ధోని కూతురికి మెస్సీ ప్రత్యేక బహుమతి.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

First Published Dec 28, 2022, 1:44 PM IST

Lionel Messi: అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్  మెస్సీ  ఇటీవలే తన  సుదీర్ఘ కెరీర్ లో లోటుగా ఉన్న  ఫిఫా ప్రపంచకప్ ను అందుకున్నాడు.  తాజాగా మెస్సీ టీమిండియా మాజీ  సారథి మహేంద్ర సింగ్ ధోని కూతురికి  స్పెషల్ గిఫ్ట్ పంపాడు. 

Lionel Messi

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించిన  ఫిఫా వరల్డ్ కప్  ముగిసి పది రోజులు కావస్తోంది.   ఫైనల్లో అర్జెంటీనా.. ఫ్రాన్స్ ను ఓడించి   మూడో వరల్డ్ కప్ కొట్టింది.   ప్రపంచకప్ జరిగినన్ని రోజులూ  అభిమానుల నోళ్లల్లో మెదిలిన  మెస్సీ  టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు.  

తన అభిమానులను తరుచూ   సోషల్ మీడియా  వేదికగా పలకరిస్తున్న ఈ దిగ్గజం భారత్ లో తన ఫ్యాన్స్ కు ప్రత్యేక బహుమతులు పంపుతున్నాడు.  ఇదివరకే  బీసీసీఐ ప్రధాన కార్యదర్శి  జై షాకు  తన ఆటోగ్రాఫ్ తో ఉన్న  జెర్సీని  పంపాడు. ఈ జెర్సీని  మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా.. జై షాకు అందించాడు. 

తాజాగా  మెస్సీ.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్  ధోని  కూతురు జీవాకు   కూడా తన జెర్సీని పంపాడు.   జెర్సీ మీద ‘పారా జీవా’ (జీవా కోసం) అని రాసి ఉంది. మెస్సీ నుంచి  జెర్సీని అందుకున్న జీవా.. దానిని వేసుకుని మురిసిపోయింది.   ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. 

ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.  ధోనికి క్రికెట్ తో పాటు ఫుట్‌బాల్ అంటే కూడా చాలా ఇష్టం. క్రికెట్ ప్రారంభించడానికంటే  ముందు ధోని ఫుట్‌బాల్ ఆడేవాడని  గతంలో  స్వయంగా అతడే పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. తండ్రి వలే జీవాకు కూడా ఫుట్‌బాల్ అంటే ఇష్టమేనట.  

ఇక ఫిఫా ప్రపంచకప్ విషయానికొస్తే.. ఫైనల్లో అర్జెంటీనా ఫ్రాన్స్ ను ఉత్కంఠపోరులో ఓడించింది.  నిర్ణీత సమయంలో ఇరు జట్లూ చెరో గోల్ చేయగా  పెనాల్టీ షూట్ అవుట్ లో అర్జెంటీనా నాలుగు గోల్స్ చేయగా ఫ్రాన్స్ రెండు గోల్స్ మాత్రమే చేసింది.  దీంతో  మెస్సీ అండ్ కో. విశ్వ విజేతగా నిలిచింది. 

click me!