
హీరో సత్యదేవ్ తాజా చిత్రం 'కృష్ణమ్మ' గత శుక్రవారం (మే 10) థియేటర్లలో గ్రాండ్గా రిలీజైంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాకి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. కానీ మినిమం కలెక్షన్స్ కూడా రాలేదు. ఆక్యుపెన్సీ కూడా పెద్దగా లేకపోవడంతో మూవీ టీమ్కి నిరాశ తప్పలేదు. అయితే తాజాగా ఈ చిత్రం వారం తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపధ్యంలో అసలు కృష్ణమ్మ చిత్రం వారంకే ఓటిటిలోకి రావటం వెనక ఏం జరిగిందనే విషయమై మీడియాలో చర్చ మొదలైంది. అసలేం జరిగింది.
మామూలుగా థియేటర్లో రిలీజైన సినిమా ఓటీటీలోకి రావాలంటే కనీసం 3 నెలలైనా పట్టేది. కానీ ఈ మధ్య కాలంలో ఆ రూల్ ని ప్రక్కన పెట్టి నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. అయితే తాజాగా ఈ చిత్రం ఏకంగా వారం రోజులకే ఓటీటీలోకి అడుగుపెట్టి ఆడియన్స్కి షాకిచ్చింది. అయితే ఇలా రావటం వెనక ఆచార్య ప్లాఫ్ కారణం ఉందని తెలుస్తోంది. చిరంజీవి ఆచార్యకు, ఈ సినిమాకు లింకేంటి అంటే...
కృష్ణమ్మ చిత్రానికి టాప్ డైరక్టర్ కొరటాల శివ సమర్పణ. అందుకే ఈ సినిమా ప్రమోషన్ కు తన తోటి డైరక్టర్స్ ని పిలిచారు ఆయన. కొరటాల శివ స్నేహితుడు కృష్ణ ఈ సినిమాకు నిర్మాత. అయితే ఈ సినిమా షూటింగ్ యేడాదిన్నర క్రితమే పూర్తైంది. అలాగే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 7 కోట్లు మాత్రమే. దాంతో సత్యదేవ్ కు కి ఓటిటిలో ఉన్న మార్కెట్ దృష్ట్యా, కొరటాల శివ బ్రాండ్ నేమ్ తో మంచి లాభాలే వస్తాయనుకున్నారు.
ఇక చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న సమయంలో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల నాన్ థియేట్రికల్ ఆఫర్ వచ్చింది. అయితే కొరటాల శివ, ఆయన స్నేహితుడు కృష్ణ అప్పుడు ఓటిటిలో ఉన్న డిమాండ్ దృష్ట్యా 12 కోట్లు డిమాండ్ చేసారట. అయితే అంత రేటు పెట్టి సత్యదేవ్ సినిమా అదీ కొత్త దర్శకుడు సినిమా కొనలేమని ఓటిటి సంస్దలు ప్రక్కకు వెళ్లిపోయాయి.
అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ చేద్దామంటే ఓటిటి బిజినెస్ పూర్తి చేయాలని ఆగారు. అయితే రాను రాను రేటు తగ్గుతూ వచ్చిందే కానీ పెరగలేదు. మరో ప్రక్క ఓటిటి బిజినెస్ పూర్తిగా పడిపోయి పెద్ద స్టార్స్ సినిమాలు తప్పించి కొనటం లేదు. దానికి తోడు సత్యదేవ్ సినిమాలు భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతూ వచ్చాయి. ఇవన్నీ ఒకెత్తు..ఏదైతే కొరటాల శివ బ్రాండ్ తమ సినిమకు ప్లస్ అవుతుందనుకున్నారో అదే ఆచార్యతో పోయింది.
కొరటాల శివ, రామ్ చరణ్, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య చిత్రం భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దాంతో కృష్ణమ్మకు మినిమం బిజినెస్ కూడా జరగదని అర్దమైపోయింది. లాస్ కు అయినా బయిటకు పంపాలి..కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ఆడుతుందనే నమ్మకంతో రిలీజ్ చేసారు. ఈ క్రమంలో నాన్ థియేటర్ రైట్స్ 3 కోట్లుకు ఇచ్చేసారట. నిర్మాతలు మైత్రీమూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్నైంట్ ద్వారా సొంత రిలీజ్ చేసారు.
ఈ క్రమంలో అమేజాన్ సంస్దవారు ఈ సినిమా డిజిటిల్ ఎగ్రిమెంట్ లో రిలీజైన వారంలో ఈ సినిమాని ఓటిటిలో వేసుకునేలా సైన్ చేయించుకున్నారట. మాములుగా డైరక్ట్ ఓటిటిలో రిలీజ్ చేద్దామనుకుంటే పబ్లిసిటి చేసి థియేటర్ లో ఓ వారం అయినా ఆడితేనే తీసుకుంటామని ఓటీటి సంస్ద చెప్తే ఈ సినిమాని థియేటర్ రిలీజ్ పెట్టారని తెలుస్తోంది.మొదట టేబుల్ ప్రాఫెట్ అనుకున్న సినిమా చివరకు ఇంత భారీ లాస్ తో రిలీజ్ చేయాల్సిన సిట్యువేషన్ ఏర్పడింది.
కృష్ణమ్మ సినిమాను సత్యదేవ్ కూడా గట్టిగానే ప్రమోట్ చేశాడు. రివ్యూల్లో కూడా సత్యదేవ్ నటనకి మంచి మర్కులు పడ్డాయి. కానీ ఆడియన్స్ మాత్రం థియేటర్లకి రాకుండా హ్యాండ్ ఇచ్చారు. ఐపీఎల్ సీజన్ కావడంతో ఈ మధ్య కాలంలో సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. అందులోనూ ఎలక్షన్ హడావిడి కూడా నడుస్తుండటంతో పెద్ద సినిమాలు ఏవీ థియేటర్లలో అడుగుపెట్టలేదు. దీంతో చిన్న సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు.
ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియోలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో ప్రసారమవుతుంది. మిగిలిన దక్షిణాది భాషల విషయం మాత్రం తెలీలేదు. సినిమాకి మంచి టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు లేకపోవడం కృష్ణమ్మ టీమ్ను బాగా నిరాశపరిచింది. అందుకే ఇంత తక్కువ వ్యవధిలో ఓటీటీలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ సమయంలో ఓటీటీలో మరే తెలుగు సినిమా రాలేదు.