Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే

Published : Aug 26, 2026, 04:56 PM IST

Smartphone: ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఫిలిప్స్ త్వరలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తన వెబ్‌సైట్, సోషల్ మీడియా ఛానళ్ల ద్వారా టీజ్ చేసింది.

PREV
20Hz డిస్‌ప్లేతో కొత్త ఫోన్

అమెజాన్‌లో ఏర్పాటు చేసిన మైక్రోసైట్‌లో కనిపించిన టీజర్ ప్రకారం.. ఫిలిప్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల HD డిస్‌ప్లే ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో స్క్రోలింగ్, వీడియోలు, ఇతర కంటెంట్‌ను మరింత స్మూత్‌గా చూడవచ్చు. ఫోన్‌లో 5G కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉండనుంది.

64MP కెమెరా.. 16MP సెల్ఫీ కెమెరా

కెమెరా విషయంలోనూ ఫిలిప్స్ మంచి స్పెసిఫికేషన్లను అందిస్తోంది. ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రియ‌ర్ కెమెరాను అందించ‌నున్నారు. అలాగే వీడియో కాల్స్‌, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించ‌నున్న‌ట్లు టీజ‌ర్ ద్వారా తెలుస్తోంది. కెమెరా పనితీరు, ఇతర సెన్సార్ల వివరాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్

ఫోన్‌ను రెండు ర్యామ్‌, స్టోరేజ్ వేరియంట్లలో తీసుకురానున్నట్లు సమాచారం. 6 జీబీ, 8 జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో ఉండ‌నున్నాయి. అలాగే ఫోన్‌కు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉండ‌నున్నాయి. వీటిని ఫిలిప్స్ అల్ట్రా మ్యాక్స్ పేరుతో ప్రచారం చేస్తోంది. దుమ్ము, నీటి చినుకుల నుంచి కొంత రక్షణ కోసం ఫోన్‌కు ఐపీ64 రేటింగ్ ఇవ్వ‌నున్నారు.

ధ‌ర ఎంత ఉండొచ్చు.?

ఫిలిప్స్ ఇంకా ఫోన్ ధరను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పటివరకు వెల్లడైన ఫీచర్లను చూస్తే దీని ధర రూ. 20 వేల‌లోపు ఉండే అవకాశం ఉందని అంచనా. ఈ ధరలో ఫోన్ విడుదలైతే ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న పలు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లకు మంచి పోటీ ఇవ్వ‌నుంది. ఫోన్ పేరు, ధర, లాంచ్ తేదీ వంటి పూర్తి వివరాలను కంపెనీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఫిలిప్స్ ప్రస్తుతం ఈ ఫోన్‌ను ఇన్నోవేటివ్ యు కెన్ ట్ర‌స్ట్ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రచారం చేస్తోంది.

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త పోటీ

ప్ర‌స్తుతం భార‌త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బ‌డ్జెట్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా రియ‌ల్‌మీ, రెడ్‌మీ, వ‌న్‌ప్ల‌స్, ఒప్పో, వివో వంటి కంపెనీల మ‌ధ్య పోటీ ఉంది. కాగా ఇప్ప‌టికే ఫైర్ బోల్ట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. మీవి కూడా కొత్త ఫోన్‌ను టీజ్ చేస్తోంది. ఏఐ+ ఈ విభాగంలో ఫోన్లను విడుదల చేసింది. మైక్రోమాక్స్ కూడా తిరిగి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు ఉన్నాయి.

మరోవైపు RAM, స్టోరేజ్ వంటి విడిభాగాల ధరలు పెరగడంతో బడ్జెట్ ఫోన్ల తయారీ ఖర్చులు కూడా పెరిగాయి. దీంతో గతంలో ఉన్న తక్కువ ధరలకు ఫీచర్లతో కూడిన ఫోన్లను అందించడం కంపెనీలకు కష్టంగా మారింది. ఈ కారణంగా కొన్ని పెద్ద బ్రాండ్లు అధిక లాభాలు వచ్చే ధరల విభాగాలపై దృష్టి పెడుతున్నాయి. ఈ ఖాళీని ఫిలిప్స్ వంటి ఇతర కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్లు భర్తీ చేయాలని చూస్తున్నాయి. మ‌రి ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఏమేర‌కు ప్ర‌భావితం చేస్తుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories