డాక్టర్ కొన్నాళ్లు అదృశ్యమై, ఆ తర్వాత బాబాగా మారిపోతాడు. అతను కూడా దొంగబాబానే అని నిరూపించి పోలీసులకు పట్టించాలని ప్లాన్ చేస్తారు. ఆ సమయంలో అపర్ణ గర్భంతో ఉంటుంది. ఆమె నో చెప్పినా వినకుండా నలుగురు కారులో వెళ్తారు. ఓ ఫారెస్ట్ లో రోడ్డు మలుపు వద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. బైక్పై వస్తోన్న పుణ్యవతి అనే మహిళ చనిపోతుంది. ఆమె ఆత్మ.. తనని చూడ్డానికి వచ్చిన మరో వ్యక్తి(మైమ్ మధు)లోకి ఆవహిస్తుంది. కానీ దాన్ని పట్టించుకోకుండా ఈ నలుగురు ఆది దేవ్ వద్దకు వెళ్తారు. ఆయనతో ఈ దెయ్యాలు, బూతాలు లేవు, ఇదంతా పెద్ద డ్రామా అని సవాల్ చేస్తారు. నువ్వు నిజమైన స్వామిజీ కాదని నిరూపిస్తామని చెబుతారు. వీరి సవాల్ మేరకు ఆ ఫారెస్ట్ లో ఉన్న పాత ఇంట్లో ఉండాలని చెబుతాడు ఆది దేవ్. అందులో ఆత్మలున్నాయని, అది వరుసగా చావులకు కారణమవుతుందని, అయినా మీరు మూడు రోజులు అందులో ఉంటే ఇదంతా డ్రామా అనేది ఒప్పుకుంటానని చెబుతాడు ఆది దేవ్. దీంతో ఈ నలుగురు ఆ ఇంట్లో ఉండేందుకు సిద్ధమవుతారు. మరి ఈ మూడు రోజులు వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఎలాంటి భయానక విషయాలు చూశారు? వారి జీవితంలోని ట్విస్ట్ ఏంటి? ఆది దేవ్.. నయనకు చెప్పిన నిజాలేంటి? అనేది మిగిలిన కథ.
ఇది దెయ్యాలు ఉన్నాయా? లేవా అనే విషయాన్ని చర్చించే మూవీ. ఆత్మలున్నాయని కొందరు, లేవని మరికొందరు వాదిస్తుంటారు. దేవుడు ఉన్నాడనేది నిజమైతే, దెయ్యాలున్నాయనేది కూడా నిజమే అని మరికొందరి వాదన. ఇలాంటి కథాంశంతోనే `ఈషా` మూవీ సాగుతుంది. దెయ్యాలు, ఆత్మలు లేవని నమ్మే నలుగురి జర్నీని, వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లని, వాళ్లు ఫేస్ చేసిన అనుభవాలను ఇందులో ఆవిష్కరించారు. సాధారణంగా దెయ్యాల సినిమా అంటే ఒక ఫారెస్ట్, అందులో ఓ పాత ఇళ్లు, అందులోకి ప్రధాన పాత్రదారులు వెళ్లడం, అనేక భయానక అనుభవాలకు లోను కావడం ఉంటుంది. ఇది కూడా అలాంటి చిత్రమే అవుతుంది. సినిమా ఎక్కువగా ల్యాగ్ లేకుండా కథలోకి వెళ్తుంది. ఇద్దరు ముగ్గురు దొంగ బాబాలను పట్టించడంతో వీరి కాన్పిడెన్స్ వేరే లెవల్. దీంతో గర్భాన్ని కూడా లెక్క చేయకుండా ఆదిదేవ్ వద్దకు వెళ్తారు. అక్కడ ఓ వైపు నెగటివ్ లక్షణాలు కనిపిస్తున్నా అందులోనే ఉండటం, అ తర్వాత పలు హర్రర్ ఎలిమెంట్లు చోటు చేసుకోవడం, అనేక హత్యలు, ఆత్మహత్యలను అందులో చూడటం, విచిత్రమైన శబ్దాలు రావడం, వింత రూపాలు కనిపించడం వంటివి ఫేస్ చేస్తారు. అయినా అందులో ఉండాలనుకోవడం, బాబాతో సవాల్ చేయడం, అనంతరం జరిగే పరిణామాలు కొంత ఊహకు అందేలా ఉంటాయి. కథనం రెగ్యూలర్గానే అనిపిస్తుంది. కానీ ఆద్యంతం భయపెట్టేలా సీన్లు ఉండటం విశేషం. ఫారెస్ట్ లోని ఇంటికి వెళ్లాక అసలు హర్రర్ స్టార్ట్ అవుతుంది. సస్పెన్స్ ని ఇస్తూ హర్రర్ ఎలిమెంట్లని చూపించిన తీరు మాత్రం వాహ్ అనిపిస్తుంది. వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఒక్క రోజుకే భయంతో వణికిపోతుంటారు. అయినా బాబాతో సవాల్ చేయడం విశేషం. రెండో రోజు మరింత విచిత్రమైన సంఘటనలు, వింత దృశ్యాలను చూసి అపర్ణ వణికిపోతుంది. ఆ తర్వాత ఈ నలుగురు జీవితాలకు సంబంధించిన ట్విస్ట్ షాకిస్తోంది. బాబా చెప్పిన నిజాలు ఆశ్చర్యపరుస్తాయి. అప్పటి వరకు సీట్ ఎడ్జ్ హర్రర్ థ్రిల్లర్ కి గురి చేస్తూ, చివర్లో వారి పాత్రల్లోని విషాదాన్ని రివీల్ చేయడంతో కొంత ఎమోషనల్గా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. అయితే ఆ ఇంట్లో వరుసగా కొన్ని కుటుంబాలు హత్యకు గురయ్యారని చెప్పారు. దాన్ని విజువల్గా చూపిస్తే బాగుండేది. ఇంకా హర్రర్ ఎలిమెంట్లకి సంబంధించిన సన్నివేశాలను చూపించాల్సింది. అదే సమయంలో ఇది చాలా రొటీన్గా అనిపిస్తుంది. ఊహించినట్టుగానే ఉంటుంది. చివర్లో ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది.
నలుగురు స్నేహితులుగా త్రిగుణ్, సిరి, హేబా పటేల్, అఖిల్ రాజ్ చాలా బాగా నటించారు. అదరగొట్టారు. హర్రర్ సన్నివేశాల్లో మాత్రం బాగా చేశారు. ఆడియెన్స్ ని బయటపెట్టించారు. ఆది దేవ్గా పృథ్వీరాజ్ చాలా సెటిల్డ్ గా కనిపించే పాత్ర. అదే సమయంలో ఆయనకు ఇది కొత్త రకమైన రోల్గా చెప్పొచ్చు. పాత్రలో జీవించి మెప్పించారు. మైమ్ మధు మరో స్పెషల్ ఎట్రాక్షన్. ఆయన చాలా బాగా చేశాడు. మిగిలిన పాత్రలు ఫర్వాలేదనిపించాయి.
ఆర్ఆర్ ధృవన్ సంగీతం సినిమాకి పెద్ద అసెట్. ఆయన హర్రర్ ఎలిమెంట్లని ఎలివేట్ చేసేలా బీజీఎం అందించారు. భయపెట్టించారు. థ్రిల్కి గురి చేశారు. సినిమా ఆయనే నడిపించారని చెప్పొచ్చు. విజువల్స్ కూడా బాగున్నాయి. కొత్తగా ఉన్నాయి. ఎడిటింగ్ ఉన్నంతలో ఫర్వాలేదు. దర్శకుడు శ్రీనివాస్ మన్నె ఎంచుకున్న కథ బాగానే ఉంది. పాయింట్ కాస్త కొత్తగా ఉంది. హర్రర్ ఎలిమెంట్లు రెగ్యూలర్గా ఉన్నా, చివర్లో ఇచ్చిన ట్విస్ట్ వాహ్ అనిపిస్తుంది. అది సినిమా కథ మొత్తాన్ని మార్చేస్తుంది. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ కొంత రొటీన్గా నడిపించాడనే ఫీలింగ్ కలిగింది. గర్బంతో ఉన్న మహిళని ఇందులో ఇన్వాల్వ్ చేయడం అంతగా రుచించదు. ఓవరాల్గా భయపెట్టడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.
ఫైనల్గా : వణుకుపుట్టించి థ్రిల్ చేసే `ఈషా`. హర్రర్ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చే చిత్రమవుతుంది.