పాకిస్థాన్ లో ఐటీ రంగం పెద్దగా ఉండదని చాలా మందికి తెలిసిందే. అయితే పాకిస్థాన్లో కూడా పలు ఎంఎన్సీ కంపెనీలు కూడా ఉన్నాయి. వాటిలో మైక్రోసాఫ్ట్ ఒకటి. కానీ తాజాగా ఈ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచంలో ప్రముఖ టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్లో తన కార్యకలాపాలకు గుడ్బై చెప్పింది. రెండు దశాబ్దాలకు పైగా పాకిస్థాన్లో డిజిటల్ ప్రగతికి తోడ్పాటుగా నిలిచిన ఈ సంస్థ, ఇప్పుడు అక్కడ తన ఆఫీస్లను మూసివేసింది. యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, మైక్రోసాఫ్ట్ పాక్ సీఈవో వ్యాఖ్యలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
27
సీఈవో ధ్రువీకరణ
పాకిస్థాన్లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాల ముగింపుపై ఆ దేశంలో సంస్థ సీఈవోగా ఉన్న జవాద్ రెహ్మాన్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. "ఇక్కడ మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు ముగిసినట్లు సమాచారం. కొంతమంది ఉద్యోగులకు ఈ విషయం తెలియజేస్తున్నాము. ఇది ఒక శకానికి ముగింపు" అని పేర్కొన్నారు. 2000లో మైక్రోసాఫ్ట్ పాక్ శాఖను జవాద్ రెహ్మాన్ నేతృత్వంలోనే ప్రారంభించారు.
37
విద్య, గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర
పాకిస్థాన్లో మైక్రోసాఫ్ట్ సాధారణ వాణిజ్య కార్యకలాపాలకు పరిమితంకాకుండా, డిజిటల్ రంగ అభివృద్ధికి దోహదపడింది. గ్రామీణ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం, విద్యాసంస్థలతో భాగస్వామ్యం, చిన్న వ్యాపారులకు టెక్నాలజీ పరిజ్ఞానం కల్పించడం వంటి సేవలు అందించింది. యువతను డిజిటల్ ప్రపంచానికి దగ్గర చేయడమే లక్ష్యంగా పాకిస్థాన్లో మైక్రోసాఫ్ట్ పని చేసింది.
మైక్రోసాఫ్ట్ ఉపసంహరణ వెనుక పలు కారణాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పాకిస్థాన్లో అధిక పన్నులు, రాజకీయ అస్థిరత, కరెన్సీ మార్పిడి సమస్యలు, టెక్నాలజీ దిగుమతులపై ఆంక్షలు వంటి అంశాలు కంపెనీని ఇబ్బందిలోకి నెట్టినట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మీద విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినడంతో మైక్రోసాఫ్ట్ తదితర దిగ్గజాలు ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.
57
దారుణమైన ఆర్థిక పరిస్థితుల ప్రభావం
2024 ఆర్థిక సంవత్సరంలో పాక్ వాణిజ్య లోటు 24.4 బిలియన్ డాలర్లకు చేరింది. విదేశీ మారక నిల్వలు 11.5 బిలియన్ డాలర్ల వరకు పడిపోయాయి. ఈ క్రమంలో టెక్ దిగుమతులపై ప్రభావం చూపడంతోపాటు, అంతర్జాతీయ సంస్థలు కూడా వెనక్కి తగ్గుతున్నాయి. దీని ప్రభావంతో దేశీయ నిరుద్యోగిత పెరుగుతోంది, నిపుణుల వలసలు గణనీయంగా పెరిగాయి.
67
మాజీ అధ్యక్షుడి ఆవేదన
ఈ అంశంపై పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ స్పందిస్తూ, మైక్రోసాఫ్ట్ తరహా సంస్థలను నిలుపుకోలేకపోవడం దేశానికి తీవ్ర నష్టమని వ్యాఖ్యానించారు. బిల్ గేట్స్ 2022లో పాక్ పర్యటన సందర్భంగా పెట్టుబడులపై చర్చలు జరిగినప్పటికీ, రాజకీయ మార్పుల కారణంగా అవకాశాలు చేజారిపోయాయని తెలిపారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వియత్నాం వంటి ఇతర మార్కెట్లపై దృష్టి పెట్టడం, పాక్ మాత్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడం ఆవేదనకరం అన్నారు.
77
ప్రపంచవ్యాప్తంగా కోతలు
ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు కోత పెడుతోంది. కాస్ట్ కంట్రోల్లో భాగంగా మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 4 శాతానికి తక్కువ కాకుండా తొలగించాలని నిర్ణయించింది. దీంతో సుమారు 9 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ తొలగింపులు Xbox, గేమింగ్ విభాగాల్లో ఉండనున్నాయి. గత 18 నెలల కాలంలో మైక్రోసాఫ్ట్ చేపట్టనున్న నాలుగో అతిపెద్ద ఉద్యోగాల కోత ఇదే కావొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.