పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో `హరిహర వీరమల్లు` కూడా ఉంది. 17వ శతాబ్దంలో హిస్టారికల్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మోఘల్ చక్రవర్తి, గోల్కొండ నవాబ్ల దోపిడిపై తిరుగుబాటు చేసిన బందిపోటు వీరమల్లు కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మాత. ఇందులో పవన్ కళ్యాణ్కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాబీ డియోల్ ఢిల్లీ మోఘల్ చక్రవర్తి పాత్రలో కనిపించబోతున్నారు. ఇది రెండు పార్ట్ లుగా రానుంది. మొదటి పార్ట్ ఈ ఏడాదిలోనే థియేటర్లోకి తీసుకురాబోతున్నారు.
తాజాగా నేడు(మే 2న) `హరిహర వీరమల్లు` టీజర్ విడుదలైంది. ఇందులో పవన్ పాత్ర విరోచిత పోరాటాన్ని చూపించారు. పేదల కోసం, దోపిడికి గురవుతున్న ప్రజలకు అండగా నిలిచే వీరమల్లు పాత్రలో అదరగొట్టాడు. అదిరిపోయే యాక్షన్ సీన్లతో గూస్బంమ్స్ తెప్పించాడు. యుద్ధ సన్నివేశాల్లో తనదైన స్పెషాలిటీతో బీభత్సం సృష్టించాడు. విజువల్స్, యాక్షన్ సీన్లు ఈ టీజర్లో హైలైట్గా నిలిచాయి. పవన్ కి డైలాగ్లు లేకపోవడం కాస్త నిరాశ పరిచే అంశం.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి దర్శకుడు ఎవరనేది ప్రకటించలేదు టీమ్. మొదట్లో సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కానీ ఆయన పేరు ఇప్పుడు తొలగించడం ఆశ్చర్యంగా మారింది. అసలు దర్శకుడు ఎవరనేది కూడా పోస్టర్లో, టీజర్లో మెన్షన్ చేయలేదు. దీంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా దర్శకుడిగా కొత్త పేరుని వెల్లడించింది టీమ్. జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటాడని, మిగిలిన షూటింగ్ పార్ట్ కి అతనే డైరెక్ట్ చేస్తాడని, క్రిష్ పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు.
మరి దర్శకుడిగా క్రిష్ తప్పుకోవడానికి కారణం ఏంటనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి మొదట్నుంచి క్రియేటివ్ డిఫరెంట్స్ వస్తుందనే వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్కి, క్రిష్కి మధ్య క్రియేటివ్ డిఫరెంట్స్ వస్తున్నాయనే ప్రచారం జరిగింది. స్క్రిప్ట్ లో పవన్ కొన్ని మార్పులు చెప్పారని, దానికి క్రిష్ నో చెప్పాడని తెలిసింది. తన మాట వినకపోవడం వల్లే పవన్ ఈ సినిమా విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాడనే ప్రచారం కూడా జరిగింది.
అయితే మధ్యలో మళ్లీ షూటింగ్కి సంబంధించిన హడావుడి జరిగింది. మూడు నాలుగు రోజులు వర్క్ షాప్ కూడా చేశారు. ఇందులో మెయిన్ కాస్టింగ్, టెక్నీకల్ టీమ్ కూడా పాల్గొంది. టైమ్ వేస్ట్ కాకుండా షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కొన్ని రోజులు కూడా షూట్ చేశారు. ఇందులో బాబీ డియోల్ కూడా పాల్గొన్నారు. ఓ షెడ్యూల్ తర్వాత మళ్లీ వ్యవహారం మొదటికొచ్చింది. క్రిష్, పవన్ మధ్య అదే గ్యాప్ ఉందనే టాక్ చిత్ర వర్గాల నుంచి వినిపించింది.
`హరిహర వీరమల్లు` కంటే లేట్గా స్టార్ట్ అయిన `భీమ్లా నాయక్`ని కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. ఆ తర్వాత `బ్రో` సినిమాని కూడా త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయడం కూడా జరిగిపోయాయి. అంతేకాదు చాలా లేట్గా ప్రకటించిన `ఓజీ` సినిమా షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరో 20 రోజులు పవన్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటే ఇది పూర్తవుతుంది. సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. దీంతోపాటు `ఉస్తాద్ భగత్ సింగ్` షూటింగ్ కూడా కొంత పార్ట్ అయిపోయింది. కానీ `హరిహర వీరమల్లు` మాత్రం అక్కడే ఆగిపోయింది.
హిస్టారికల్ మూవీ కావడంతో, కాస్ట్యూమ్ బేస్డ్ మూవీ కావడంతో లుక్ పరంగా, గెటప్ పరంగా ఒకేలా ఉండాలి, పూర్తిగా దీనికే టైమ్ కేటాయించాలి. ఈ నేపథ్యంలోనే సినిమాని డిలే చేస్తున్నారని తెలిసింది. కానీ పవన్, క్రిష్ మధ్య ఆ డిఫరెన్స్ కొనసాగుతూనే ఉందట. ఓ వైపు షూటింగ్ డిలే కావడం, మరోవైపు పవన్తో గ్యాప్ కారణంగా క్రిష్ మరో ప్రాజెక్ట్ కి వెళ్లిపోయారట.
క్రిష్ ప్రస్తుతం అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో `ఘాటి` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించే ఈ చిత్రాన్ని లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో క్రిష్ బిజీగా ఉన్న కారణంగా ఆయన `హరి హర వీరమల్లు` నుంచి అధికారికంగా దర్శకుడి బాధ్యతల నుంచి తప్పుకున్నారని సమాచారం. కాకపోతే ఆయన పర్యవేక్షణలోనే షూటింగ్ చేస్తామని టీమ్ తెలపడం విశేషం.
ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన దర్శకుడు జ్యోతికృష్ణ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరం. ఆయన `ఎనక్కు 20 ఉనక్కు 18`, `నీ మనసు నాకు తెలుసు`, `ఆక్సిజన్`, `రూల్స్ రంజాన్` వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ ఈ మూవీ మిగిలిన పార్ట్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఆయన ఎవరో కాదు `హరిహర వీరమల్లు` నిర్మాత ఏఎం రత్నం కొడుకు కావడం విశేషం. మరి సక్సెస్లు లేని జ్యోతికృష్ణ ఈ మూవీని డీల్ చేస్తాడా? అనేది పెద్ద ప్రశ్న. ఏం జరుగుతుందో చూడాలి.